Friday 26 February 2016

ఇంతకంటే సుద్దులు నే మెరఁగము - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన:

ప.    ఇంతకంటే సుద్దులు నే మెరఁగము
       వింత లెల్లా నీకు విన్నవించంగ వచ్చితిమీ                ||

చ.    మనసెల్లా నీమీఁద మంతనాలు చెలులతో
       తనువు పానుపుమీఁదఁ దరుణికిని
       కనుగొంటే దయ పుట్టు కదా నున్నవారికైనా
       వినవయ్య నీకు విన్నవించంగ వచ్చితిమి.                ||
2.    గురిగాఁ జేయు చెక్కుపై కొనచూపు నీ రాకకై
       జరయు నిట్టూర్పులు చన్నులమీఁద
       కరకురా యైనాను కరఁగుఁబో నీకు వలె
       వెరగంది ఇదే విన్నవించంగ వచ్చితిమి.                             ||
3.    అలయిక తనలోన అసలు నీ కౌఁగిటిపై
      సెలవుల లేనగవు శ్రీవేంకటేశ
      కలిసితి వింక మేడకంబమైనా నిగిరించు
      వెలసే వేడుక విన్నవించంగ వచ్చితిమి.                    ||

భావమాధుర్యం:

         దేవి చెలికత్తెలు శ్రీనివాసునికి విన్నవించుకొంటున్నారు.  అన్నమయ్య వారిలో ముఖ్యమైన చెలికత్తెగా భావించుకుని ఈ కీర్తనలో ఇలా విశదీకరిస్తున్నాడు.  

         స్వామీ! ఇంతకంటె ఆమె ‘కతలు’ వివరించలేమయ్యా! అన్నీ వినడానికి వింత వింతగా ఉంటాయి. ఆమె విరహవేదన చూడలేక నీకు విన్నవించుకుందామని వచ్చాము. ప్రభూ! తానొకపక్క చెలులతో మంతనాలు చేస్తున్నా ఆమె మనసంతా నీమీదే ఉన్నదయ్యా! ఆమె శరీరమే పాన్పుమీద ఉన్నది. ఆ తరుణిని కనులారా చూస్తే పరాయివారికైన దయ పుడుతుంది. నీవు స్వతహాగా కరుణానిధివని నీకు విన్నవించ వచ్చాము.

          దేవా! ఆమెను గమనించు. తన చేయి చెక్కిలిపై జేర్చి క్రీగంట నీ రాకకై ఎదురు చూస్తూనే ఉంది. ఆమె నిరాశతో నిట్టూరుస్తుంటే ఆ వేడికి చనుగవ వేడెక్కుతున్నాయి. ఆమెను చూస్తే నీ వంటి రాతిహృదయం కలవారి గుండె అయినా కరిగి తీరాలి. మేము కూడా భయపడి నీ వద్దకు వచ్చాము.

         స్వామీ! తనలో శ్రమచేత  ఆమె అలిసిపోయింది. అయినా నీ కౌగిలిలో స్వాంతనకై  నిరీక్షిస్తున్నది. ఆమె పెదవులపై చిరునవ్వు మాయలేదు. ఓ శ్రీవేంకటేశ్వరా! ఒంటి స్తంబపు మెడలోని రాణివలెనున్న ఆమెను నీవు కూడితే పొందే వేడుక వివరించ వచ్చామయ్యా..          

Tuesday 16 February 2016

ఇంట గెలిచి కా నీవు యిక రచ్చ గెలిచేది. వెంటనే ఆనతీరాదా వినవలె నేను. - అన్నమయ్య కీర్తన




ఈ వారం అన్నమయ్య కీర్తన. 13.2.16

ప.       ఇంట గెలిచి కా నీవు యిక రచ్చ గెలిచేది.
          వెంటనే ఆనతీరాదా వినవలె నేను.
౧.       మాయలెంత సేసినాను మచ్చికెంత పూసినాను
          ఆయెడ నావలె నిన్నునాపె నమ్మీనా
          కాయవు నీ ఘాతలివి కందువ మచ్చములివి
          యేఇంతి సేసినవంటే యేమనేవు నీవు?               ||

౨.       కల్లలెన్ని ఆడినాను కదిసెంత గూడినాను
          యిల్లదే నావలె నాపె యియ్యకొనీనా 
          తెల్లని కన్నులతేట దిష్టమైన యా చెమట
          చెల్లబెట్టుకొని యాపె చింతవాప గలదా?                ||

౩.       నెమ్మినెంత  పొగడినా నీకు నీకే పొగడినా
          రమ్మని  నావలెనాపె రతి గూడీనా
          యెమ్మెల శ్రీ వేంకటేశ యెనసితివిటు నన్ను
          సమ్మతించనాడనెట్టు సరసమాడేవు.                             ||

భావం.   అన్నమయ్య ఈ కీర్తనలో యింతులకు ‘ఈర్ష్య’ సహజమైనదని  నొక్కి వక్కాణిస్తున్నాడు. అందులోనూ తన మగనికి వాంఛ రేపగల మగువను భార్య సహించలేదు. నాయిక స్వామితో ఏమంటున్నదో చూడండి.
          స్వామీ! నీవు ఇంట గెలిచాక కదా! రచ్చ గెలిచేది? ఆమెతో తమరి పాట్లు వెంటనే ఆనతిస్తే విని నేనూ ఆనందిస్తాను. ఒకటి మాత్రం నిజం. నీవెన్ని మాయలు చేసినా ఎంత చనువు చూపినా నిన్ను ఆవిడగారు నమ్మటమనేది కల్ల. నీ వంటిమీద ఈ గాట్లు, మచ్చలు ఏ ఇంతి సేసినవి అని ఆమె అంటే తమరి సమాధానమేమిటో? నీవు నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పినా, దగ్గరయై యెంత సముదాయించినా నావలె ఆమె నిన్ను ఇట్లాంటి విషయాలలో నమ్ముతుందా? అది ఎన్నటికీ జరిగే పని కాదు. తేటగా మెరుస్తున్న నీ కళ్ళు, కంటికి కనిపిస్తున్న ఈ చెమటలు  పోనీలే అని ఆమె సరిపెట్టుకోదు. అది ఆమెని తప్పక బాధిస్తుంది. స్వామీ! నీ నామమెంత పొగిడినా నిన్ను రమ్మని నావలె రతికి ఆహ్వానించదు. శ్రీ వేంకటేశా ! నాకు సుఖమిచ్చినట్లు దానికియ్య లేవు. ఇది నిజం.