Saturday 11 June 2016

పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము - అన్నమయ్య కీర్తన.

ఈవారం అన్నమయ్య కీర్తన.
ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
చ|| కినిసి వోడమింగెడి భూతము | పునుకవీపు పెద్దభూతము |
కనలి కవియు చీకటిభూతము | పొనుగు సోమపుమోము భూతము ||
చ|| చేటకాళ్ళ మించినభూతము | పోటుదారల పెద్దభూతము |
గాటపుజడల బింకపుభూతము | జూటరినల్లముసుగు భూతము ||
చ|| కెలసి బిత్తలేతిరిగేటి భూతము | పొలుపుదాంట్ల పెద్దభూతము |
బలుపు వేంకటగిరిపై భూతము | పులుగుమీది మహాభూతము ||
భావం: ఇది ఒక పెద్ద భూతము. భువిలో వారు, వీరు అన్న భేదభావం లేకుండా అందరినీ పట్టేసింది. కోపముతో పైబడి పెద్ద ఓడనే అమాన్తముగా మింగివేసే భూతమిది. వీపున ఈ పెనుభూతమునకు ఒక ఎముక చిప్ప కలదు. చీకటివలె నల్లనైన ఈ భూతము కోపముతో మీదపడే స్వభావము కలిగి యున్నది. విజ్రుమ్భించు విక్రమముతో నిండిన ముఖము కలభూతమిది.
ఈ భూతము వెడల్పయిన పెద్ద కాళ్ళతో అతిశయించి యున్నది. ఇది పెద్ద బీరముగల పోటుదారు. దట్టమైన జడలు కలిగి బింకముగల భూతం. ఈ మాయదారి భూతము నల్లని ముసుగు వేసుకున్నది.
ఈ భూతము దిస మొలతో అడ్డమాక తిరుగుచుండును. అవలీలగా ఇటునటు లంఘించు వడిగల భూతమిది. ఇది సమున్నతమైన వెంకటాచలముపై నుండును. ఈ భూతము పక్షిపై నుండును.
ఈకీర్తనలో అన్నమయ్య స్వామిని పెద్ద భూతముతో పోల్చి చెప్పాడు. ఎందుకంటే పరమాత్ముడు దుష్ట శిక్షణార్ధము పెద్ద భూతము చేసే వికృత చేష్టలు చేసాడు. పొడవుగా నల్లగా ఉండటం, ఓడలవంటి పెద్ద పెద్ద వస్తువులు మ్రింగుట, ఎముకచిప్పని వీపుమీద మోసుకోవడం, కోపముతో పై కొనుట, భయంకరమైన ముఖము, చేటలవంటి కాళ్ళు, బిరుసైన జడలు, నల్లనిముసుగు కలిగి యుండుట, దిస మొలతో సంచరించుట, వడివడిగా దాటిపోవుట, కొండలపై నుండుట, పక్షిపై సంచరించుట మున్నగునవన్నీ పెద్ద భూతముల స్వభావాలే అనుట లోక ప్రసిద్ధము. స్వామిని అన్నమయ్య ఏ విధంగానైనా పోల్చుకోగలడు. విమర్శించ గలడు.
వ్యాఖ్యానం. సాహిత్య శిరోమణి సముద్రాల లక్ష్మయ్య.
సేకరణ. పొన్నాడ లక్ష్మి.

Saturday 4 June 2016

గాన గంధర్వుడు బాలాసుబ్రమణ్యం

ఆ గళం ..గుడికట్టిన నుడి కారం (శ్రీబాలుగారిజన్మదినోత్సవంసందర్భంగా......'మధురవాణి' అంతర్జాలపత్రికసౌజన్యంతో)
-ఓలేటి శ్రీనివాసభాను
పాడటం ఓ కళ. అందులోనూ నేపథ్య గానం ప్రత్యేకమైన కళ.తెర మీది దృశ్యం, తెర వెనక గాత్రం - పాలూ తేనెల్లా కలిసిపోవాలి . వాటిని విడదీయలేని అనుభూతి ఆవిష్కృతం కావాలి . ఇంపుగా ఉండాలి . సొంపులు తిరిగి సోయగాలు పోవాలి . వీటన్నిటితోపాటు- స్పష్టత, స్వచ్ఛత గొంతులో గుడి కట్టాలి . ఇవన్నీ కొలువు తీరిన గొంతు శ్రీ బాలు గారిది . అందుకే యాభయ్యేళ్లుగా అది తెలుగు చలనచిత్ర గీతానికి పర్యాయపదమైపోయింది . పాటల చదువుకు పాఠ్యగ్రంథమైపోయింది . తరాల సంగీతాభిమానుల తరగని అభినందనల్ని అందుకుంటోంది.
**********************
'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న'లో "రావే కావ్యసుమబాలా .." అని తొలిసారిగా పల్లవించినప్పుడూ, 'ప్రైవేటు మాస్టారు'లో "పాడుకో పాడుకో .."అని పాడుతూ చదువుకోమని సందేశం ఇచ్చినప్పుడూ, అలాగే "మేడంటే మేడా కాదూ .." (సుఖ దుఃఖాలు),
, "రావమ్మా మహాలక్ష్మీ ..", "చుక్కలతో చెప్పాలని ..", చాలు లే నిదురపో .." (ఉండమ్మా బొట్టు పెడతా)లాంటి పాటలతో పూతరేకుల తీయదనాన్ని లేత గొంతులో పంచి ఇచ్చినప్పుడూ - తెలుగు చలన చిత్రాభిమానులు ఆనందించారు . "కొత్త గొంతు గమ్మత్తుగా ఉందే!" అని స్వాగతించారు . అ క్రమం లో "ఓ చిన్నదానా .."(నేనంటే నేనే) దూసుకొచ్చింది .హాల్లో చూసిన వారినీ, రేడియోలో విన్న వాళ్ళనీ ఒకే లాగ "ఓహో" అనిపించింది . నటుడు కృష్ణకి అచ్చంగాసరిపడే స్వరం వచ్చిందని జనం చెప్పుకొన్నారు .
నటుడైనా, గాయకుడైనా తమ లో వైవిధ్యాన్ని రుజువు చేసుకోవాలనుకుంటారు. హుషారు పాటలతో పాటు లలిత శాస్త్రీయ సంగీత ఛాయలున్న పాటల్ని కూడా పాడగలనని ఆ స్వరం నిరూపించుకునే దశలో బాలు గారికి 'శ్రీరామ కథ'లో సముద్రాల రాఘవాచార్యుల వారి చివరి గీతం -"రామ కథ.. శ్రీరామ కథ "ను రాగమాలిక లో పాడే అవకాశం వచ్చింది . గాత్రం లో వైవిధ్యాన్ని చూపించడానికి దోహదపడింది . అలాగే 'ప్రతీకారం; చిత్రం లో "నారీ రసమాదురీ..", 'ఆంధ్ర పుణ్యక్షేత్రాలు'(జానకి గారితో కలిసి పాడిన ప్రైవేటు ఆల్బం)లాంటివి కూడా ఆయన లోని గాయకుడు ఆశించే వైవిధ్య ప్రదర్శనకు ఊతమిచ్చాయి !
కానీ, అప్పటి చలన చిత్ర అవసరాల దృష్ట్యా అలాంటి అవకాశాల కోసం బాలుగారు మరికొంత కాలం నిరీక్షించాల్సి వచ్చిందేమో! అదృష్టం వల్ల అవకాశాలు వస్తాయోమో గానీ, వాటిని సద్వినియోగం చేసుకోడానికి కృషి, పట్టుదల,ప్రతిభ ముప్పేటలా తోడు కావాలి .ఆ మూడూ ఉన్న బాలూ గారి గొంతు ఎప్పటికప్పుడు సత్తాను నిరూపించుకుంటూనే, ఎదురైన పరీక్షల్లో విజయాన్ని ప్రథమ శ్రేణిలో సాధిస్తూనే వచ్చింది .
సంపూర్ణ నేపథ్యగాయకుడిగా ఎదిగే ప్రస్థానం లో ఆయనకు మరో ముఖ్యమైన సవాలు ఎదురయింది. అదే-"అగ్రనటులు ఎన్టీఆర్ , ఏయన్నార్ లకు బాలుగారి గొంతు సరిపోతుందా?"అన్న మీమాంస! అప్పటికి ఎన్టీఆర్ కి ఆయన "పట్టాలి అరక దున్నాలి మెరక .."(చిట్టి చెల్లెలు), "నిద్దురపోరా స్వామీ.."(కోడలు దిద్దిన కాపురం), అలాగే ఏయన్నార్ కి "నాహృదయపు కోవెల లో .." (ఇద్దరు అమ్మాయిలు) లాంటివి పాడారు. కానీ మీమాంస తీరడానికి మరికొంత సమయం పట్టింది . ఆ లోగా వైవిధ్యం, సంకల్పం, పట్టుదల, తపన, రాజీపడని తత్త్వం,ఒడిసిపట్టి ఒదిగిపోయే నైపుణ్యం- ఈ ఏడు లక్షణాలూ సప్తస్వరాలై బాలుగారి గొంతులో స్థిరపడిపోయాయి . ఫలితం ఏమిటో అగ్రనాయకులకు ఆయన పాడిన పాటలే చెప్పాయి . 'దానవీరశూర కర్ణ' వచ్చింది. దుర్యోధనుడిపాత్ర లో ఎన్టీఆర్ కి యుగళగీతం -"చిత్రం ..భళారే విచిత్రం" ఒక ఊపు ఊపింది ..సరి కొత్త పోకడ సృష్టించింది . 'ఆలుమగలు ' వచ్చింది . "ఎరక్కపోయి వచ్చాను .." పాట అక్కినేని హావభావాలకు అచ్చమైన శబ్దరూపాన్నిచింది . ఇద్దరు అగ్రనటుల గొంతుల్లోనూ , కవళికల్లోనూ వ్యక్తమయే విభిన్నత్వానికి నూరుపాళ్ళ న్యాయం చెయ్యడానికి బాలుగారిలో ధ్వన్యనుకరణ నైపుణ్యం అక్కరకు వచ్చింది . ఆ ఆతర్వాత -'అడవిరాముడు', 'ప్రేమాభిషేకం'లాంటివి చారిత్రిక అధ్యాయాలు ! చలనచిత్రానికి అవసరమైన మోతాదులో శాస్త్రీయ సంగీత ఛాయల్ని మేళవించి, ఓ సినిమా ఆద్యంతాల వరకు న్యాయం చేకూర్చడం ఆ తర్వాతి చరిత్ర! అది 'శంకరాభారం'తో సాకారమయింది . బాలు గారికి జాతీయ పురస్కారాన్ని అందించింది .
యాభయ్యేళ్ళ ఈ సుదీర్ఘ ప్రస్థానం లో బాలుగారి ప్రతిభ కేవలం తెలుగు పాటలకే పరిమితం కాకపోవడం మరో ప్రత్యేకత . తమిళ, కన్నడ చలనచిత్రాభిమానులు "బాలూ తమ వాడే " అని ప్రేమించి, అభిమానించేలాగా ఆయా భాషల్లో పాటలకు న్యాయం చేశారాయన . అంతేకాదు చిరుతెర మీద తన అనర్గళమైన వ్యాఖ్యాన ప్రతిభతో పొరుగు రాష్ట్రాల వారిప్రశంసలు కూడా అందుకుంటున్నారు . అలాగే తన హిందీ పాటలతో ఉత్తరాది మెప్పును , హిందీ పాటకు జాతీయ పురస్కారాన్నీ పొందారాయన!
మాతృభాష లో కావచ్చు, మరో భాష లో కావచ్చు ..బాలుగారి విజయ రహస్యం - భాషల పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం! ఉచ్చారణ లో స్పస్టత కోసం, సహజమైన పలుకుబడి లో నిబిడీకృతమైన అందాల్ని అందించడం కోసం, తన పాట వింటున్న ప్రతీ వ్యక్తినీ -"ఈయన నా భాషను నాలాగే పలుకుతున్నారు"అని ఒప్పించి, మెప్పించి ,తనతో పాటు తీసుకువెళ్ళడం కోసం, బాలు గారు పడే తపన, రాజీ లేని కృషి, నిరంతర అధ్యయనం, ఇలా ఎన్నో ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి .వివిధ వేదికల మీద నుంచి, మాధ్యమాల నుంచి ఔత్సాహిక గాయనీ,గాయకులకు ఆయనిచ్చే సూచనల్లో,సలహాల్లో ఇవన్నీ అంతర్లీనంగా ఉంటాయి . అందుకే బాలుగారు ఏ భాషలో పాడినా ఆ నుడికారానికి అది రాక్షణ కవచం లాగా నిలిచిపోతుంది

దైవమోక్కడే సంతత భజనీయుడు - అన్నమయ్య కీర్తన.


Ponnada Lakshmi
Write a comment...
ప. దైవమోక్కడే సంతత భజనీయుడు
భావము సమబుద్ధి బాయగ దగదు
౧. హరియే సకలాంత రాత్మకుం డటుగాన
తిరమై యోకరి నిందింప దగదు,
అరయగ లోకము లనిత్య మటుగాన
మరగి కొందరిమీది మమతయు వలదు.

౨. బహు కల్పితములెల్ల బ్రకృతి మూలమె కాన
గహనపు దన ఉద్యోగమూ వలదు.
సహజ విహారుడు సర్వేశ్వరుడు గాన
వహి దానె వచ్చినవి వలదన దగదు
౩. తపములు జపములు దాస్యమూలమె కాన
ఉపమల సందేహ మొగి వలదు
ఎపుడును శ్రీ వేంకటేశ్వరు సేవించి
చపలచిత్తము వారి సంగ మిక వలదు.
భావము: ఎల్లవేళల జీవులు కారాధింపదగినవాడు భగవంతుడొక్కడే. పరమాత్ముడు సర్వత్ర సమముగా వ్యాపించి యున్నాడు గాన భగవంతుని పూజించిన వారెన్నడును సమద్రుష్టిని వీడరాదు.
సమస్తజీవులను అంతరాత్ముడైనవాడు శ్రీహరియే. కావున ఒకరిపై ద్వేషము బూని నిందించుట ఎంతమాత్రము తగదు. ఈ లోకములన్నియు అశాశ్వతము లైనవే. ఎవ్వరును మానల నంటి పెట్టుకుని కలకాలము ఉండబోరు. కావున కొందరిపై మమకారము కూడ ఉచితము కాదు.
ఈ ప్రకృతి నుండియే చిత్రవిచిత్రములైన అనేక కల్పనలు ఏర్పడుచున్నవి, కాని కష్టపడి జీవులు తమకు తాముగా ప్రయత్నించి సాధించునదేమియు లేదు. అందుచే అట్టి ప్రయత్నం చేయవలదు. అంతటికి మూలమైన పరమాత్ముడు సహజ విహారుడు కావున ఆ దేవుని సంకల్పముచే తమకు తాముగా వచ్చినవాటిని వలదనుట తగదు.
మోక్షప్రాప్తికై చేయు తపములు, జపములు మున్నగున వన్నియు భగవంతుని దాస్యమూలములే కాని అన్యములు కావు. కావున ఆయా సాధనలకు భగవంతుడిచ్చిన వానిపట్ల సంశయము కలిగి యుండరాదు. సర్వదా శ్రీ వేంకటేశ్వరునే సేవించు వారికి చపలచిత్తులై దైవమును భజించని మూర్ఖులతో నెట్టి సంబంధము పనికిరాద

ఇన్నాళ్ళు నెరగము నిటువంటివి అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.
ప. ఇన్నాళ్ళు నెరఁగము నిటువంటివి
సన్న నిట్టె జరుగునో సారె మీ ఇద్దరికి !!
౧. పొలసి పొలసి ఏమి పోదిగినీ యాపె నిన్ను
పిలిపించితివో నీవు ప్రియము తోడ
మొలక నవ్వులతో నీ మొగము దప్పక చూచి
కలవో వొడఁబాట్లు కడు మీ ఇద్దరికీ !!
౨. చేరి చేరి ఊడిగాలు సేయగఁవచ్చీ నీకు
కారణమేమైనా గద్దో కాఁగిటికి
నేరుపుతో సలిగలు నెరపీ నీ ముందరను
ఈ రీతి వేడుకాయనో యిట్టె మీ ఇద్దరికీ !!
౩. పెనఁగి పెనఁగి యాపే బెరసి నవ్వీ నీతో
చనవు నీవొసంగిన ఛందమో యిది
యెనసితి శ్రీవేంకటేశ యింతలో నన్ను
మనసు లొక్కటాయనో మరి మీ ఇద్దరికీ !!

భావమాధుర్యం:
స్వామీ ! నీవు శ్రీదేవి సొత్తువని నాకు తెలియును. మీఇద్దరికీ కూడా మధ్య మధ్య ఇటువంటివి జరుగుతాయా?
అతిశయముతో ఆమె ఏమి బెట్టు చేస్తున్నది. తప్పేమున్నది? నీవే ఆమెను పిలువనంపితివి. మొలక
నవ్వులతో ఆమె నిన్ను చూచిందంటే ఇక మీఇద్దరికీ ఒడంబడికలు తప్పవు.
ప్రభూ! ఆమె నీకు చేరికయై సేవలు చేయగల నేర్పరి. సేవాకార్యక్రమంలో ఈ కౌగలింతల వ్యవహారం ఏమిటి? ఆమె నీ ముందరే తన నేర్పరితనంతో అతి చనువు ప్రదర్శిస్తుంది. మీ ఇద్దరికీ ఇటువంటి చిలిపి పనులు వేడుక ఏమో మరి!
ప్రభూ! ఆమె నీకు చేరికయై పెనవేసి మనోహరంగా నవ్వుతున్నది. ఇదంతా నీవిచ్చిన చనువే కదయ్యా! మీ సంగతి ఇట్లుండగానే ఓ వేంకటేశ్వరా! నన్నూ (అన్నమయ్యను) దరి చేరితివి. మన మనస్సులు ఒకటైనవి. మరిమీ ఇద్దరికీ లోటే లేదాయెను. ఆమె నీ హృదయనివాసిని కద