Monday, 17 August 2026

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు - అన్నమయ్య కీర్తన

ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుఁడు చూడ-

నెవ్వరికి నేమౌనొ యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక

కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు


యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖ-

మెందరికిఁ గావింపఁ డీజీవుఁడు॥ఎవ్వరె॥


యెక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక-

కెక్కడో తనజన్మ మీజీవుఁడు

యెక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యెప్పు-

డెక్కడికి నేఁగునో యీ జీవుఁడు॥ఎవ్వరె॥


ఎన్నఁడును జేటులే నీజీవుఁడు వెనక-

కెన్ని దనువులు మోవఁ డీజీవుఁడు

యెన్నఁగల తిరువేంకటేశు మాయలఁ దగిలి

యెన్ని పదవులఁ బొందఁ డీజీవుడు.


భావం:


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో జన్మించుచున్నాడు. ఇట్టి జీవుడు ఏ ఏ జన్మలలో ఎవరెవరికి ఏ ఏ వావిపరుసులతో సంబంధం పడి ఉన్నాడో నిర్ణయించుట ఎవరితరము? విచారించగా జీవులలో ఒకరితో నొకరికి ఎట్టి సంబంధము లేదు.


ఈ జీవుడు ఎన్నో జన్మములలో ఎందరికో కొడుకై జన్మించాడు. పూర్వం తానందరికోగా పుట్టినాడు. ఎందరినో ఎన్నో విధాల పుత్రమిత్ర కళత్రాది సంబంధాలతో భ్రమింపజేసినాడు. ఎందరినో ఎన్నో రీతుల దుఃఖాలపాలు చేసినాడు.


ఈ జీవుడు తిరగని చోటే లేదు. ముందటి జన్మలలో ఎన్నో చోట్ల పలు రూపులతో జన్మించి తిరిగి ఉన్నాడు. తానున్న జన్మంలో ఇతడు ఎక్కడెక్కడ పుట్టనున్నాడో? ఈ జన్మలో మాత్రం తనకి జీవుడు ఏ విధంగా అనుగుచుట్టము కాగలడు? ఇతడు ఎప్పుడు ఎక్కడికి పోవునో తెలియదు కదా!


ఎండి జన్మలో దాలుస్తున్న ఎన్నిసార్లు మరణిస్తున్న నిజంగా ఈ జీవులకు మాత్రం ఎట్టి చేటును లేదు పూర్వమితడెన్నో తనువులు దాల్చినాడు తాను దాల్చిన శరీరములే చేటు వందుతున్నాయి గాని సనాతనుడైన జీవాత్ములకే మాత్రము చేటు లేదు శ్రీ వేంకటేశ్వరుని మహామాయ ప్రభావానికి లోబడి ఈ జీవుడెనో పదవులు పొందుతున్నాడు అని అన్నమయ్య జీవుల జన్మల గురించి వేదాంతపరంగా పై కీర్తనలో వర్ణించినాడు.


- కీ. శీ. సముద్రాల లక్ష్మనయ్య

ఇన్నిటికినీశ్వరేచ్ఛ- యింతే కాక - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన


ఇన్నిటికినీశ్వరేచ్ఛ- యింతే కాక

తన్నుదానే హరిగాచు- దాసుఁడైతే జాలు.

ప్రకృతిఁబుట్టిన దేహి- ప్రకృత (తి?) గుణమే కాని

వికృతి బోధించబోతే- విషమింతే కాదా!

ఒక విత్తు వెట్టితే వేరొకటేల మొలచును?

ప్రకటమైన వట్టి- ప్రయాసమే కాక.

పాపానఁ బుట్టిన మేను- పాపమే సేయుంచుగాక! 

ఏపునఁ బుణ్యముతోవ- యేల పట్టును,

వేపచేదు వండితేను- వెసనేల బెల్లమవును?

పై పై బలిమి సే సే- భ్రమ యింతేకాక.

ప్రపంచమైన పుట్టుగు- ప్రపంచమునకే కాక

ఉపమించ మోక్షమున- కొడఁబడునా?

ప్రపన్నుఁడైన వేళ- భాగ్యాన శ్రీవేంకటేశుఁ

డపుడు దయఁ జూడఁగ- నధికుఁడౌగాక !

(సంపుటం-3, సంకీర్తన-123)


"ఇన్నిటికి ఈశ్వరేచ్ఛ" (ఇన్నిటికీ ఈశ్వరేచ్ఛ) అనేది సర్వం శ్రీహరి లేదా ఈశ్వరుని సంకల్పం మీద ఆధారపడి ఉంటుందని తెలిపే తాళ్ళపాక అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంకీర్తన. మనిషి ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కార్యానికి దైవ సంకల్పమే మూలమనే తత్త్వాన్ని ఈ కీర్తన వివరిస్తుంది. 


కీర్తన సారాంశం


ఏది జరగవలెనున్నను భగవంతుని  ఇచ్ఛానుసారంగా జరగవలసినదే. ఆయనకు దాసుడు అగుట ఒక్కటే జీవుని కర్తవ్యము. అప్పుడు దయానిధి అయిన శ్రీహరి తానే వీనిని కాపాడగలడు. 


దేహధారిణి అయిన ఈ జీవుడు భగవంతుని మాయ ప్రభావంచే కలిగిన ప్రకృతి నుండి శరీరంతో జన్మించినాడు. వీనికి ప్రకృతి సహజములైన గుణములే ఉండును కానీ ఇతర గుణములు ఉండవు. ప్రకృతికి అతీతముగా ప్రవర్తించమని వానిని మనము బలవంతము చేసినచో ఆశించిన ప్రయోజనం సిద్ధించక పోవుటే కాక అది విషమమైన పరిణామమునకే దారితీయును. ఒక చెట్టు విత్తు నాటినచో ఆ చెట్టే మొలుచును కానీ మరొక చెట్టు ఎట్లు మొలుచును? ఒకవేళ అట్లు మొలిపించుటకు ప్రయత్నించినచో అది వట్టి ప్రయాసయే అగునుగాని ఫలం ఉండదు కదా! ఈ శరీరము పాప కర్మముచే పుట్టినది. ఇది మనచే తనకు సహజమైన పాపకర్మనే చేయించును కానీ పుణ్య మార్గమును ఎందుకు అనుసరించిను. వేప  చేదు వండినచో చేదుగానే ఉండును కానీ బెల్లంవలే తీయగా ఎట్లుండును? కాన ఈ తనువును పుణ్యపదమున నడిపింపగలవని పూనుకొనుట బ్రహ్మయే కానీ మరేమియు కాదు సుమా!


మన జన్మము ప్రపంచ ప్రవృత్తికి సంబంధించినది.  ఇది ప్రపంచ మాయాజాలమున మనలను తగిలించుటకే ప్రయత్నించును కానీ మోక్షమున కంగీకరించునా? కావున జీవుడు భగవంతుని ఎడల ప్రపన్నుడు కావలెను. అప్పుడు భాగ్యవశమున శ్రీ వేంకటేశ్వరుడు వానిని దయ చూచును. అంతటనతడు ముక్తుడై అధికుడగును.  ఇంతకంటే వేరొక సులభోపాయము జీవునకు లేదు. 


డా. సముద్రాల లక్ష్మణయ్య

Sunday, 25 August 2024

శ్రీకృష్ణతత్వం


 

పద కవితాపితామహుడు అన్నమయ్య  శ్రీకృష్ణుని పై అనేక కీర్తనలను రచించాడు. శ్రీకృష్ణ జననం నుంచి గీతోపదేశం విశ్వరూప దర్శనం వరకూ ఎన్నో కీర్తనలను రచించాడు. అందులో కొన్నినాకు తెలిసినవి .. 

‘సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి-కతలాయె నడురేయి కలిగే శ్రీ కృష్ణుడు’ , అంటూ కృష్ణ జననం, ‘చిన్ని శిశువు చిన్ని శిశువు, ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’ అంటూ అపురూపమైన చిన్ని కృష్ణుని చేష్టలు అని తన కీర్తనలో  చెప్తాడు.  ముద్దు గారే యశోద ముంగిట ముత్తెము వీడు అని యశోద గారాల తనయునిగా చిత్రీకరిస్తాడు.  ఇంక శ్రీకృష్ణుని అల్లరి పనులు వర్ణిస్తూ , ;పాలు తాగె వెన్నదినె బానల పెరుగు జుర్రె సొలి కాగుల నేతులు చురలాడెనమ్మా’ ఇంకొక కీర్తనలో ముచ్చువలె వచ్చి తన ముంగె మురువుల చేయి తచ్చెటి పెరుగులోన తగవెట్టి – నొచ్చెనని చేయిదీసి నొరనెల్ల చొల్లుగార వొచ్చెటి వాపోవు వాని నూరడించరే’ అని,   గొల్లపల్లెలో సొచ్చి కొల్లలాడిన కొడెకాడు’ అని ఒక కీర్తనలో , వెన్నలెల్ల  తామెసగి కృష్ణుడా ఇంటి చిన్న కోడలి మూతి నించి చమరె – వెన్న మూతి చూచి అత్త వేగమె కోడలి గొట్టె ఇటువంటి కొంటె పనులు ఎన్నో తన కీర్తనలలో మనకి చూపించాడు.

పరమాత్ముడు శ్రీకృష్ణుడు అని తెలియని గొల్ల పడుచులు ; ఏమమ్మా ఊరకుండేవే యశొదమ్మా – ఈ మేంటి బాలకృష్ణు నే మరకువమ్మా.. బండి దన్నె  బట్టరమ్మ  బాలుని పాదము నొచ్చె- కొండనెత్తె నొకచేత గోరి వీడు – పాముబట్టీ  బట్టరమ్మ పసిబిడ్డడే మెరుగు – బూమెల ఈ బాలునికి బుద్ధి చెప్పరమ్మ.ఽని ఒక కీర్తనలొ బండిని తన్నాడు కాలు నొప్పెట్టి ఉంటుంది, కొండ నెత్తాడు, పాముని పట్టాడు పాలు వెన్నలు దొంగలించి పారిపోతాడు,  పాపం  పసివాని కేమి తెలుసు. కాస్త బుద్ధి చెప్పి జాగ్రత్తగా చూసుకొ యశోదమ్మా అని చెప్పినట్లు ఒక కీర్తన.

ఇంకొక కీర్తనలో యశోదకు తనయుని పై మమకారం ‘పిలువరే కృష్ణుని పేరుకొని ఇంతటాను – పొలసి ఆరగించ పొద్దయెనిపుడు కృష్ణుడెక్కడున్నాడో భోజనానికి వేళయింది ఆకలితో ఉంటాడు. యమునలో ఈదులాడుతున్నాడొ, గొల్లభామల చే జిక్కినాడో, సాందీపుని వద్ద చదువుకుంటున్నాడొ. నెమలి చుంగులకోసం వెళ్ళాడో, కూరలన్నీ చల్లారిపోతున్నాయని  కృష్ణుని వెతకి తీసుకు రమ్మని యశోద ఆవేదన ఎంతోహృద్యమంగా అన్నమయ్య వివరిస్తాడు.

మరొక మథుర కీర్తనలో పరమపురుషుడట – పశుల గాచెనట సరవులెంచిన విన సంగతా ఇది. వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట నాదించి విన్నవారికి నమ్మికా ఇది, అల బ్రహ్మ తండ్రి యట యశోదకు బిడ్డడట కొలదొకరికి చెప్పకూడునా ఇది.. ఇవన్నీ నమ్మతగ్గ విషయాలేనా .. అంటూ ఆశ్చర్యపోతూంటాడు అన్నమయ్య.

ఇంకొక అద్భుత కీర్తన..’కనియు గానరు నీ మహిమ – కౌరవ కంస జరాసంధులు – మనుజులు దనుజుల జంపిరనమ్గ విని మరి నీ శరణము చొరవలదా…  ఇందులో  అన్నీ చూస్తూ కూడా నీ మహిమను కానలేకున్నారు కౌరవులు, కంసజరాసంధులు, నీ నోటిలో బ్రహ్మాండమును చూపావు, పూతకి చన్నుద్రావి చంపావు, బండి తన్నావు, కొండనెత్తావు బాలుడు చేసే పనులా ఇవి..  అని అడుగుతున్నట్లు ఉంటుంది. ఇంకా ఎన్నో కీర్తనలు, గోపికలతో సరాగాలు, కోలాటాలు, ఉట్ల పండుగలు అన్నీ అద్భుతంగా వర్ణించాడు. గీతోపదేశం కూడా ఒక కీర్తనలో క్లుప్తంగా చెప్పాడు అన్నమయ్య. ‘భూమిలోనచొచ్చి సర్వభూత ప్రాణులనెల్ల ధీమసాన మోచేటి దేవుడనీనూ—కామించి సశ్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడ నేనూ.. అని ఆనతిచ్చె  కృష్ణుడర్జునునితో, విని ఆతని భజింపుము వివేకమా…



Monday, 28 August 2023

అసమాన నటి సూర్యకాంతం

 


   అసమాన నటి  సూర్యకాంతం. 

 

సూర్యకాంతం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాలని ఉంది. జగమెరిగిన  బ్రాహ్మణునకు జంధ్యమేల అని అంటారు అలాగ సూర్యకాంంతం గారి గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.  


నా చిన్నప్పటి నుంచి ఆమె పోషించిన పాత్రలను అనేక చిత్రాలలో చూసాను. కేవలం గయ్యాళి అత్తగా మాత్రమే కాక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆమె పోషించారు.  కన్యాశుల్కం లో బాలవితంతువుగా ఎంతో బాగా నటించారు. చక్రపాణి లో మనోరమ అక్కయ్యగా హాస్యం పండిస్తూ దేనికైన “అంతొద్దు సగం చాలు” అంటూ, భానుమతికి మంచి సలహాలిస్తూ చాలా సహజంగా ఆ పాత్రను పోషించారు.  తోడికోడళ్ళు చిత్రంలో అనసూయగా అసూయను అద్భుతంగా నటించారు. అలాగే వాగ్దానం చిత్రంలో బాలామణి పాత్రలో తంపులమారిగా ఉన్నా తన భర్త రేలంగి గారు హరికథ చెప్తున్నపుడు పక్కవాయిద్యం వయొలిన్ వాయిస్తూ నిజంగా వైయొలిన్ కళాకారిణిలాగే హావభావాలు అద్భుతంగా ప్రదర్శించారు.

 

ఇంక చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో వర్ధనం పాత్రలో తనభర్తకి ఎవరో అమ్మాయిపై మనసున్నదని అనుమానం పడుతూ భర్తని(రేలంగి) అలరించడానికి వయసులో ఉన్న పిల్లలా తయరయ్యి దగ్గరకు వస్తుంది. అక్కడ ఆమె ప్రదర్శించిన సిగ్గు, బిడియం, వయ్యారం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. ఎప్పుడూ నోరు పెట్టి రాక్షసిలా పడిపొయే సూర్యకాంతం గారు ఇద్దరుమిత్రుల చిత్రంలో అతి కోపిష్టి   భర్త(రేలంగి) కి అడుగులకి మడుగు లొత్తుతూ నోరు మెదపకుండా అతని ధాటికి హడిలిపోతూ అణిగిమణిగి ఉండే ఇల్లాలిలా అతి సహజంగా నటించారు. బాటసారి చిత్రంలో నాగేశ్వరరావు గారికి సవతి తల్లి పాత్ర పోషించారు. సవతి తల్లి అయినా వల్లమాలిన ప్రేమ, అనురాగం కొడుకుపై కలిగి చదువుకుందుకి విదేశాలు వెళ్తానంటే అమాయకుడైన తనకొడుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని తను కూడా వెళ్తానంటుంది."అక్కడ ఏమైనా అవాంచనీయ సంఘటను జరిగితే సవితి తల్లిని నిన్ను సరిగా చూడలేదు అంటారు నాయనా"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని మధన పడుతుంది. అద్భుతమైన నటన అక్కడ చూపించారు. 


అలాగే మూగమనసులలో కూడా సావిత్రి గారికి సవతితల్లి పాత్ర పోషించినా మాట కరుకుగా ఉన్నా  కూతురి మీద అభిమానం, ఆమె భవిష్యత్తు  గురించి ఆరాటం  చాలా చక్కగా అభినయించారు.  'అంతా మనమంచికే'  చిత్రంలో  సంఘసంస్కర్త లీలారావు పాత్రలో తనకేమీ తెలియకపోయినా తెలిసినట్లు ఆర్భాటం చేస్తూ రామయణంలో ద్రౌపది గురించి సభలో మాట్లాడి అపహాస్యం పాలయి మనందరినీ నవ్విస్తుంది. ఆమె గయ్యాళి పాత్రలో నటిస్తున్నా ఎడం చెయ్యి తిప్పుతూ   తన సహజ శైలిలో ఆంగిక ప్రదర్శన చేస్తూ సునుశితమైన హావభావాలను ప్రకటిస్తారు. అది ఆమె గొప్పదనం.  

ఆమె నటన అతి సహజం. ఆమె వాచికం అత్యద్భుతం. ఆమె మన తెలుగువారికి భగవంతుడు ప్రసాదించిన వరం. 

ఆమెకు ఆమే సాటి. అటువంటి సహజనటిని ఇంతకుముందు చూడలేదు. ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారని ఆశలేదు.

-- పొన్నాడ లక్ష్మి

Thursday, 23 March 2023

సంకీర్తనాచర్యులు అన్నమయ్య.


 


సంకీర్తనాచార్యులు అన్నమయ్య


ఫాల్గుణ బహుళ ద్వాదశి - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి


కారణజన్ముడైన అన్నమయ్య బాలప్రాయంలోనే తిరుమలేశుని మీద వచ్చీ రాని పదాలు

పాడుకుంటూ తిరుపతి కొండ ఎక్కుతూ మూర్ఛ పోయాడు .అప్పుడు అలమేలుమంగమ్మ ఆ

బాలుణ్ణి సేదతీర్చి స్వామివారి ప్రసాదం పరమానాన్ని ప్రేమతో తినిపించింది

అమ్మచేతి ప్రసాదాన్ని గోరుముద్దలుగా తిన్న మహత్మ్యంతో ఆ బాలుడు

అప్పటికప్పుడు అశువుగా ‘వేంకటేశ్వరా’ అన్న మకుటంతో అమ్మపై ఒక శతకాన్ని

చెప్పాడు. ఇది అన్నమయ్య మొదటి రచనని చెప్పవచ్చు. ఆ తల్లి కృప వల్లనే

అన్నమయ్య “ఆడిన మాటలెల్లా అమృత కావ్యమై పాడిన పాటెల్ల పరమ పావనమై”

అలరారింది.


శృంగార భావాలతో కొన్ని, యోగమార్గంలో కొన్ని, భక్తి, వైరాగ్య వాసనలతో కొన్ని

పరమమంత్రములుగా 32,000 కీర్తనలను, సంస్కృతంలో వేంకటేశ్వర మహత్మ్యం,

తెలుగులో శృంగారమంజరి అనే లఘుకావ్యం, పన్నెండు శతకాలు ఆనాటి

వాడుకభాషలన్నింటిలో సాటిలేని ప్రబంధాలు రాసాడట. అయితే 32,000 సంకీర్తనల్లో

14,000 కీర్తనలు, శృంగారమంజరి, అలమేలు మంగమ్మపై శతకం మాత్రమే లభ్యమయినాయి.

వారు రచించిన రామాయణం దొరకకపోవడం మన తెలుగువారి దురదృష్టం.


అన్నమయ్య కీర్తనలలో ప్రత్యేకంగా చెప్పుకో దగినవి’సంవాద గీతాలు అంటే

యుగళగీతాలు. వీటిని వాకోవాక్య గీతాలు అంటారుట. గోపికాకృష్ణుల సంవాదం,

యశోదాకృష్ణుల సంవాదం, భావామరదళ్ళ సరస సంవాదం, అత్తాకోడళ్ళ ఎత్తిపొడుపు

సంవాదం, స్వామివారితో అమ్మవారు అలకతో వాదీంచే సంవాదం ఇలా ఎన్నో ఆయన

రచనల్లో గోచరిస్తాయి.


అన్నమయ్య అభ్యుదయవాది. అసలు స్త్రీవిద్యని ప్రోత్సహించి , స్త్రీల చేత

కూడా కవితలల్లించిన ఉత్తమ సంస్కారి అన్నమాచార్యులు. ఈతని భార్య తిమ్మక్క

“సుభద్రా కల్యాణం” అనే కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవియిత్రి అయింది. ఆంధ్ర

లోకానికి తొలి కవయిత్రిని పరిచయం చేసిన్ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది..

స్త్రీల యెడల, వారి ప్రతిభాపాటవాల పట్ల ప్రత్యేక దృష్టి కలిగి, వారు

పాడుకోవడానికి ప్రత్యేకంగా ఎన్నో రకాల పాటలను కూర్చిపెట్టాడు.


పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, దంపుళ్ళ పాటలు,, కోలాటపు పాటలు,

సువ్వి పాటలు, గొబ్బి పాటలు, జోల ఆటలు, జాజరలు, చల్లలమ్మే పాటలు ఇలా ఎన్నో

స్త్రీలు పాడుకొనే పాటలు రచించాడు. ఇంతే కాక తొలి పలుకులు నేర్చిన తన బిడ్డడికి

ఆ తరం ప్రతి తెలుగుతల్లి నేర్పే తొలి పద్యాల్లో ఒకటయిన చేత వెన్న ముద్ద అనే

పద్యం కూడా అన్నమయ్య చిన్నికృష్ణ శతకం లోనిది. ఆ శతకం సీసపద్య శతకం.

చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ

బంగారు మొలత్రాడు – పట్టుదట్టి

కొండెపు సిగముడి – కొలికి నెమలిపురి

ముంగురుల్ మూగిన – ముత్తియాలు

కస్తూరికింబట్టు (?) – కన్నులన్ కాటుక

చక్కట్ల దండలు ముక్కుపోగు

సందెతతాయ్వ్తులన్ – సి(స)రి మువ్వ గజ్జెలు

అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు

డాబు డంబరమీర –డాచేతిపై నిల్చి

కాళ్ళ సందె ఘల్లు ఘల్లుమనగ

దోగి దోగి యాడ తాళ్ళపాకన్నన్న

చిన్నికృష్ణ! నిన్ను చేరి కొల్తు .

కాలక్రమమున రూపాంతరము చెంది


చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ

బంగారు మొలత్రాడు పట్టుదట్టి

సందె తాయెతులు సరిమువ్వ గజ్జెలు

చిన్నికృష్ణ నిన్ను చేరి కొలుతు.

అనే రూపంగా ఈ పద్యం తెలుగు తల్లుల నోళ్ళలొ నాట్యం చేస్తూ ఉంది.


స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో పాడుకొనే పెక్కు విధాలయిన

పాటలపద్ధతిని తాను స్వీకరించి, కీర్తనలు గా రచించి, ఆ పాటలకు ఉన్నతస్థితినీ,

ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.

స్త్రీ జాతిని ఇంతగా గౌరవించి, వారికోసం ఇంత సాహిత్యం సమకూర్చిన

వాగ్గేయకారుడు కూడా అన్నమయ్యే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇంకా ఎన్నో అపురూప భావాలతో అనన్య సామాన్యంగా పదరచన చేసి “న భూతో న

భవిష్యతి “ అన్నట్లుగా తన పదకవితా సంపదను అత్యంత మనోజ్ణంగా మనముందుంచాడు.

అన్నమయ్య భావనా బలానికి, ప్రతిభా సంపన్నతకు ఆయన పదాలన్నీ ఉదాహరణలే.

అన్నమయ్యకు పదకవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనీ బిరుదులున్నాయి. ఇతడు

1408 లో వైశాఖ పౌర్ణమి నాడుజన్మించి, 1503 ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు

దివ్యధామం చేరినట్లు తెలుస్తూంది.


- పొన్నాడ లక్ష్మి

Tuesday, 28 February 2023

ఎంతవరకు ఈమనసు

 వచన కవిత్వం - ఓ చిన్ని ప్రయత్నం.

ఎంతవరకు ఈ మనసు అంధకారాన్ని ఎదుర్కొంటుంది?
సమసిపోతుంది ఉదాసీనత ఎప్పుడో ఒకప్పుడు.
సుఖదుఃఖాలు వస్తూ పోతూంటాయి జీవిత సత్యాన్ని తెలుపుతూ.
ఆకురాలుకాలం కొద్దిరోజులు మాత్రమే
పూలవనం మళ్ళీ కళకళలాడుతుంది కొత్త చిగురులతో
ప్రచండ మారుతం వీచినా, అంతరంగంలో అగ్నిశిఖలు రగులుతున్నా
ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకొని అడుగు ముందుకు వెయ్యి
పడిలేచే కడలి తరంగాలు తీరాన్ని చేరుతూనే ఉంటాయి
.. పొన్నాడ లక్ష్మి
All reactions:
Vemuri Murty, Vani Venkat and 14 others
2 comments
Like
Comment
Share

ఆవేదన - కవిత

 


ఆవేదన.

గుండె పగిలిపోతూంది మనసు మండిపోతూంది.

అమ్మ మనసులో రగులుతున్న అగ్నిపర్వతం.

ఆడపిల్లకు జన్మనివ్వాలంటే భయం భయం

తనంత తాను వలచి, వలపించుకుని వివాహమనే బంధంలో ఇరికించి

నిత్యం నరకం చవి చూపించే మగాడూ మృగమే..

కులం గోత్రం చూసి పెద్దలు కట్టబెట్టిన మొగుడూ మృగమే..

కట్నకానుకలు అందుకుని, భార్యను నమ్మించి

విదేశాలకు ఉడాయించినవాడు ఒకడైతే,

రాక్షస ప్రవృత్తితో మానసిక హింస పెట్టి కట్టుగుడ్డలతో

ఇంటి నుంచి పారిపోయేలా చేసేది ఒకడు.

ఏ రాయి అయినా ఒకటే కదా! అనిపించే పరిస్థితి.

కళకళలాడుతూ పచ్చని గృహిణిగా తిరుగాడవలసిన అమ్మాయి,

ఏ ముద్దుముచ్చట లేక మోడులా మిగిలితే బాధేగా మిగిలేది.

నేర్చుకున్న విద్య జీవనోపాధి కలిగిస్తుందేమో గానీ,

అతరంగంలో సుళ్ళు తిరిగే బాధను తీర్చగలదా?


ఆత్మస్థైర్యంతో చిరునవ్వు మొహాన పులుముకుని

తల్లితండ్రులను మభ్యపెట్టగలవు కానీ, నీ ఆవేదన తీరేదెలా తల్లీ?