Monday 30 January 2017

అంతరించిన ఆశాకిరణం.



అంతరించిన ఆశాకిరణం.
నీరవ ప్రకృతి నిదురలో జోగుతున్నవేళ 
నీవు నామదిలో రేపుతున్న అలజడి.
నిశ్శబ్ధనిశీధిలో నీ స్మృతులతో
నీరు నిండిన కనులతో నేనొక్కర్తినే
నీ రాకకై ఎదురు చూసి చూసి అలసితిని.
నీకేల నా మీద దయ రాదు ప్రియా?
నీ మదిలో నా తలపే మాసిపోయేనా?
నిన్ను ప్రేమతో నిజముగ పిలిచిన
నీవు వచ్చి నన్ను లాలింతువని భ్రమసితిని.
నా గొంతు తడారిపోయేలా సఖా! సఖా! అని
నిన్నే పిలిచి పిలిచి విసిగి వేసారితిని.
నీకేమో నా పిలుపందదు,
నాకేమో నీ పై ఆశ చావదు.
నీ రాకకై ఎదురు చూస్తూ ఎన్ని
నిద్రలేని రాత్రులో? ఎంత తీరని ఆవేదనో?
నీకోసం ఆర్తితో, తపనతో నిరీక్షిస్తూ,
నిస్పృహతో నిస్సారంబై నిలిచితిని.
- పొన్నాడ లక్ష్మి

Wednesday 18 January 2017

తిక్కన - పోతన





ప్రాచీన కవుల పద్యాలలొ సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గోచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా అలోచిస్తే పొతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రమూ కాదు. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వ కవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలను మెరుగులు దిద్దెవిగానూ ఉన్నాయి.
సంధి కార్యంకోసం రాయబారియై పాండవుల పంపున హస్తినాపురానికి విచ్చేసిన శ్రీకృష్ణుడిని పౌరకాంతలు సౌధాగ్రాలమీద నుంచి సందర్శించే సందర్భంలొ తిక్కనసొమయాజి ఈ పద్యం వ్రాసారు.
ప్రాణంబుతోఁ గూడ రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢ బాలుడితడె!
వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెచ్చించిన యా జగజ్జెట్టి యితడె!
దుర్వృత్తుఁడగు కంసుఁ దునిమి యాతని తండ్రిఁ బట్టంబు గట్టిన ప్రభువితండె!
సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గలకోర్కి దీర్చిన రసికుం డితండె!
వెన్నలను గోపికా చిత్తవృత్తములును, నరసి మృచ్చిల నేర్చిన హరి యితండె!
శృతి శిరోభాగములఁ దన సుభగచరణ సరసి, జామోదమును గూర్చు చతురుఁడీతఁడె
తిక్కనగారి ఈ సీసానికి సమానంగా పొతన్నగారు మరొక సీసపద్యం వ్రాసారు. కంసుని ఆహ్వానం అందుకొని మథురానగరానికి విజయం చేసిన శ్రీకృష్ణ్ణుని అక్కడి స్త్రీలు మేడలమీద నుంచి చూస్తున్న దృశ్యమిది.
వీఁడటే! రక్కసి విగతజీవగఁజన్నుఁ బాలు ద్రావిన మేటి బాలకుండు
వీఁడటే నందుని వెలఁదికి జగమెల్ల ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడటే మందలో వెన్నలు దొంగలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు
వీఁడటే! యలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు, వీని బొందని జన్మంబు విగత ఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము, వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు.
ఇరువురు మహాకవులు సీసాలూ రసోల్లితాలే. హస్తినాపుర కాంతలకు కనిపిస్తున్నవాడు ప్రౌఢ వయస్కుడైన శ్రీకృష్ణుడు. మధురానగర నారీమణులకు కనువిందు చేస్తున్నవాడు నవయౌవనంతో నవనవలాడే గొపాలకృష్ణుడు. అందువల్ల పోతన్నగారి పద్యం కొంచెం శృంగారం వైపు మొగ్గింది. తిక్కన గారి పద్యంలో అర్థగాంభీర్యం, భావవైవిధ్యం అతిశయంగా ఉన్నమాట వాస్తవం. అయితే పోతన్నగారి పద్యంలో పాదాల మొదట “వీఁడటే వీఁడటే” అన్న దీర్ఘాంత పదాలు పౌరకాంతల ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ, ఉత్కంఠనూ, ఉత్సాహాన్ని వెల్లడిస్తున్నాయి. మునివేళ్ళపై నిలిచి, చేతులు చాచి, వేలు పెట్టి చూపిస్తున్నట్లు ఈ పద్యం లోని ఎత్తుగడలు స్ఫురింపజేస్తున్నాయి. ఈ పద్యాన్ని తిక్కన గారు తిలకిస్తే “నీ పద్యం అభినయయోగ్యమై దర్శనకుతూహలాన్ని అతిశయింపజేస్తున్నది తమ్ముడూ” అంటూ పొతన్నను అభినందించి ఆలింగనం చేసుకుంటాడేమో!
పోతన భాగవతం..వ్యాఖ్యానం : కరుణ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.
సేకరణ : పొన్నాడ లక్ష్మి.

నన్నయ - పోతన


ప్రాచీన కవుల పద్యాలలో సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గొచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా ఆలొచిస్తే పోతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రం కాదు. అలా రాసినందువల్ల పోతన్న గారికి తనకంటే పూర్వకవుల మీద ఉండే పూజ్యభావమూ, ఆదరాభిమానాలూ అభివ్యక్తమవుతాయి. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వకవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలకు మెరుగులు దిద్దేవిగానూ ఉన్నాయి.
నన్నయ భట్టారుకులు ఆదిపర్వంలో మహాభారతాన్ని పారిజాతంతో పోలుస్తూ ఈ క్రింది పద్యం వ్రాసారు.
అమితాఖ్యానకశాఖలం బొలిచి, వేదార్థామలచ్చాయమై
సుమహావర్గ చతుష్కపుష్పవితతిన్ శోభిల్లి, కృష్ణార్జునో
త్తమ నానాగుణకీర్తనార్థ ఫలమై, ద్వైపాయనోద్యాన జా
త మహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై.
నన్నయగారి మీద గౌరవంతొ ఆయన భావాన్నే స్వీకరించి పొతన్న తన భాగవతాన్ని కల్పతరువుతో పోలుస్తూ అటువంటి మత్తేభాన్నే నడిపించాడు. చిత్తగించండి.
లలితస్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామమ్ము, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబు నై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
నన్నయగారి పారిజాతాన్ని, పొతనగారి కల్పవృక్షాన్నీ పోల్చి చూడండి. నన్నయగారి పద్యం లో రూపకాలంకారంతో కూడిన విశేషణాలు ఆరు ఉంటే పోతన్న గారి పద్యం లో పది విశేషణాలు ఉన్నాయి. నన్నయగారి అడుగుజాడల్లొ నడిచిన చక్కదనాల పద్యమిది. హృద్యానవద్యమైన ఈ పద్యం వంటి పద్యం ఆంధ్రసాహిత్యంలో మరొక్కటి లేదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పద్యాన్ని నన్నయ గారు వింటే “నా కంటె బాగా వ్రాశావోయి నాయనా!” అని పోతన్న గారి వీపు తట్టి ఆశీర్వదించి ఉండేవారు.
వ్యాఖ్యానం : కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి)