Friday 21 December 2018

పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా! - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
అన్నమయ్య ఈ కీర్తనలో నాలుక పవిత్రం కావాలంటే ఉబుసుపోని పలుకులు, వాళ్ళ మీద వీళ్ళమీద చెప్పుకునే చాడీలు వద్దు అంటున్నాడు. శ్రీవేంకటేశ్వరుని బహువిధాల కీర్తించినప్పుడు మాత్రమే మనిషి జిహ్వ పవిత్రమౌతుంది అంటున్నాడు.
కీర్తన:
పల్లవి: పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి ||పల్లవి||
చ.1.హరినామములే పాడి అతనిపట్టపురాణి
ఇరవై మించినయట్టియిందిరం బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ||పావ||
చ.2.ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబు కంఠ మంకెతోఁ బాడి ||పావ||
చ.3.శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి
శ్రీవత్సము తోడురముఁ జెలఁగి పాడి
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ||పావ||
“ఓ జీవుడా! నీ జిహ్వతో శ్రీనివాసుని వేవేల కీర్తించి పావనం కారాదా! నీ నాలుకను పావనం చేసుకోరాదా! అని విన్నవిస్తున్నాడు.
ఓ జిహ్వా! నిరంతరం శ్రీహరి నామాలను కీర్తించు. ఆయన పట్టపురాణి యైన ఇందిరను కీర్తించు. ఆ శ్రీహరి శంఖు చక్రాలను కీర్తించు. ఆయన కటిప్రదేశములో నున్న వరద హస్తాన్ని కీర్తించు. ఆవిధంగా కీర్తించి తరించమని మోక్షప్రాప్తిని పొందమని అన్నమయ్య ఉద్బోధ.
ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువును ప్రార్ధిద్దాం. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీదేవి ఆయన పాదములను ఒత్తుతుండగా చూచి తరించి కీర్తిద్దాం. పదునాలుగు భువనభాండమ్ములను ఆనందంతో మోస్తున్న ఆదిదేవుని కీర్తిద్దాం. ఆదరంగా శంఖంవంటి కంఠముగల శ్రీనివాసుని చేరి కీర్తిద్దాం.
శ్రీవేంకటేశ్వరుని మనసారా త్రికరణ శుద్ధితో కీర్తిద్దాం. ఆయన శిరసుపై ఉన్న తులసిమాలను కీర్తిద్దాం. విజృంభించి ఆయన వక్షస్థలంపై గల శ్రీవత్సము అనే పేరుగల పుట్టుమచ్చను కీర్తిద్దాం. ఆదేవదేవుని మకరకుండలములను గాంచి కీర్తించి తరిద్దాం. పొందికగా శోభించే ఆయన సర్వాంగాలను కీతించి తరిద్దాం రండి అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
విశ్లేషణ : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య

Monday 17 December 2018

ఇన్నియు నుండగా తమకేమి గడమ - అన్నమయ్య కీర్తన


అన్నమయ్య కీర్తన


ప. ఇన్నియు నుండగా తమకేమి గడమ
ఉన్నవాడు శ్రీ పురుషోత్తమ రాజు


1. వీలుచు నీ రావటించి వేదమరాజు
కూలికి గుండ్లు మోచి కూర్మరాజు
పోలిమి నేలలు దువ్వి బొలమురాజు
నాలి బడుఛాటలాడి నరిసింగరాజు //


2. చేకొని చేతులు చాచి జిక్కరాజు
రాకపోగా దపసాయె రామరాజు
రాకట్నములె గట్టి రాఘవరాజు
రేకల బసుల గాచి కృష్ణరాజు


3. మగువల కిచ్చలాడి మాకరాజు
జగమెల్ల దిరిగీని జక్కరాజు
నగుబాటు దీర శ్రీ వెంకటనగముపై
వెగటై లోకమునేలే వెంగళరాజు

పురుషోత్తమ రాజు గారికి ఎన్నో ఘనమైన బిరుదులున్నాయి. ఇంకేమి కొరత ?
సాక్షాత్తూ సిరిని కూడా కలిగి యున్నవాడు. నీటమునిగిన వేదాలను బయటకు తెచ్చ్చిన వేదమరాజు (మత్స్యావతారం ). శ్రమపడి కొండను మోసిన కూర్మరాజు. (కూర్మావతారం). కోరలతో నేలను తవ్విన పొలమురాజు (వరాహావతారం). లక్ష్మీదేవి కన్నుగప్పి చెంచు కన్యతో యవ్వనపులాటలాడిన నరసింగరాజు (నరసింహావతారం).


కఠినమైన ఉద్ద్దశ్యంతో చేతులు చాచిన జిక్కరాజు (వామనావతారం). (చేతిలో చిన్న దండం కాబట్టి జిక్క అన్న పదం ఉపయోగించాడు పేద తిరుమలయ్య). రాజులపై దండెత్తి చివరకు రాముని దర్శనం చేసుకున్న తరువాత తపస్సుకు వెళ్లిన పరశురామరాజు. రాజరికాన్ని విడిచిపెట్టి అడవులకేగిన రాఘవరాజు (రామావతారం). రేపల్లెనందు పశువులుగాచిన కృష్ణరాజు.


పడుచులతో ఇఛ్చాకములాడి పనులు సాధించిన మాకరాజు (బుద్ధావతారం).
జగములంతటా తిరుగుతూ రక్షణచేసే చక్కరాజు. (కల్కి అవతారం). పై అవతారాల్లో చేసిన పనులకు అలసటపొంది వెంకటాచలముపై నిలబడి లోకరక్షణ చేస్తున్నాడు వెంగళరాజు.


వార్ధక్యం



నా ఆత్మీయ సోదరుని పరితాపం చూసి కలిగిన భావోద్వేగం.
బరువైన బాధ్యతలను సంతోషంగా స్వీకరించి మాతాపితరుల ఋణం
తీర్చుకున్న రోజులు ..
సంతాన లేమితో మానసికవ్యధని అనుభవించినా ప్రాప్తమింతేనని సరిపెట్టుకుని నిరాశ చెందని రోజులు.
ఉన్నలో ఉన్నంత అసహాయులకు సాయం చేసి సంతృప్తి పొందిన రోజులు.
అయినవాడని చేరదీసి, ఆలనా పాలనా చూసి చరమాంకంలో ఆదుకుంటాడని
ఆశించిన రోజులు.
స్వార్ధపరులైన వారు చూపిన అమానుష నిర్లక్ష్య చర్యలకు తనలో తానే
ఆక్రోశించిన రోజులు.
అనారోగ్యంతో, ఆవేదనతో అర్ధాంగి నిష్క్రమణం. ఒంటరితనంతో
పరితపించిన రోజులు.
వృధ్ధాప్యంలో ఆదుకోవలసిన చేయి తృణీకరిస్తే ఆవేదనతో దుఃఖిoచిన రోజులు.
ఒంటరిగా పూటకూళ్ళ ఇంటి భోజనంతో అంత్యదినం కోసం ఆశగా
ఎదురుచూస్తున్న రోజులు
-- పొన్నాడ లక్ష్మి 

Friday 7 December 2018

ఆక్రోశం.


ఆక్రోశం.

కన్నెప్రాయంలో రెక్కలు విచ్చుకుంటున్న కోరికలు.
పరువాల సందడిలో చెలరేగుతున్న అలజడులు.
తీయని కలల ప్రపంచంలోకి అడుగిడిన లేత మనసు.
పుస్తకాల దొంతరలో ప్రేమలేఖలు, స్నేహితులతో పంపిన రాయబారాలు.
కవ్విస్తున్న చిలిపి చూపులు, చతుర సంభాషణలు వెరసి
పరవశంతో ప్రేమప్రహసనానికి నాంది.
భయభక్తులతో, ఆలోచనలతో వెనుకడుగువేసిన ఆడతనం.
అన్నీ తానె అయి ఉంటానని చేసిన ప్రేమబాసలు.
నమ్మికతో, పెద్దల అనుమతితో జరిగిన కల్యాణం.
కొద్దిరోజులు కొత్తకోరికల మత్తు, ఆపై బయటపడుతుంది అసలు నైజం.
మోజు తీరి బయటపడిన పురుషాహంకారం, అధికారంతో ఇల్లాలిపై జులుం.
పెరిగిన సంసార భారంతొ బరువుగా కదిలిపోయిన కాలం.
వయసుపైబడి, సత్తువ తగ్గి గడుపుతున్న చివరి రోజులు.
అప్పుడే కావాలి ఒకరికొకరి సహకారం, సామీప్యత..
పదవీవిరమణ, విశ్రాంతీ సమయం అతనికి అవసరం.
సమయానుకూలంగా అన్నీ అమర్చిపెట్టడం ఆమె బాధ్యత.
వంటింటికి మాత్రమే పరిమితమై అప్యాయతానురాగాలకి నోచుకోని ఇల్లాలు.
సానుభూతి, సహకారం లేదు, విహారాలు, వినోదాలు అసలే లేవు.
భర్తగల ఇల్లాలికి, భర్తృ విహీనకి తేడాలేని వైనం.
ఒకే గూటి కింద ఉన్నా ఎప్పుడూ మౌనమే రాజ్యమేలుతూంటుంది.
ఆక్రోశించే మనస్సు, అనురాగంకోసం అలమటించే మనస్సు.

-- పొన్నాడ లక్ష్మి

సందెకాడ బుట్టినట్టి చాయల పంట - ఈ వారం అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన

సందెకాడ బుట్టినట్టి చాయల పంట
యెంత-చందమాయ చూడరమ్మ చందమామ పంట॥
..
మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥
..
వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥
..
విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భాగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥


భావం: శ్రీమతి బి. కృష్ణకుమారి గారి సౌజన్యంతో..

.కొండలరాయుని భక్తుడైన సంకీర్తనాచార్యులు ఆ శశాంకుడిని సరికొత్తగా అభివర్ణిస్తున్నాడు. ఈ కీర్తనలో పాలవెల్లి పంట, పండువెన్నెల పంట, విష్ణుమూర్తి చూపుల పంట, వేంకటేశ్వరుని ఇంటిలో పంట ..ఇలా రజనీకాంతుడిని రకరకాల పంటలుగా ప్రస్తుతించడం పదకవితాపితామహుడి పదాల ప్రతిభకు పరాకాష్ఠ.

అసురసంధ్య వేళలో ఆగమించే ఆ ఆత్రేయుడి అద్భుత శఇక్కడ ోభకు అన్నమయ్య అచ్చెరువు చెందుతున్నాడు. అలా దర్శనమిస్తున్నపున్నమి చందమామని ఛాయల పంటగా తలచి మురిసిపోతున్నాడు. ఇక్కడ ఛాయ అంటే కాంతి అని అర్ధం.

ముందు పాలసముద్రంలో మొలచి పండిన ఆ పంట దేవతలకు కూడా ఇష్టమైన పంట అట! అంతేకాకుండా ఆ వెన్నెలరాజు వేరెవరో కాదుట ! వైకుంఠవాసుడైన ఆ శ్రీమహావిష్ణువు చల్లని చూపేనట ! వెరసి ఆ సుధాకరుడు విశాలగగనపు వీధిలో వెన్నెలపంటట ! ఇలా అన్నమాచార్యులు తన భావుకతతో మనల్ని చంద్రలోకంలోనే కాదు దేవలోకంలోనూ విహరింపజేసాడు.

విరహుల గుండెలకు వెక్కసమైన పంట. సహజమైన ప్రేమను చిగురింపచేయడంలో ఆ శీతాంశుడు మన్మధుడి పక్షాన నిలిచేవాడట! ఇక పాలమీగడలాంటి పండు వెన్నెలలో వేడుకల పంటట! ఆకర్షణ పెంచేవాడట ఆ లక్ష్మీదేవి సోదరుడు. మర్రివాని పంట అంటే ఎక్కువ పంట అని అర్ధం. మర్రి విత్తనం ఎంత చిన్నదైనా మర్రిచెట్టు మాత్రం పెద్దది. ఆ విధంగా వెన్నెల విశ్వమంతా విస్తరించునని అన్నమయ్య భావం.



తుషారకిరణుడు తారాపథానికి పరమభాగ్యమైన పంట. తూర్పు కొండపై ఆరగ పండిన పంట. కడపటికి కోనేటిరాయుని ఇంటిపంట అని ముక్తాయింపు పలికాడు.

Friday 16 November 2018

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. - అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!

సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!

తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!

చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!

భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన  నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.



ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము, - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఏమి చిత్రం బేమి మహిమలు ఏమి నీ మాయా వినోదము,
వామనాచ్యుత నిన్నుఁ దెలియఁగ వసుధలో మా తరములా.. !!

సకలలోకవాసనాయక శౌరి మురహరి నరహరీ
ప్రకటమాయెను నీ గుణంబులు పాలముచ్చవటంచును
వికటముగ నిన్నుఁ గన్న తల్లి వేల నీ వదనంబు మీటిన
అకట హా యని నోరుఁ దెరచిన యందు లోకములుండెను. !!

శ్రీసతీపతి దైత్యదానవశిక్ష కామర రక్షక
రాసికెక్కెను బండి రొప్పిన రవ్వలా నీ సేఁతలు
మోసమున నర్జునుఁడు నీలో ముందు గానక మాతాలాడిన
వాసవార్చిత విశ్వరూపము వసుధఁ జూపితి వవుదువు. !!

నమో నమో శ్రీవేంకటేశ్వర నారదప్రియ భక్తవత్సల
విమలమగు నీ దాసు లిదె నీ విద్యలెల్లా జూచిరి
సుముఖులైకరిశబరిబలియును శుకధృవాదులు నిన్నుఁ గొలువ
సమత ఉన్నతపదము లొసఁగితి సర్వమిందునుఁ గంటిమి. !!

భావము..
పెదతిరుమలాచార్య చెప్పిన శౌరీ విలాసము.
ఓ శ్రీహరీ! ఎంత చిత్రం? ఏమి  మహిమలు? ఏమి నీ మయావినోదములు? ఓ అచ్యితా! ఓ వామనా! నిన్ను తెలుసుకోగలగడం మా తరమా? నిన్ను గుర్తించలేని దౌర్భాగ్యులం మేము.
ఓ శౌరీ! ఓ మురహరీ! సకలలోకనాయకా! పాలదొంగవని నీ గుణములు ఎంచుతున్నాము. సరియే మేము అజ్ఞానులము. నీ మాతృమూర్తి నీ బుగ్గపై మీటి అడుగగా, అకటా! నీ నోరు తెరచి పదునాల్గు భువనాలను చూపించితివి.  ఆ తల్లి నిశ్చేష్టురాలైనది.
ఓ శ్రీసతీపతీ! దైత్యులను, దానవులను శిక్షించి అమరులను రక్షించినవాడివే. ఒక మూలనున్న బండిని విరిచిన నీ చేతలు సామాన్యులకు అర్ధం కానేకావు. ఆ అర్జునుడు మోసపోయి నిన్ను బావగా, రథసారథిగా, యాదవునిగా ఎంచి నీవు వాసవార్చితుడవని మరచితే విశ్వరూపం చూపి అతని కన్నులు తెరిపించినవాడవు.
ఓ వేంకటేశ్వరా! నారదప్రియా! భక్తవత్సలా! నమో నమో! నీ దాసులు మాత్రమే నీ మహిమలెల్లా చూచిరి. నీ శరణాగతులైన గజేంద్రుడు, శబరి, బలి, నిన్ను గొలిచెడి శుక ధ్రువాదులకు నీవు ఉన్నత పదములొసగుట సర్వమూ మేమీ పుడమిలోనే గంటిమి ప్రభూ!




తలచరొ జనులు ఈతని పుణ్యనామములు. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.. తలచరొ జనులు ఈతని పుణ్యనామములు.

తలచరొ జనులు ఈతని పుణ్యనామములు
సులభముననే సర్వసుభములు కలుగు !!

హనుమంతుడు వాయుజుఁ డంజనా తనయుడు
వనధి  లంఘన  శీల  వైభవుఁడు
దనుజాంతకుఁడు సంజీవనీశైల సాధకుడు
ఘనుడు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

లంకా సాధకుఁడు లక్ష్మణప్రభోధకుఁడు
శంకలేని  సుగ్రీవ  సచివుఁడు
పొంకపు రాముని బంటు భూమిజ సంతోష దూత
తెంకినే కలశాపుర దేవ హనుమంతుడు. !!

చటులార్జున సఖుఁడు జాతరూపవర్ణుఁడు
ఇటమీఁద బ్రహ్మపట్టమేలేటి వాడు
నటన శ్రీ వేంకటేశు నమ్మిన సేవకుఁడు
పటు కలశాపుర ప్రాంత హనుమంతుడు. !!

భావం॥  ఈ కీర్తనలో అన్నమయ్య హనుమంతుని భజిస్తూ ఆతని గుణగణాలు వర్ణిస్తున్నాడు.
ఓ! జనులాల! ఈతని పుణ్యనామము తలుచుకోండి. అతి సులభముగానే సర్వశుభములు కలుగుతాయి. అతని దివ్యనామం ఉచ్ఛరిస్తే చాలు ఉన్నత గతులు కలుగుతాయి.
హనుమంతుడు వాయుదేవుని కుమారుడు, అంజనా తనయుడు, సముద్రాన్ని లంఘించిన వాడు, శీల సంపద కలిగినవాడు. రాక్షసులను సంహరించినవాడు, సంజీవని పర్వతమును కనుగొన్నవాడని కీర్తింపబడినవాడు, ఘనుడు, కలశాపుర ప్రాంతము వాడు ఈ హనుమంతుడు.
లంకను సాధించినవాడు, ఒకానొక సమయంలో లక్ష్మణునకే బోధ చేసినవాడు, ఎటువంటి సంశయమూ లేని సుగ్రీవుని సచివుడు, ఒద్దికగా శ్రీరాముని బంటుగా నున్నవాడు, సీతమ్మకు చింత పోగొట్టి సంతోషం కలిగించిన దివ్యదూత. ఆ మహానుభావునికి అన్నమయ్య నీరాజనాలిస్తున్నాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని రథముపైన జెండా మీద విరాజిల్లి, అతని విజయానికి తోడ్పడినవాడు, బంగారు వర్ణంతో శోభిల్లేవాడు, ఇకమీదట బ్రహ్మపదవిని చేపట్టవలసినవాడు, అలాంటి కపీశ్వరుడు శ్రీ వేంకటేశ్వరుని సేవకుడై ఏదుకొండలపై కొలువై ఉన్నాడు. శ్రీ ఆంజనేయ స్వామిని తలుచుకొంటే చాలు అన్ని భయాలు తొలగి విజయాలు సిధ్ధిస్తాయని అన్నమయ్య ప్రబోధం.


ఏడనుండి వచ్చినాడే.. - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.  ఏడనుండి వచ్చినాడే..

ఏడనుండి వచ్చినాడే ఈడకుఁ దాను
వీడెమిచ్చీఁ జూడవే వేసాలవాఁడు. !!

వెలలేనివలపుల వేడుకకాఁడు
కలికితనాల మంచి గయ్యాళివాఁడు
చలమరిసరసాల జాజరకాఁడు
చెలువుఁడు వీఁడు కడె శ్రీవేంకటేశుఁడు !!

కొనబుతనాలతోడి కోడెకాఁడు
నినుపు నవ్వుల నవ్వే నీటులవాఁడు
వొనరినవరముల వుదారికాఁడు
చెనకులవాఁడుగదే శ్రీవేంకటేశుఁడు. !!

గొల్లెతల మానముల కొల్లకాఁడు
పిల్లదొరలూఁదేటి పిన్నవాఁడు
యెల్లగా నలమేల్మంగ నేలినవాఁడు
చెల్లుబడి వీఁడుగదె శ్రీవేంకటేశుఁడు. !!

భావం.. శ్రీవెంకటేశ్వరునిపై శృంగారగీతిక వినిపిస్తున్నాడు అన్నమయ్య, తనివిదీరా ఆస్వాదించండి.

చెలికత్తెలు ఒకరితో ఒకరు చెప్పుకొంటున్నారు. తాను ఎక్కడనుండి ఇక్కడకు వచ్చినాడే?  తాంబూలమిచ్చి ఆహ్వానించండి ఆ వేషాలవానిని.
ఏ వెలకూ సరితూగని వలపులవేడుకలు కలవాడు. ఇతరులను ఆకాట్టుకొనే నేర్పరితనంలో బహు గడుసరి వాడు. చలముతో సరసాలు నెరపే  జాజరకాడు. చెలికాడు వీడె గదే శ్రీ వేంకటేశ్వరుడు.
కొంటెతనాలతో కోడెకాడు వీడు. చిలిపి నవ్వులునవ్వే నీటుగాడు. వరములు గుప్పించడంలో అతి ఉదారుడు. చెనకులతో నొక్కులు నొక్కే వాడు శ్రీవేంకటేశ్వరుడు.
కృష్ణావతారంలో గొల్లెతల  మానములు దోచుకొన్న కొల్లకాడు. వీడే కదా పిల్లనగ్రోవి ఊదుతూ అందరినీ పరవశింపజేసే పిల్లవాడు. దేవి అలమేల్మంగను పెండ్లియాడి ప్రేమతో ఏలుకునే గొప్ప చెల్లుబడివాడు శ్రీవేంకటేశ్వరుడు.

Saturday 18 August 2018

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు - కవిత

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు
మూల్యం చెల్లించి సొంతం చేసుకోవడానికి,
ఆదరాభిమానాలు తాతముత్తాతల ఆస్తులు కావు
అధికారంతో కబళించి అనుభవించి తృప్తి చెందడానికి,
హృదయాంతరాళలో నుంచి పొంగి పొరలేదే నిజమైన అనురాగం,
అవరోధాలు లేని ప్రేమ విశ్వమంతా వ్యాపించి
తర తమ భేధం లేక అందరికీ పంచబడుతుంది.
ఈ సత్యం తెలుసుకోలేక ఈర్ష్యా అసూయలతో కలసి
అగ్నిగుండంలా మారిన మానసం.
ఒక్కరికే సొంతమవ్వాలనే కుంచిత భావం.
అంతర్మథనంలో అంతరాత్మ ఘోషిస్తూంది.
అధీనంలో లేని మనసు అపరాధమని తెలిసీ
 అంగీకరించడానికి మొరాయిస్తోంది.
సుగుణాలతో బాటు బలహీనతలని కూడా స్వీకరించి
చేరదియ్యాలని ఆత్యాశ!
అత్యాశతో కొట్టుమిట్టాడే మనసుకు
మిగిలేవి  కన్నీళ్ళు,  కలతలే!
-- పొన్నాడ లక్ష్మి

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో ఉబ్బునీటిపై ఒక హంసా! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అన్నమాచార్యులు ఆ ఆపదమొక్కుల వాడిని హంసగా అభివర్ణిస్తూ రచించిన ఈ పదావళి ఆయన కవితాత్మక దృష్టికి, భావుకతకు ప్రతిబింబం. క్షీరసాగరలో శయనించే ఆ శ్రీమహావిష్ణువు ఆ భాగవతోత్తముడికి, ఎగిసే అలలపై తేలే తెల్లని కలహంసలా కనిపిస్తున్నాడట! ఆ అనుభూతికే అక్షరరూపమిస్తూ  ఈ భక్తకవి ఇలా చెప్తున్నాడు.

దిబ్బలు వెట్టుచి తేలినదిదివో
ఉబ్బునీటిపై ఒక హంసా!

అనువున కమలవిహారమె నెలవై
ఒనరి యున్న దిదె ఒక హంసా!
మనియెడి జీవుల మానస సరసుల
వునికి నున్న దిదె ఒక హంసా!

పాలు నీలు వేర్పరచి, పాలలో
ఓలలాడెనిదె ఒక హంసా!
పాలుపడిన ఈ పరమహంసముల
ఓలినున్న దిదె నొక హంసా!

తడవి రోమరంధ్రముల గ్రుడ్ల
నుడుగక పొదిగీ నొక హంసా!
కడు వేడుక వేంకటగిరిమీదట
నొడలు పెంచె నిదె నొక హంసా!

భావం..  శ్రీమతి బి. కృష్ణకుమారి.
దిబ్బలు వెట్టుచు అంటే సమంగా ఉండే నీటిపై  ఎత్తులు కల్పిస్తూ అని, ఉబ్బునీరు అంటే పొంగుతున్న నీరు అని అర్ధం. పరిశుధ్ధతకు ప్రతిరూపమైన ఆ పరమాత్మను పరమహంసతో పోల్చి పరవశించెను ఆ పదకవితాపితామహుడు.
ఆ శంఖచక్రధారి  శేషసాయిగా శ్రీమహాలక్ష్మితో కలిసే ఉంటాడు. ప్రకృతి పురుషులకు ప్రతీకగా ఇరువురి మధ్య అనుబంధం అంత గాఢమైనది. అలాంటి స్వామిని నిరంతరం సరస్సుని నెలవుగా చేసుకొని జీవించే మరాలంతో సరిపోల్చుతున్నాడు అన్నమయ్య. అంతే కాకుండా లోకంలోని సమస్తజీవులనే మనస్సులనే సరస్సులో భగవంతుడు కొలువై ఉంటాడని ప్రస్ఫుటం చేస్తున్నాడు, హంసకు హిమాలయాల్లోని  మానససరోవరం ఎలాగో, ఆ పరంధాముడికి పరమభక్తుల హృదయాలు కూడా అంతే అంటున్నాడు అన్నమయ్య.
హంస అనగానే నీళ్ళు కలిపిన పాలను ముందు పెడితే నీళ్ళను వదిలి పాలను మాత్రమే తాగుతుందని అనాదిగా వింటున్న ఐతిహాసిక భావన. దీనిని సజ్జనుల విచక్షణ లక్షణానికి ప్రతీకాత్మకంగా సాహుతీవేత్తలు సరిపోల్చుతారు. భగవంతుడు కూడా అలాగే పాపపుణ్యాలనే నీరక్షీరములను వేరు చేసి, పావనచరితుల, పరమహంసల పక్షమే వహిస్తాడు. ఆ పన్నగశయనుడు పాలకడలిలో పవళిస్తుండడం వెనుక పరమార్ధమిదే అని అంటున్నాడు అన్నమయ్య.
హంస తన రెక్కలమాటున పెట్టుకొని గుడ్లను పొదిగినట్లు, భగవంతుడు కూడా అండపిండ బ్రహ్మాండాలను  అంతర్బహిర్యామినిగా ఆక్రమించి సృష్టిని నడుపుతున్నాడట! అలా లోకాలన్నీ ఆయన రక్షణలో మనుగడ సాగిస్తున్నాయట. అంతటి విశిష్టత కలిగిన ఆ పరమాత్ముడు వేడుకగా వేంకటగిరిపై వేంచేసి ఉన్నాడని అన్నమయ్య అభివర్ణిస్తున్నాడు. 'తడవి' అంటే ప్రేమతో తాకి, 'ఉడుగక' అంటే తగ్గక. 'ఒడలు' అంటే శరీరం అని అర్ధాలు. ఆ కారణజన్ముడు కమనీయంగా రచించిన ఆ కీర్తనను శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు పరిశోధించి ఆ పదాలకు అర్థాలను తేటపరిచారు. ఇలా అన్నమాచార్యుల ఎన్నో కీర్తనలు మనం సులువుగా పాడుకొని పరవశించడానికి రాళ్ళపల్లి వారు పరోక్షకారకులు., వందనీయులు.
సేకరణ. పొన్నాడ లక్ష్మి.

Sunday 29 July 2018

అదె ఎవ్వతె, తాను అలమేల్మంగను నేను పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని.- అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

అదె ఎవ్వతె,  తాను అలమేల్మంగను నేను
పొదిగి దాఁచకువే నీ పూనిక మెచ్చే గాని. !!

పొలఁతి నీకెవ్వతె బుధ్ధులు చెప్పినది
నలువున నా పతితో నవ్వుమంటాను
తెలుపఁగదవె  దాని దీమసమెంతో
చలములు నీతో మరి సాధించేఁగాని !!

నీ కెవ్వతె ఈ చేఁతలు నేరిపినది
జోకతో నా రమణుని సొలయుమని
నాకుఁ జూపవే దాని విన్నాణమెంతో
మైకొని నీతో మరి మాటలాఁడేఁగాని !!

వోడక యెవ్వతె నీకీ ఉపదేశమిచ్చినది?
యీడనా శ్రీ వేంకటేశు నెనయుమని
వాడలోనెంచవే దాని వాసి యెంతో ఈతడు
కూడె నన్ను నీతో మరి గుట్టు చెప్పేఁగాని. !!

భావమాథుర్యం..
అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార సంకీర్తనలో రోషావేశపరవశురాలైన అలమేలుమంగా దేవి తన చెలికత్తెతో యెంత దురుసుగా, పరుషమైన మాటలను ప్రయోగిస్తున్నదో చూడండి. ఎంత అమ్మవారు అయినా  తనపతి మదిని మరో స్త్రీ దోచుకున్నదనితెలిసినా, లేక ఇంకో స్త్రీ తనపతిపై మనసుపడిందని తెలిసినా కట్టుకున్న ఇల్లాలి మనసు ఎలా కుతకుతలాడుతుందో అతి సహజంగా అన్నమయ్య వివరించాడు. ఎవరెన్ని వేషాలు వేసినా ఎంతగా మనసుపడినా భార్య విలువ భార్యదే అని స్పష్టంగా తెలియజేసాడు.
అది ఎవ్వరే, నేను అలమేల్మంగను. కోరిన నా స్వామి అర్ధాంగిని, హృదయవాసినిని. నీవు నా స్వామి రహస్యాలను దాచుకున్నావని నాకు ముందే తెలుసు. నీ గడుసుదనాన్ని మెచ్చుకున్నా కానీ తాను ఎవ్వరో దాచకుండా చెప్పమనవే!
ఓ పొలతీ! నీ కెవ్వతె ఈ బుధ్ధులు నూరిపోస్తున్నదే? నా పతితో నవ్వుతూ ఊసులాడమని దాని కెవరు చెప్పారే? దాని ధీమసమేమిటో అంతు చిక్కడం లేదే? నా పట్టుదలలు నీకు తెలుసుగా.. నేను అదెవ్వరో సాధించి తీరుతాను.
ఏమే! ఈ చేష్టలన్నీ నీకెవతె నేర్పుతున్నాదే? నా రమణుని బాగుగా పరవశింపజేయుమని దానికెవరు బోధిస్తున్నారే? దానిని నాకు చూపవే. దాని జాణతనమేంటో చూస్తాను. నా చెలికత్తెవైన నిన్ను లొంగదీసుకుని మాట్లాడుతున్నదే? దాని సంగతేమిటి?
ఓ చెలీ! వెనుదీయక యెవతె నీకివన్నీ ఉపదేశిస్తోంది? ఇక్కడ తిరుమలలో నా వెంకటేశ్వరుని సంగమించమని ఎవరు నూరిపోస్తున్నారు దానికి? వాడలో దానికేమి పేరు, ప్రతిష్ఠ ఉంటాయే? నీవీ గుట్లు చెప్తున్నావే గాని స్వామి అర్ధాంగినైన నన్ను కూడి పరవశింపచేసినాడే.

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఇదిగో అలమేల్మంగ ఇంత బత్తి నీమీద
పొదిగొన్న నీకు వలపులు గుమ్మరించీనీ. !!

పడఁతి నీ గుణాలకు పలుమారు మెచ్చి మెచ్చి
వుడివోని సంతోసాన నూలలాడీని,
కడు నీ చక్కఁదనాలు కాంతలతోఁ జెప్పి చెప్పి
వెడఁగుఁ బులకలతో విర్రవీగీని. !!

నేరుపుల మీ చేతలు నెమ్మదిఁ జూచి చూచి
కోరికలు కొనసాగ గుబ్బితిలీని,
కూరిమి తోడుత నీ కొలువులు సేసి సేసి
చేరి నీతో వేడుకలఁ జెలరేఁగీని. !!

సేసవెట్టి నీపై నిదె సెలవులు నవ్వి నవ్వి
ఆశలఁ గాఁగిట నిన్ను నప్పళించీని,
రాసికెక్కి నీవేలఁగా రతుల శ్రీ వేంకటేశ
పోసరించి ఇన్నటాను భోగించీనీ.. !!

భావమాథుర్యం...
అన్నమయ్య స్వామివారి చెలికత్తెవలె భావించుకుని  ఆయన దేవేరికి ఆయనపై గల ఆరాధన, అనురాగం వలపులను వివరిస్తున్నారు.
ప్రభూ! ఇదిగో నీపై ఎంతో ఆరాధన, భక్తి మెండుగా గల అలమేల్మంగ. నీపై ఆవరించి వలపులను కుమ్మరించినదయ్యా!
ఈ పడతి పదే పదే నీ సుగుణాలను మెచ్చి తరగని సంతోషాలలో ఓలలాడినదయ్యా! నీ చక్కదనములను చెలులతో చెప్పి చెప్పి మితిమీరిన పులకరింతలతో విర్రవీగుతున్నదయ్యా!
ప్రభూ నీ చేతల నేర్పునూ, నెమ్మదితనమునూ చూచి చూచి కోరికలు కొనసాగగా అతిశయంతో పరవశించెనయ్యా! అనురాగముతో నీకు సేవ చేసి చేసి నీతో వేడుకలు పంచుకొని చెలరేగినదయ్యా!
నీపై తలంబ్రాలు పోసి, ఆపైన మనోహరమైన చిరునవ్వులు చిలికించి ఆశలతో నీ కౌగిట పరవశించినదయ్యా! గణతకెక్కిన నీ సురతులకు గర్వించి, శ్రీ వెంకటేశ్వరా! అన్ని విధములా ఆ దేవి నిన్ను భోగించెనయ్యా!


కనులు - కవిత

picture courtesy : Sri Ponnada Murty

కనులు - కవిత


వినీలాకాశంలో ఇంద్రధనుస్సుని చూస్తూ అచ్చెరువొందిన కనులు
కొండలనడుమ ఉదయిస్తున్న బాలభాస్కరునిని దర్శించి తరించిన కనులు
ఎగసిపడే కెరటాల విన్యాసాలాకి పులకరించిన కనులు
అరవిరసిన పూబాలల వింతవింత సోయగాలకి మైమరచిన కనులు
ఆలయంలో పరమాత్ముని దివ్యమంగళ దర్శనంతో అరమోడ్పులైన కనులు
పసిపిల్లల ముగ్ధత్వానికి పరవశించిన కనులు
కొండలలో, కోనలలో, ఏరులలో సెలయేరులలో ప్రకృతికాంత
అందాలకి దివ్యానుభూతి చెందిన   కనులు ..
కంటిచూపు కరవై ఈ ఆనందానుభూతులకి దూరమైన కబోది ని చూసి
దుఃఖాశ్రువులతో  నిండెను నా కనులు ..
అప్పుడు .. అప్పుడనిపించింది నాకు .. నా కనులతో ఆ అభాగ్యుడు
ఈ ప్రపంచాన్ని చూడగలిగితే చాలని!
ఆ రోజుకోసం ఎదురుచూస్తున్నాయి నా కనులు.
---- పొన్నాడ లక్ష్మి

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? - అన్నమయ్య కీర్తన, భావం

అన్నమయ్య కీర్తన.

ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు
ఆడుకొన్న మాటలెల్ల అవి నిజాలా? !!

తొలికారు మెరుపులు తోచిపోవు గాక
నెలకొని మింటనవి నిలిచీనా?
పొలతుల వలపులు పొలసి పోవుగాక
కలకాలంబవి కడ తీరీనా? !!

ఎండమావులు చూడ నేరులై పారుగాక
అండకు పోవ దాహమణిగీనా?
నిండినట్టి మోహము నెలతలమదిచూడ
వుండినట్టే వుండుగాక ఊతయ్యీనా? !!

కలలోని సిరులెల్ల కనుకూర్పులే కాక
మెలకువ చూడనవి మెరసీనా?
అలివేణుల మేలు ఆసపాటే కాక
తలపు వేంకటపతి తగిలీనా? !!

లౌకికమైన జీవనంలో ఈ ప్రేమలూ, ఈ పరిచయాలు, ఈ ప్రమాణాలు బహుప్రియమైనవని మనం భ్రమపడుతూ ఉంటాము. కానీ లోతుగా ఆలోచిస్తీ కపటపూరితమైన ఈ కవ్వింపులు ఏవీ కాలపరీక్షకు నిలవలేవు. అదే భావనతో ఆ భక్తశిఖామణి ఈ సంకీర్తనకు శ్రీకారం చుట్టాడు.
ఈ ప్రేమలు, ఈ అనురాగాలు, ఈ ప్రమాణాలు ఎంతవరకు నిజం. మనం అనుకునే మాటలన్నీ నిజాలేనా?
తొలకరిలో మెరుపులు మెరుస్తాయి, ఉరుములు ఉరుముతాయి. కానీ అవి కనీ కనిపించి మాయమౌతాయి. తరుణి ప్రేమ కూడా అటువంటిదే అంటున్నాడు అన్నమయ్య. యౌవనపు పొంగులో కనిపించేవి ఇవన్నీ..ఇలా మనుష్యుల మధ్య కలిగే బంధాలన్నీ పరిమితకాలమే అని ప్రస్ఫుటం చేస్తున్నాడు.
ఎండమావులను చూస్తే అక్కడ నీరు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. తీరా దరికి పోతే నీరుండదు. దాహం తీరదు. నెలతల మీది మోహము కూడా మనసులో మరులు గొలుపుతుంది. మాయ చేస్తుంది.కానీ ఏమాత్రం ప్రియం కలిగించదని అన్నమయ్య చెప్తున్నాడు.
కలలో కనిపించే సిరులు, భోగాలు కల ఉన్నంతవరకు నిజమే అనిపిస్తుంది. కల చెదిరి వాస్తవంలోకి రాగానే మాయమైపోతాయి. అలివేణులపై ఆపేక్ష కూడా అంతేనని అన్నమయ్య అంటున్నాడు. ఆ భ్రమలో శ్రీ వెంకటేశుని పై ఆశ తగలీనా ? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. కాంతా కనకాలపై మోహం భగవంతుని తలపును కూడా దూరం చేస్తుంది. అని అన్నమయ్య కీర్తనలోని అర్ధం పరమార్ధం.

Monday 9 July 2018

అమ్మ





facebook లో'మిథున కవితావేదిక' (మిథున కవితావనం) వారి చిత్రకవిత శీర్షికలో శ్రీ పొన్నాడ మూర్తి గారి చిత్రానికి అహ్వానించిన వచన కవితలకి నా కవితా స్పందన.
ప్రేమానురాగాల నిర్వచనమే అమ్మ,
అమృతం కలిపి అనురాగంతో తినిపించేది అమ్మ,
నాన్నకి పిల్లలకి మధ్య వారధి అమ్మ, 
అలుపు సొలుపులకు ఆలంబన అమ్మ,
కష్టాలను నవ్వుతూ జయించి, ఆనందం మాత్రమే పంచేది అమ్మ,
నిరుపేద బతుకయినా ప్రేమతో ఆకలిదప్పులు తీర్చేది అమ్మ,
కన్నపిల్లలకే కాక వారు కన్నపిల్లలకి కూడా ప్రేమతో
ఊడిగం చేసేది అమ్మ,
తప్పులు చేసినా మందలించి అక్కున చేర్చుకునేది అమ్మ,
అమ్మ చరణ స్పర్శ పిల్లలకు క్షేమదాయకం.
సాటిలేని అమ్మకు
శతకోటి వందనాలు

Tuesday 26 June 2018

అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు -- అన్నమయ్య కీర్తన.



ఈ వారం అన్నమయ్య కీర్తన..
అంత చక్కని వాడవు అన్నిటా జాణవు నీవు
సంతోసాన నుప్పొంగీ సారెకు నా మనసు. !!
పొలసి నిన్నొకమారు పూఁచి తప్పక చూచితే
వలవక వుండుదురా వనితలు
నిలువున నెప్పుడైనా నీ రూపు దలఁచుకొంటే
వులిపచ్చి చెమటల నోలలాడకుందురా? !!
సముకాన నీతోను సంగతాలు సేసితే
తమకించకుండుదురా తరుణులు
జమళి మేనులు సోఁక సరసము లాడితేను
మమతల నిన్ను నిట్టె మరుగక ఉండుదురా.. !!
ఈడుజోడై నిన్నుఁ గూడి యెడవాయ కుండితే
వేడుకఁ జొక్కకుందురా వెలఁదులు
ఈడనె శ్రీ వేంకటేశ! యేలితివి నన్ను నిట్టె
ఏడవారూ నీ పొందుల కేఁకరకవుందురా! !!
ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరుని వశీకరణ శక్తిని కొనియాడుతున్నాడు. ఆ దివ్యమంగళరూపము దర్శనమవగానే మనం కూడా ఒళ్ళు తెలియని పరిస్థితికి లోనౌతాము. స్వామి ఆకర్షణ శక్తి అంతటిది.
స్వామీ! నీవేమో అంత చక్కని వాడవు. దానికితోడు సరసత్వం గల జాణవు. నిన్ను చూసిన ప్రతీసారీ నా మనసు ఉప్పొంగిపోతుంది.
నిన్నొక్కమారు తరచి చూసినవారు వలపు చెందక ఉండగలరా? ఎప్పుడైనా నీ రూపమును నిలువెల్లా ప్రేమతో చూచిన చిరు చెమటలతో మేను చెమర్చక నుండునా?
నీ సముఖానికి వచ్చి నీతో చేరికగా ఉంటే తరుణులకు తన్మయత్వం కలుగదా? ఇరువురి మేనులు తాకుతూ సరసములాడితే వారిలో మమత కలిగి నీ పొందుకోసం తహతహలాడరా?
ఈడుజోడుగా నుండి ఎడబాటు లేక నిన్ను కూడి ఉంటే వెలదులు మైమరచిపోకుందురా? ఓ వేంకటేశ్వరా! నన్నూ నిట్టె ఏలితివి. ఎక్కడివారూ నీ పొందు కోసం ఉవ్విళ్ళూరక ఉండగలరా?

Tuesday 12 June 2018

అన్నమయ్య కీర్తన -- ఊరకే ఉన్నాఁ డితఁడు వోరుపుతోడ

అన్నమయ్య కీర్తన

ఊరకే ఉన్నాఁ డితఁడు వోరుపుతోడ
ఈ రీతి మాటలాడ అరుహమా ఇపుడు? !!

మంతనము లాడెనంటా మగువతో నీవతని
నెంకెంత సేసేవే ఇపుడు నీవు.
వంతులు తప్పక వుండవచ్చీఁ గాక రమణుఁడు
అంతేసి మాటలకు నరహమా ఇతఁడు. !!

అంగనచేతి విడెమాకు నందుకొనే నంటా
యెంగిలి మాటాడకువే యెగసెక్కేన
జంగిలిలో నీ తోడ సరసము నాడీఁగాక
అంగమంటి ఇంత సేయ నరుహమా ఇతఁడు !!

మేడమీదనున్నచెలి మేలమాడి కూడెనంటా
ఆడుకొనేవింతలోన అందరితోడ
వోడక శ్రీ వేంకటేశుఁ డొడివట్టి నిన్నుఁగూడె
ఆడనీడా గేలిసేయ నరుహమా ఇతఁడు. !!

భావం...అన్నమయ్య చెప్పిన ఈ సరస శృంగార కీర్తనలో  తాను దేవి చెలికత్తె అయి స్వామి తరుపున ఇలా మాట్లాడుతున్నాడు.
నీ రమణుడు నిన్నేమీ అనటం లేదని ఊరకనే ఉన్నాడని ఇన్ని యెగ్గుల నెంచుతున్నావు. అతను ఓర్మితో ఉన్నాడని నీ చేత ఇన్ని మాటలు పడుటకు అర్హుడా ఇతడు? ఇది నీకు తగిన పనియేనా?
దేవీ! నీ విప్పుడు ఎంతెంత వింత పనులు సేసేవే. ఆ మగువతో మంతనాలాడుతున్నాడని ఇతనిపై నెపము వేస్తున్నావు. ఆమె నీ రమణుడికి వరుస కాకపోవచ్చు. మాట తప్పకుండా నీ దరికి వస్తున్నాడే కదా! కానీ అతనిని అన్ని మాటలు అనవచ్చునా?  దానికతడు అర్హుడేనా?
దేవీ నీ రమణుడు ఆమె చేతి తాంబూలము అందుకొన్నాడని దెప్పిపొడిచి అపభ్రంశపు మాటలనకమ్మా!.అవేమీ పట్టించుకోకుండా నీతో సరసమాడేడని అతని చేయిబట్టి  నిలబెట్టి ఇంత సేయ తగునా? దీనికతడు అర్హుడా?
దేవీ! ఆ మేడలోనున్న చెలి నీ రమణునితో పరాచికములాడి, ఆపై కూడినదని ఇంతలోనే అందరితో చెవినిల్లు కట్టుకొని  మరీ చెబుతున్నావు కానీ ఏమాత్రం నీ మాటలు లెక్కచేయక నిన్ను ఒడిసిపట్టి నిన్ను కూడినాడు. అక్కడా ఇక్కడా నీ రమణుని గేలిసేయ తగునా? ఈ అపనిందలన్నిటికీ స్వామి అర్హుడా?
ఈ కీర్తనలో భర్తపట్ల అనురాగం కల భార్య మనస్సు ఎలా ఉంటుందో చక్కగా వివరించాడు అన్నమయ్య.

అన్నమయ్య కీర్తన. -- అహో సాధు తవాగమనం

అన్నమయ్య కీర్తన.

అహో సాధు తవాగమనం
బహుళ వైభవైః ప్రతివచబైః కిమ్. !!
తతోపసర మిథ్యశఠవచనై
రితస్తవైమన్మ హితం కిమ్
బత మమ దేహాత్ప్రాణ స్తథాపి
గత ఏవై తత్ కారణమిహ కిమ్. !!
సవృతి చేలం జహి చపలత్వం
సంవాదేమే సతతం కిమ్
త్వం వా మమ చిత్తం సాంత్వయసి
కిం వా కురు మమ ఖేలనమిహ కిమ్ !!
అతి భిబేమి భవదాచరణాదిహ
చతుర వేంకటాచలరమణ
సతీం మా మనుసరసి కిమధన్
రతిరాజ విభవ రచనమిదంకిమ్. !!

అన్నమయ్య వినిపిస్తున్న గీర్వాణి సంకీర్తన ఇది. దేవి స్వామితో ఈ విధంగా అంటున్నది.
అహో! నీ రాకయే విశేషము. గొప్ప గొప్ప వైభవములు, ప్రతివచనములతో ఏమి ఫలము?
మిథ్యతో కూడిన మూర్ఖపు వచనములతో నింక తొలగిపొమ్ము. ఇంకా నాకు హితము చేయాలనుకోవడమేమిటి? నా దేహమునుండి ప్రాణము పోతున్నది. దీనికి కారణం ఏమిటో చెప్పు.
చపలమనే వస్త్రం కప్పి ఉంది. దానిని తొలగించు. నాతో ఎల్లప్పుడు సంవాదము చేయుటవల్ల ప్రయోజనమేమి? నీవు నా చిత్తాన్ని ఊరడింపచేయుచున్నావు. నన్ను ఆటపట్టించుట ఏమిటికి?
నీ అచరణము వల్ల ఇక్కడ చాలా భయము చెందుచున్నాను. చతురుడవైన ఓ వేంకటాచలనాథా! భార్యనైన నన్ను అనుసరిస్తున్నదెందులకు?  ఓ రతిరాజ విభుడా! ఈ రచనా నాటకములన్నీ ఎందులకు?

భావమాథుర్యం.  అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.

Thursday 24 May 2018

ఉంగాల కబురులే చెప్పారా తండ్రీ

ఉంగాల కబురులే చెప్పరా తండ్రీ!

వాటిలో అర్థాలు విప్పరా తండ్రీ!

పూలరేకులవంటి పాదాలు ఊపీ
అందాలు యిల్లంత చల్లరా తండ్రీ!

ఊయలూపేవేళ జోలల్లు వింటూ
మైమరచి నిదురపో కమ్మగా తండ్రీ!

వెండి వెన్నెల్లోన బువ్వపెడుతుంటే
మారాము మానుకొని పట్టరా తండ్రీ!

కృష్ణకృష్ణాఅంటు భజనవినగానే
లేలేత చప్పట్లు కొట్టరా తండ్రీ !

అమ్మకొంగునదాగి దోబూచులాడీ
ఆటలో ఎప్పుడూ నెగ్గరా తండ్రీ !
—————————
ఉమాదేవి జంధ్యాల

శ్రీ పొన్నాడ మూర్తి గారు వేసిన చిత్రానికి శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రాసిన కవిత. ఈ కవిత ని నా గళంలో ఈ క్రింది లింకు క్లిక్ చేసి వినండి.



Monday 16 April 2018

ఎదురా రఘుపతికి నీ విటు రావణా! - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఎదురా రఘుపతికి నీ విటు రావణా!
నేడిదేమి బుధ్ధి తెలిసి తిట్లాయె బ్రతుకు. !!

హరుని పూజలు నమ్మిహరితో మార్కొనగ
విరసమై కూలితివి వెర్రి రావణా!
వరుసతోడ బ్రహ్మ వరము నమ్మి
రాముని శరణనకుండానే సమసెగా కులము. !!

జపతపములు నమ్మి సర్వేశు విడువగా
విపరీతమాయెగా వెర్రి రావణా!
వుపమలన కడు తానున్న జలనిధి నమ్మి
కపుల పాలైతివిగా కదనరంగమున.. !!

బంటతనము నమ్మి పైకొన్న రాఘవు
వింట బొలసితివిగా వెర్రి రావణా!
యింటనే  శ్రీ వేంకటేశ్వరుని గొలిచి
వెంటనే సుఖియాయె విభీషణుడు. !!

వినాశకాలే విపరీత బుధ్ధి అస్న నానుడికి రావణబ్రహ్మే తార్కాణం. అదే ఈ కీర్తనలో అన్నమయ్య వివరించాడు.
"రఘుపతికి నీవు సరిసాటివాడివా రావణా! ఆయనని ఎదిరించగల వీరుడివా? అన్నీ తెలిసిన నీ బుధ్ధి నేడు ఈ విధంగా పెడదారి పట్టి అవమానాల పాలాయె కదా నీ బ్రతుకు రావణా!" అని లంకాధిపై అన్నమయ్య జాలిపడుతున్నాడు.
ఆ పరమేశ్వరుని పూజలు చేసి,  ప్రియ భక్తుడవని కీర్తిని కాంచి, హరుడు, హరి వేరు కాదన్న నిజము తెలిసికోలేక శ్రీ హరినే ఎదుర్కొన్నావు. నీ పూజలన్ని బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయి. అహంకారంతో ఆ దేవదేవుడిని ధిక్కరించి దిక్కులేని చావు తెచ్చుకున్నావు. బ్రహ్మచే వరాలు పొంది రావణబ్రహ్మగా పేరు గాంచి, ఆ బ్రహ్మ పుట్టుకకే కారణమయిన శ్రీ మహావిష్ణుని  రూపమైన శ్రీరాముని శరణు వేడుకోలేకపోయావు. నీ స్వయంకృతం వల్ల నీ కులమునే సమసిపోయేలా చేసుకున్నావు.
జపతపములు చేసేనన్న అహంతో ఆ సర్వేశ్వరుడిని విస్మరించి విపరీత పరిస్థితులని కొని తెచ్చుకున్నావు వెర్రి రావణా! జలనిధి మధ్యనున్నానన్న నమ్మకంతో ఉన్నావు. ఆ జలనిధి మీదే వారధి కట్టి వచ్చిన కపులు నిన్ను గడగడలాడించారు కదా!
నీ పరాక్రమమును నమ్ముకొని పంతానికి పోయి రాముని వింటికి గురి అయి ప్రాణాలు కోల్పోయేవు కదా వెర్రి రావణా!ధర్మాన్ని నమ్ముకుని రాముని ప్రతిరూపమైన శ్రీ వేంకటేశ్వరుని శరణు కోరి, ఆయన అపారకృపకు పాత్రుడైనాడు విభీషణుడు. 


Thursday 22 March 2018

ఉగాది కవిత


కోకిల మధురస్వరాలతో మామిడిపూల పరిమళాలతో
నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అరుదెంచినది వసంత ఋతువు.
మల్లెల గుబాళింపుతో, నోరూరించే ఆవకాయ రుచులతో
మామిడిఫలాల మధురిమలతో అలరించునది గ్రీష్మ ఋతువు,
మార్తాండుని ప్రతాపముతో అలసిన పుడమితల్లిని తన
అమృత వర్షధారలతో శాంతపరుచును వర్షఋతువు.
సన్నని చలిగాలులతో, చల్లని వెన్నెల సోయగాలతో
మానవ హృదయాలను పులకరింపజేయును శరదృతువు
ఊషోదయవేళ మంచుబిందువులతో ప్రకృతి కాంతను
పునీతను చేయును హేమంతఋతువు.
పండుటాకులను రాల్చి కొత్త చివురులను ఆహ్వానిస్తూ
జీవిత సత్యాన్ని తెలియజేసే శిశిర ఋతువు.
ఆరు ఋతువుల అందాలని, ఆనందాలని ఆస్వాదించగలిగే
మానవజీవితం మహనీయం కదా!ఉ

కవితా దినోత్సవం

కవితా దినోత్సవ సందర్భంగా నా మదిలో భావం.

నీవారెవరో పైవారెవరో ఎన్నటికీ తెలియని తాతమ్యం,
ఎవరికీ అర్ధంకాని ప్రశ్నంటే ఇదేనేమో!
జీవిత పయనంలో ఆటుపోట్లని తట్టుకుంటూ
గమ్యంకోసం వెతుకులాడే బాటసారులం.
మార్గమధ్యంలో కలిసే మిత్రులు కొందరైతే.
అకారణంగా వైరం పెంచుకొనే శత్రువులు కొందరు.
ఒకరి మనసు అనురాగ జలధి అయితే,
మరొకరి అంతరంగం ద్వేషంతో రగిలే అగ్నిగుండం.
స్వల్ప పరిచయంలోనే ఆత్మీయంగా అక్కున చేర్చుకునేవారు కొందరైతే,
సన్నిహితులైన వారే అపార్ధాలతో బంధాల్ని తెంచేసేవారు కొందరు.
జ్ఞాపకాల పొరలలో కనిపించే ఆత్మీయులు కోందరైతే,
చేదుజ్ఞాపకాలలో మరీ మరీ బాధించె వారు కొందరు.
మార్గమధ్యంలో ఎందరినో పోగొట్టుకొని, మరెందరినో పొందుతుంటాం.
ఇదేనేమో జీవిత పయనానికి అర్ధం పరమార్ధం.

Wednesday 14 March 2018

అన్నమయ్య


అన్నమయ్య వర్ధంతి సందర్భంగా .....
ఏ జన్మమున ఏమి తపముచేసి ఈ జన్మమున మన అన్నమయ్యగా ఆవిర్భవించాడో ఈ మహాత్ముడు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బ్రాహ్మణులు , భరధ్వాజస గోత్రులు అయిన లక్కమాంబ, నారాయణసూరి పుణ్యదంపతులకు 1408 వ సంవత్సరము విశాఖ నక్షత్రం, వైశాఖపూర్ణిమనాడు కడపజిల్లా తాళ్ళపాక గ్రామంలో అన్నమయ్య జన్మించాడు. ఈయనతో మొదలుపెట్టి మూడు తరాలవరకూ అందరూ కవులే. గాయకులే. తెలుగులో మొదటి కవయిత్రి అయిన తాళ్ళపాక తిమ్మక్క అన్నమయ్య మొదటి భార్య'సుభద్రా కల్యాణం' కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించారు.
పదకవిత్వం కవిత్వం కాదని నిరసించే కాలంలో అన్నమయ్య వాటిని రచించి, పద కవితకు ఒక నిర్దిష్టతనీ, గౌరవాన్ని కల్పించారు. పైగా పండితులకంటే, ముఖ్యంగా పామరులను రంజింపజేసేందుకు జానపదుల భాషలో మేలుకొలుపు, ఉగ్గు, కూగూగు, ఏల, జోల, జాలి, ఉయ్యాల, కోలాట, సువ్వి, జాజర పదాలను, సామెతలనీ, జాతీయాలనీ పొందుపరుస్తూ, తేలిక భాషలో జనరంజకంగా రచించారు. పండితానురంజకంగా గ్రాంథిక, సంస్కృత భాషల్లో కూడా సంకీర్తనలను రచించారు. అందువల్లనే ఆరు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ అన్నమయ్య కీర్తనలు పండిత పామరుల నందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాక వైరాగ్య మనస్తత్వాలకు ఆధ్యాత్మిక సంకీర్తనలనీ, శృంగార ప్రియులకు శృంగార కీర్తనలనీ, పిల్లలకనువయిన ఆటపాట కీర్తనలనీ, శ్రమజీవులకోసం జానపద గేయాలనీ రచించారు. అందుకే సమాజంలోని అన్నివర్గాల వారికీ అన్నమయ్య సంకీర్తనలు నేటికీ ఆనందదాయకాలే. మానవ జీవన ధర్మాలన్నీ తన రచనల్లో పొందుపరిచారు. అన్నమయ్య మొత్తం 32,000 వేల కీర్తనలను రచించారు. అందులో 14 వేల కీర్తనలు మాత్రమే మనకు లభ్యమయ్యాయి.

అన్నమయ్య కీర్తనల్లో అమృతత్వాన్ని ఆస్వాదించడానికి ఎందరో ప్రజలు ఆయన అనుగ్రహం కోసం అర్రులు చాచేవారు. అన్నమయ్య మనుమడు చిన్నన్న గ్రంథస్థం చేసిన 'అన్నమాచార్య చరిత్ర'లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మన అన్నమయ్యకు ప్రపంచవాసన, సంసార లంపటము, దాంపత్య సౌఖ్యము, భార్యాపుత్రులయందు మమకారము, దొరలతో చెలిమి వగైరాదులు ఏమీ తక్కువగా లేవు. అసలే జోడు చేడెల మగడు. కడుపునిండిన సంతానము. దేనికీ లోటులేని సంపూర్ణ జీవితము మన అన్నమయ్యది.
'శ్రీహరి కీర్తన నానిన జిహ్వ, పరుల నుతించగ నోపదు జిహ్వ' అంటూ రాజాస్థానాన్ని తిరస్కరించిన ఆత్మాభిమాని అన్నమయ్య. తిరుమలలో నిత్యకల్యాణ సంప్రదాయాన్ని ప్రారంభించింది అన్నమయ్యే అంటారు. ఆ చనువుకొద్దీ శ్రీనివాసుడు స్వప్న సంభాషణల్లో అన్నమయ్యని 'మామా' అని సంబోధించేవాడని చెబుతారు. వేంకటపతి ప్రతీ సేవలోనూ అన్నమయ్య సంకీర్తన ఉండవలసిందే. అన్నమయ్య కీర్తనలను వింటూనే ఊరేగుతాడు వేంకటేశ్వరుడు.
నా నాలికపై నుండి నానా సంకీర్తనలు - పూని నాచే నిన్ను పొగిడించితివి
వేనామాల వెన్నుడా వినుతించనెంతవాడ - కానిమ్మని నాకీ పుణ్యము గట్టితి వింతే అయ్యా!
అంటూ తన సంకీర్తనా ప్రతిభ స్వామి వరమే నని ప్రకటించాడు ఆచార్యుడు. 1503 దుందుభి నామ సంవత్సరం, ఫ్హాల్గుణ బహుళ ద్వాదశినాడు అన్నమయ్య అనంతకోటి బ్రహ్మాండ నాయకునిలో ఐక్యమయ్యాడు.
హరి అవతారమీతడు అన్నమయ్య - అరయ మా గురుడీతడు అన్నమయ్యా..
- పొన్నాడ లక్ష్మి
(చిత్రాలు courtesy శ్రీ Pvr Murty)

అన్నమయ్య - అన్నమాచార్యుడు

ఈరోజు అన్నమయ్య వర్ధంతి. అన్నమయ్య 'అన్నమాచార్యుడు" అయిన ఉదంతం.
ఘన విష్ణువు అనే వైష్ణవ యతి తిరుమలలో ఉండేవాడు.అతదు మహా భాగవతుడు. మాధవసేవ చేస్తూ సాటి మానవులకు విష్ణుతత్వాన్ని బోధించేవాడు. తన శెష జీవితాన్ని శేషాద్ర నిలయునికే అంకితం చేసాడు. ఆ దినం ద్వాదశి. రాత్రి వేంకటపతి ఆ యతికి కలలో కనిపించి "తాళ్ళపాక అన్నమయ్య అనే భక్తుడు రేపు నీదగ్గరకి వస్తాడు. వాడు నల్లగా అందంగా ఉంటాడు. ఎప్పుడూ నామీద పాటలు పాడుతూఉంటాడు. వాని చెవిలో మద్దికాయలు వేలాడూతూ ఉంటాయి. పట్టుకు కుచ్చులున్న దండె భుజంమీద మోపి మీటుకుంటూ ఉంటాడు. వానికి నీవు ముద్రాధారణం చెయ్యి. ఇవిగో నా ముద్రికలు" అని ఆదేశించాడు.
మర్నాడు ఉదయాన్నే స్నాన సంధ్యాదులు ముగించుకుని ఘన విష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల వద్ద నిల్చున్నాడు. అతని చేతిలో స్వామి సమర్పించిన శంఖచక్రాల ముద్రలున్నాయి. అన్నమయ్య పొద్దున్నే లేచి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి ని దర్శించుకున్నాడు. హరినామ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞశాలముందుకి వచ్చాడు. ఘనవవిష్ణువు వానిలో స్వామి చెప్పిన గుర్తులను చూసి మెల్లగా ఆ బాలుని సమీపించాడు. "నాయనా నీ పేరేమి?" అన్నమయ్య యతికి పాదాభివందనం చేసి "అన్నమయ్య" ప్రవర చెప్పాడు. యతి కళ్ళు ఆనందంతో మెరిసాయి. "నీకు ముద్రాధారణ చేస్తాను. సమ్మతమేనా..?" అని అడిగాడు. అన్నమయ్య యతి ముఖాన్ని చూసాడు. వేంకటేశ్వరుడే కనిపించాడు. "కృతార్ధుణ్ణి" అన్నాడు.
ఘన విష్ణువ వేదోక్తంగా అన్నమయ్యకు సంస్కారాలు నిర్వహించాడు. సాటి వైష్ణువులకు అన్ని విషయాలు తెలిపాడు. వాళ్ళు తృప్తిపడ్డారు. అప్పట్నించీ అన్నమయ్య అన్నమాచార్యుడయ్యాడు..
(చిత్రం courtesy శ్రీ Pvr Murty)

Tuesday 6 March 2018

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు యిర్రి దీముభోగముల నెనసేము. - అన్నమయ్య కీర్తన

వెర్రి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు
యిర్రి దీముభోగముల నెనసేము.

మురికి దేహము మోచి మూలల సిగ్గుపడక
పొరి బరిమళములు పూసేము
పరగ పునుకతల పావనము సేసేమంటా
నిరతితోడ దినము నీట ముంచేము

పుక్కట పంచేంద్రియపు పుట్టు పుట్టి యందరిలో
మొక్కించుక  దొరలమై మురిసేము
అక్కర నజ్ఞానమనే అంధకారముననుండి
దిక్కుల నెదిరివారి దెలిపేము

దినసంసారమే మాకు దేవుడని కొలుచుక
వెనుకొని ఘనముక్తి వెదకేము
యెనలేక శ్రీవేంకటేశ మమ్ముగావగాను
తనిసి తొల్లిటిపాటు దలచేము.

భావం॥  ఒకతనికి వెర్రి బాగా వచ్చింది. నాకు వెర్రి తగ్గిపోయిందని చెబుతూ రోకలిని తలకు చుట్టమన్నాడుట!  వెర్రి తగ్గితే రోకలిని తలకు చుట్టమనడమే వెర్రితనం కదా!
ఆ రకంగానే ఓ వేంకటేశా! మేము కూడా పెద్ద జ్ఞానులమనుకుంటూ ఈ లోకంలో ఎండమావుల్లాంటి భోగాలకోసమే తెగ తాపత్రయపడుతూంటాము.
ఓ వేంకటేశా! ఈ మురికి శరీరాన్ని మోస్తూ, ఆ మురికిని కప్పిపుచ్చుకుంటూ మూలమూలల సువాసనలు, సుఘంధ ద్రవ్యాలు (అంటే ఈనాడు ఉపయోగించే Body sprays అన్నమాట) పట్టిస్తాము.
ఠపీమని పేలిపోయే ఈ కపాలానికి తలంటి పోసి, సుగంధ నూనెలు మర్ధనాలు చేసి చక్కగా అలంకారాలు చేస్తాము( అంటే నేడు చేసే రకరకాల పిచ్చి పిచ్చి శిరొజాలంకరణలు, జుట్టుకి రక రకాల రంగులు వేయడం లాంటివి అనుకోవాలి).
పంచేంద్రియాల శక్తిని వ్యర్ధం చేసుకుంటూ ఇతరుల చేత దండాలు పెట్టించుకుని మురిసిపోతుంటాము. మనకేదో పెద్ద తెలిసున్నట్లు ఇతరులకు నీతులు భోధిస్తుంటాము.
ఓ వేంకటేశ్వరా! ప్రతిరోజూ చేసే సంసారంలోని నువ్వు దేవుడవని కొలిచి ముక్తిని పొందకుండా గొప్ప ముక్తి ఎక్కడొ ఉందని వెతుక్కుంటాము.  సాటిలేనివిధంగా నువ్వు మమ్మల్ని రక్షిస్తుంటే పూర్వజన్మ కర్మలను తలుచుకుని చింతిస్తూంటాము.

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ - అన్నమయ్య కీర్తన

మిక్కిలి నేర్పరి యలమేలుమంగ
అక్కర దీరిచి పతినల మేలుమంగ !!
కన్నులనె నవ్వునవ్వి కాంతునిదప్పక చూచి
మిన్నక మాటాడీనలమేలుమంగ
సన్నలనె యాస రేచి జంకెన బొమ్మలు వంచి
అన్నువతో గొసరీని యలమేలుమంగ. !!
సారెకు జెక్కులు నొక్కి  సరుసనె కూచుండి
మేరలు మీరీ నలమేలుమంగ
గారవించి విభునికి గప్పురవిడెమిచ్చి
యారతులెత్తీనిదె యలమేలుమంగ !!
ఇచ్చకాలు సేసి సేసి యిక్కువలంటి  యంటి
మెచ్చీనతని నలమేలుమంగ
చెచ్చెర కౌగిట గూడి శ్రీ వేంకటేశ్వరుని
అచ్చముగా నురమెక్కీ నలమేలుమంగ. !!

భావం..
మా అలమేలుమంగ భర్తగారి అవసరాన్ని కనుక్కొని చక్కగా దాన్ని నెరవేర్చింది. ఆమె మహా జాణ.
మా అలమేలుమంగ స్వామి వారిని అదేపనిగా చూస్తూ కళ్ళతో నవ్వింది. కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏది మాట్లాడాలో అది మాట్లాడింది. కొన్ని సంజ్ఞలతో అయ్యవారికి ఆశలు రేపింది. దగ్గరగా ఉన్న కదలే కనుబొమ్మలను ఎలా వంచాలో అలా వంచింది. ఇంతటితో ఊరుకుందా? కొన్ని ప్రత్యేకమైన కూతలు చేసి, కొన్ని కోరుకొంది.
అయ్యవారి దగ్గరకు చేరి తన చెక్కిలిని వారి చెక్కిలితో నొక్కింది. దగ్గరగా తాకుతూ కూర్చుంది. ఇంక ఆ తర్వాత  చెప్పవలసిన పనేముంది? కాస్త హద్దులు దాటింది. స్వామి వారికి కర్పూర తాంబూలమిచ్చింది. ఆ తరువాత ప్రేమతో హారతులిచ్చింది.
ఎప్పుడూ చేతలేనా, కాసిన్ని ప్రియమైన మాటలు చెప్పుకొందామని, ముందుగా తాను ప్రియముగా మాట్లాడింది. తదుపరి ఇరువురి శరీరాల తాకిడికి మైమరచిపోయింది. స్వామివారి చేతలను మనసారా మెచ్చుకొంది. ఇక ఆగలేక  ఎక్కువ బెట్టు చేయకుండానే వేంకటేశ్వర స్వామివారి కౌగిట్లోకి చేరింది. ప్రసన్నంగా తానే అతని వక్షస్థలం మీదికి చేరుకొంది.
శృంగారానికి పరమార్ధం ఒకరిలో ఒకరు లీనం కావడం. మోక్షానికి కూడా పరమార్ధం జీవాత్మ పరమాత్మలో లీనం కావడం. తన్ను తాను మరిచిపోయిన సాన్నిహిత్యం ఉంటేనే స్వామి అనుగ్రహం  మనకు లభించగలదనే అన్నమయ్య సందేశం  ఈ కీర్తనలో ఉంది.
సంకలనం, వ్యాఖ్యానం..డా॥ తాడేపల్లి పతంజలి.
సేకరణ..పొన్నాడ లక్ష్మి.

Wednesday 21 February 2018

మనసు

మదిలో మెదిలిన భావం.

కన్నపిల్లల అభివృధ్ధిని చూచి ఉప్పొంగిపొయే అమ్మ మనసు
భర్త ఉచ్ఛస్థితిని, పొందిన కీర్తిప్రతిష్ఠలని చూచి గర్వించే భార్య మనసు
రాఖీకట్టి అన్నదమ్ముల బాగోగులని మనసారా కోరుకొనే సోదరి మనసు
ఆనందంలోనూ, ఆవేదనలోనూ అండగా నిలిచి చేయూతనిచ్చే స్నేహితురాలి మనసు
ఎదిగిన మనవల ఘనకార్యాలను తలచి పొంగిపోయే అమ్మమ్మ మనసు
మంచిపేరు తెచ్చుకుని ఇంటిపేరుని నిలబెట్టిన మనవలను చూచి
 మా 'వంశాంకురాలని' మురిసిపోయే నాన్నమ్మ మనసు
అత్తమామలను ఆదరించి అవసాన దశలో ప్రేమతో సేవ చేసే కోడలి మనసు.
పై ఇంటి కోడలై పుట్టెడు బాధ్యతలలో మునిగిపోతూ జన్మనిచ్చిన
అమ్మ నాన్నల కోసం తపన పడే కూతురి మనసు.
భారత స్త్రీ మానసిక సౌందర్యానికి  సరిసాటి ఉందా ఎక్కడైనా?

- పొన్నాడ లక్ష్మి

Saturday 10 February 2018

అన్నమయ్య కీర్తన.. ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన

ఈ వారం అన్నమయ్య కీర్తన..
ఏల నన్ను వేఁడుకొనే విటు నీవే నేఁ గాన
తీలుపడనేర  నేను  తెలివేకాని. !!
నగి నగి తిట్టినాను నాతో నలిగినాను
వెగటు లేదు నాకు వేడుకే గాని
మొగిసి మాటలాడినాను మోనాన నీవుండినాను
జగడము లేదు నాకు చనవే కాని !!
కన్నులఁ గొసరినాను కాఁకల విసరినాను
చిన్నబోదు నా మోము చెలువే కాని
సన్నలనే తిట్టినాను చాయలనన్నాడినాను
యెన్న నెగ్గుగాదు నాకు నితవే కాని !!
పైకొనక మానినాను పరాకు సేసినాను
నాకెందు నెరవు లేదు నలుపేకాని
శ్రీకాంత నేను నీవు శ్రీ వేంకటేశుఁడవు
ఏకమైతి మెదురేది ఇచ్చకమే కాని. !!

భావమాథుర్యం..

అన్నమయ్య చెప్పిన ఈ సరస కీర్తనలో దేవి స్వామితో కరాఖండిగా ఏమంటున్నదంటే, మన కలయికకు ఎదురే లేదు స్వామీ! మన అనురాగమే కనిపిస్తుంది కానీ మరోటి నా దృష్టికి రాదు. నీవు నన్ను వేడుకోవటం దేనికి ప్రభూ? నీవే నేను గాన.
నేను నీ గురించి ఎన్ని పుకార్లు విన్నా దుర్బలను కాను. నాకు జ్ఞానము ఉన్నది. (స్వామి పరమాత్మ, దేవి ఆత్మ అని ఆమె గ్రహించినది). ప్రభూ! నీవు నవ్వుతూ తిట్టినా. పీడించినా నాకు వినోదమే కాని ద్వేషభావం లేదు. పూనుకొని నీవు మాట్లాడినా, లేక మౌనంగా ఉన్నా నాకు నీవంటే ఇష్టమే కాని మనమధ్య పోట్లాట రాదు, రాబోదు.
స్వామీ! నీ కన్నులలో నాపై ఆపేక్ష చూపించినా, లేక మండిపడినా నా మొగము ప్రసన్నంగా ఉంటుందే కాని, చిన్నబోదు. సన్నగా తిట్టినా చాయగా మాటలనినా నాకు హితమే కాని చెడు కాదు.
నాథా! నీవు నా పొందు కోరినా లెక, పరాకు చిత్తగించినా నాకు ఒప్పుగానే తోస్తుంది. తప్పు అనిపించదు. ఎందుకో తెలుసా ప్రభూ! నేను శ్రీకాంతను, నీవు శ్రీ వేంకటేశ్వరుడవు. అనవసర అపార్ధమే కాని మనమేకమైతే ఎదురేముంది?
వ్యాఖ్యానం.అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు.     
సేకరణ .. పొన్నాడ లక్ష్మి.

Saturday 3 February 2018

ఏమిటికిఁ జింత ఇదె నీకు ప్రేమపు బెండ్లి బెరసెగా నీకు - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.. పాలకూడు.

పాలతో వండిన అన్నాన్ని క్షీరాన్నమని, పాయసమని, పరమాన్నమని - ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అన్నమయ్య ఈ క్షీరాన్నానికి పాలకూడు అని పేరు పెట్టాడు. 'కూడు అన్న తెలుగు పదం ఇప్పుడు మోటయిందేమో కాని, అన్నమయ్య దృష్టిలో అతి పవిత్రం.  ఈ కీర్తనలో ఆయన మనకు పంచిపెట్టిన పాలకూడు తిని పరవశిద్దాం.

ఏమిటికిఁ జింత ఇదె నీకు
ప్రేమపు బెండ్లి బెరసెగా నీకు. !!

కలికి నీ చూపుల కలువదండలు తెచ్చి
తలకకాతనిమెడ దగులవేసి
మొలక నగవుల నీ ముత్యపు సేసలు చల్లి
తొలగని పెండ్లి దొరకెగా నీకు

చనవు గూరిముల కొసరులను గరమిడి
ఘనమైన కాకల గాలుదొక్కి
పనివడి వెన్నెల పాలకూడు గుడిచి
తనివోని పెండ్లి దగిలెగా నీకు

తరుణి నీ హృదయపుదమ్మిపరపుతోడ
నిరవైన సిరులతో నిల్లు నించి
తిరువేంకటగిరి దేవునితోగూడి
సరసపు బెండ్లి జరగెగా నీకు

భావార్ధం ..

అలిమేలుమంగమ్మ ఎందుకో బాధపడుతోంది. అన్నమయ్య ఒక చెలికత్తెగా మారి ఆమెను పరామర్శిస్తున్నాడు.

ఎందుకే అలా బాధపడుతున్నావు. మీ ఇద్దరూ చేసుకున్నది ప్రేమపెండ్లే కదా! (ప్రేమతో పెండ్లి చేసుకున్నప్పుడు విచారాలు రాకూడదని కవి హృదయం).
ఓ అమ్మడూ ! నీ చూపులనే కలువపూల దండలు తీసుకువచ్చి ఏమాత్రం చలించకుండా, భయపడకుండా (తలకక) అతగాడి మెడలో ప్రేమతో వేసావు. లేత నవ్వులనే నీ ముత్యాల తలంబ్రాలు పోసిన ఏమాత్రం పక్కకు జారని పెండ్లి నీకు దొరికింది కదా..!  (పెండ్లి చేసుకున్నప్పటికీ వధూవరులు ఇంకో పక్కకి చూపులు ప్రసరించకుండా పరస్పరం ఆనందంతో ఉన్నారని భావం)
అసలుకంటే కొసరు ముద్దు కదా..! నీ ప్రియుడికి చనవులతో కూడిన ప్రేమలు కొసరులుగా బాగా పెట్టావు. ఈ రోజు పెండ్లిలో కాకతో (తాపం) అతగాడి కాలు తొక్కావు. ఏమి కాక తల్లీ, నే చూస్తూనే ఉన్నాగా ! కావాలని ప్రయత్నపూర్వకంగా (పనివడి) పని కల్పించుకుని వెన్నెలలో పాలకూడు అతనితో పాటు తిన్నావుగా ! ఎంత సుఖపడ్డా తృప్తి ఏమాత్రం తగ్గని పెండ్లి చేసుకున్నావు కదా ! ఇంకా ఈ విచారం దేనికి?
 ఏమే .. ఎవరైనా పెండ్లి జరిగిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. నువ్వు మా వేంకటేశునితో పెళ్ళీ జరిగిన తర్వాత తామరపూల పరుపులతో కూడిన సిరులకు నిలయమైన నీ హృదయమనే ఇంట్లోకి తీసుకెళ్ళావు. (నువ్వు మా స్వామిని హృదయంలోనే పెట్టుకున్నావని భావం). శుభప్రదుడయిన మా వెంకటేశునితో కలిసి నీకు సరసాలపెండ్లి జరిగింది కదా .. ! ఇంకా నీకు ఈ దిగులేమిటే ?

పాలకూడు పదం రెండో చరణంలో వచ్చినా దాని రుచి మాత్రం మొత్తం కీర్తనలో ఉంది. అన్నమయ్యకు ఈ పాలకూడు చాలా ఇష్టమేమో. ఇలా పాలకూడులో జీడిపప్పు వంటి భావనలు అన్నమయ్య సాహిత్యంలో ఉన్నాయి. అన్నమయ్య సాహిత్యం ఘుమఘుమలాడే వేడి వేది పరమాణ్ణం.

(సంకలనం, వ్యాఖ్య డా. తాడేపల్లి పతంజలి గారు) - సేకరణ - పొన్నాడ లక్ష్మి

Saturday 27 January 2018

ఇంత చాలదా నాకు ఇందరిలో రమణుఁడ - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.

ఇంత చాలదా నాకు ఇందరిలో రమణుఁడ
సంతసాన నీకు మొక్కే సరసుడ విందుకు

చింతలన్నియు బాసె సిగ్గులన్నియును దేరె
ఇంతలోనే విభుఁడ నీవీడకు రాగ
మంతనాలు సరివచ్చె మర్మములన్నియు గొచ్చె
దొంతులయిన మాటలు నాతో నాడగాను

కపటమింతయు బాసె కాకలెల్ల చల్లనారె
ఇపుడు నా చెక్కు నొక్కి ఎనయగాను
తపమెల్ల ఫలియించె తలపులు సరిగూడె
అపురూపముగ నాతో నంది నవ్వగాను

వలపులు దైవారె వాడికెలు తుదమీరె
వెలయు నాపై చేయి వేయగాను
కలికి శ్రీవేంకటేశ కాయము లొక్కటి యాయ
సొలపు రతుల నన్ను జొక్కించగాను
భావమాధుర్యం :
అన్నమయ్య విరచితమైన ఈ సరస శృంగార కీర్తనలో అలిమేలుమంగమ్మ తన రమణునితో ఆరాధనగా ఏమంటున్నదో వినండి.
ఇందరిలో నాకిట్లా చేసేవుకదయ్యా ! ఇది చాలదా? ఓ సరసుడా ! ఇందుకు నాకు పరమానందముగా ఉన్నది. నీకు మొక్కుతానయ్యా.
నేడు నా చింతలన్నియూ తీరినవి. నా సిగ్గులన్నియు సిరివంతములైనవి. ఓ విభుడా! నువ్వు ఇక్కడకు రాగానే నిన్ను చూడగానే నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి. నా రహస్యాలన్నీ కూర్చబడ్డాయి. నీవు అదేపనిగా నాతో మాట్లాడుతుంటే నా ఆనందమేమని చెప్పను?
నీవు చెక్కిలి నొక్కి లాలించగానే నాలోని కపటాలన్నీ నశించినవి. నా కోపమంతా చల్లారింది. నీవు నాకు అధీనుడవై అపురూపముగా నవ్వితే నా తపము ఫలించినది.
నా ఆలోచనలన్నీ సక్రమమైనాయి. నీవు నాపై చేయి వేయగానే నా వలపులన్నీ అతిశయించినవి. నీకోసమే దాచిన నా యవ్వనం సార్ధకమైనది. శ్రీ వేంకటేశ్వరా ! నీవు నన్ను నీ రతి లీలలో చొక్కించగానే మన తనువులు ఏకమై తన్మయత్వము చెందితిని.
(వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుభ్రహ్మణ్య దీక్షితులు)
సేకరణ : పొన్నాడ లక్ష్మి.

Sunday 14 January 2018

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా!

ఊరుకున్న జీవునికి ఒక్కఒక్క స్వతంత్రమిచ్చి
కోరేటి   అపరాధాలు  కొన్నివేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా
దూరువేసే వింతగా దోషమెవ్వరిదయ్యా?

మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి
ఘనముసేసే విందు కర్తలెవరయ్యా?

వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే
కన్న  కన్న  భ్రమతలే  కల్పించి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఏలితివి మిమ్మునిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసు నయ్య!

భావం.. స్వామీ! ఓ వెంకటేశా! నీవు సర్వాత్మకుడవు. నేను నీ శరణు కోరేవాడినై సర్వపరాధాలకు కారణభూతుడైతిని. చాలు చాలయ్యా!
ఊరకే ఉన్న జీవునికి ఎంతో స్వతంత్రమిచ్చి కొన్ని విషయాలు సృష్టించి, అవి చెయ్యకుంటే నరకము, చేస్తే స్వర్గము అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వింతగా నిందిస్తున్నావు. ఇందులో దోషమెవరిదయ్యా?
మనసుతో చూడవలసిన వచ్చినవాటికి మాయలను నీవే కప్పిపుచ్చి, మాకందరికీ ఎన్నో విషయాలు రుచి చూపించి, ఇందులో మంచిచెడ్డలు కనుగొంటే మోక్షమిచ్చి, కానుకోక వాటికి లోబడితే కర్మమునిచ్చి గొప్పగా చేసేనని చెప్తావు. ఇందుకు కర్త ఎవరయ్యా?
ప్రాణులందరూ నీ గర్భములోనే ఉన్నారు, మేమే కన్నామని మాకు భ్రమ కల్పించుతావు. జగత్తునంతా నీవే ఏలుతున్నావు. అంతా నీ చేతిలోనే ఉంది. ఇంక నన్ను నీవు, నిన్ను నేను ఎంచుకుంటే ఎలా?  నీకే తెలుసు గదయ్యా..

అపు డేమనె నేమను మనెను - తపమే విరహపుఁదాపమనె - అన్నమయ్య కీర్తన

అపు డేమనె నేమను మనెను - తపమే విరహపుఁదాపమనె  ॥

పవనజ ఏమనె పడఁతి మరేమనె - అవనిజ నిను నేమను మనేను.
రవికులేంద్ర భారము ప్రాణంబనై - జవల నెట్ల దరియించెననె.  ॥

ఇంకా ఏమనె ఇంతి మరేమనె - కొంకక ఏమని కొసరుమనె     
బొంకుల దేహము పోదిది వేగనె - చింకవేఁట యిటు చేసె ననె   ॥

నను నేమనె ప్రాణము మన కొకటనె - తనకు నీవలెనె తాపమనె
మనుకులేశ ప్రేమపుమనకూటమి - ఘన వెంకటగిరిఁ గంటె ననె. ॥

అన్నమయ్య చెప్పిన ఈ విలక్షణమైన మధుర కీర్తన రామాంజనేయుల సంవాదము. సీతాదేవిని దర్శించిన  హనుమను ఆత్రుతతో ప్రశ్నలేస్తున్న రామచంద్రునికి  మాటలు వేగంగా వస్తున్నాయి. దానికి హనుమంతుడు ఇచ్చిన సమాధానాలు,  అదే ఈ కీర్తనలో భావం.
ఓ హనుమా!  ఆమె అప్పుడేమన్నది?  ఏమనుమన్నది నాతో?  ప్రభూ! తాను మీకోసం పడే విరహమే తన  తపము అన్నది.
పావనీ! పడతి సీత ఏమన్నది? మరొకమారు ఏమన్నదో చెప్పు. నిన్ను నా గురించి ప్రత్యేకించి ఏమన్నా అన్నదా?  ప్రభూ! రవికులేంద్రా  తనకు ప్రాణమే భారమైనదని రోదించినది. ఇకపై ఈ తనువును ఎట్లు దాల్చెదనని అడిగిందయ్యా..
ఓ కేసరీనందనా! ఇంతి ఇంకా ఏమన్నది?మరేమన్నది?  జంకక ఇంకా ఏమన్నదో వివరించవయ్యా!   ప్రభూ! నిరుపయోగమైన తన దేహము, వేగమె ఎందుకు పోదని విలపించింది.  మూగజీవియైన లేడికి  అపకారం తలపెట్టిన తనకి తగిన శాస్తి జరిగినదన్నదయ్యా!
కపిశ్రేష్టా! నన్నేమన్నా అన్నదా?  స్వామీ! తనువులు వేరైనా మీ జంటకు ప్రాణం ఒకటే ! అని చెప్పమన్నది. తనకూ నీ వలెనే ఈ విరహము తాపమన్నదయ్యా!  ఆఖరి మాటగా ఓ మనుకులేశా! ప్రేమాస్పదమైన మన కూటమి  ఘనమైన వేంకట గిరిపై కంటినయ్యా! అని అన్నది ప్రభూ!.

అట్ట నెరవాదివి నీవలమేలుమంగవు - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అట్ట నెరవాదివి నీవలమేలుమంగవు
నెట్టన నీ రమణుడు నిన్ను మెచ్చీ నిందుకు.

ఇయ్యకొంటె మాఁటలెల్లా నింపులై యుండు
నెయ్యముగలిగినట్టి   నెలఁతలకు
నొయ్యనే విచారించితే నుపమ పుట్టు
యెయ్యెడా నలుకలేని ఇంతులకు.

వున్నది నేమిసేసినా నొడఁబాటౌను
సన్నయెరిఁగినయట్టి సతులకును
విన్నకన్న సేఁతలెల్లా వేదుకై తోఁచు
నన్నిటా నోరుపుగల యతివలకు.

కందువఁ దెలిసితేఁ గరఁగు మతి
అంది వివేకముగల యాఁడువారికి
యిందరిలో శ్రీ వేంకటేశ్వరుఁడు గూడె
పొంది లిట్టివి నీవంటి పొలఁతులకును.

ఈ  కీర్తనలో  చెలికత్తెగా మారిన అన్నమయ్య అలమేలుమంగతో ఇలా అంటున్నాడు.
ఓ అలమేలుమంగా! నీవు సమర్ధురాలైన పడతివి. అందుకే నీ రమణుడు నిన్ను నీ యెదుటనే మెచ్చుకుంటున్నాడు.
అయినా ప్రపంచములో జరిగేది ఇదే కదా! ఇంతికి స్నేహంగా ఉండే మగని మాటలెల్లా ఇంపుగానే ఉంటాయి. అలుకే లేని స్త్రీలకు సరిగ్గా ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలు గోచరిస్తాయి.
మగని సంజ్ఞ తెలిసిన స్త్రీకి అంగీకారమైతే ఏమిచేసినా ఇష్టంగానే ఉంటుంది. అన్నింటిలోనూ ఓర్పు గల స్త్రీకి ఏమి కనినా, ఏమి వినినా తన మగని చేతలన్ని వేడుకగానే ఉంటాయి.
వివేకమున్న స్త్రీకి నేర్పు ఉంటే మగని మనస్సు కరిగించగలదు.   అందుకేనేమో ఇందరిలో నిన్నుమాత్రమే అనురాగముతో కలిసినాడు.  నీ వంటి స్త్రీలకు శ్రీ వేంకటేశుని పొందులు ఇటువంటివే..