Sunday 27 September 2020

బాలు - కవిత



 


మా మరిది గారు చి.
Umamaheswar Rao Ponnada
అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పై రాసిన కవిత యధాతధంగా :
బాలు
---------
అయిదున్నర దశాబ్దాలు అలరించిన
ఓ గొంతు మూగబోయింది!
అఖండంగా కురుస్తున్న ఓ అమృతధార
హఠాత్తుగా ఆగిపోయింది!
వెన్నెల కరిగి సన్నగా అతని
గొంతులోంచి జారినట్లు ఉండేది.
సన్నజాజి అతని పెదవుల మీదనే
విరిసి పాటతో పరిమళించినట్లుండేది.
ఎవరైనా అనుకున్నామా?
నిశ్శబ్దంగా మొలిచిన ఓ లేత స్వరం
తేనెల జల్లులు కురిపిస్తుందని,
కోట్లాది మనసులని మురిపిస్తుందని,
భాషా హద్దులని చెరిపేస్తుందని!
ఎవరైనా ఊహించామా!
పాట అతని గొంతులో మరో గుండెగా వెలుస్తుందని,
పాటే అతనికి ఊపిరిగా నిలుస్తుందని!
మన ప్రతి ఉదయం అతని పాటతో పలకరిస్తుందని,
ప్రతి తెలుగు గుండె అతని పాటతో పులకరిస్తుందని!
ఏమైందో, ఏమో?
పై నుంచి ఎవరైనా చేతులు చాచి పిలిచారో?
ఈ బాలు ఇక మీకు చాలు అని తలచాడో?
హడావుడిగా తన పాటల మూటల్ని
భుజాన వేసుకొని మరొక కొత్త వేదికను
వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు!
ఇకపై
అక్కడ గంధర్వలోకంలో రోజూ
అతని గానకచేరీ కొనసాగుతూనే ఉంటుంది!
ఇక్కడ గాలి ఉన్నంత వరకు మనకోసం
అతని పాటను మోసుకొస్తూనే ఉంటుంది!
.........
రాతలు పొన్నాడ ఉమామహేశ్వర రావు
గీతలు: శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తి