Saturday 11 January 2020

ఏఁటిఁకిఁ దలఁకెద రిందరును గాఁటపు సిరులివి కానరో ప్రజలు !!




భావము :శ్రీహరి స్మరణ అన్ని సిరిసంపదలకు మించిది.


ఏఁటిఁకిఁ దలఁకెద రిందరును
గాఁటపు సిరులివి కానరో ప్రజలు !!

ఎండలో బొంలక యేచిన చలిలో
నుండక చరిలో నుడుకక
అండనున్న హరి నాత్మఁ దలఁచిన
పండిన పసిఁడే బ్రతుకురొ ప్రజలు
||ఏటి||

అడవుల నలయక ఆకుపలముఁ దిని
కడుపులు గాలఁగఁ గరఁగక
బడిబడి లక్ష్మీపతికి దాసులై
పొడవగు పదవుల బొందరొ ప్రజలు

||ఏటి||
పొక్కేటికాళ్ళ పుండ్లు రేఁగఁగ
దిక్కుల నంతటఁ దిరుగక
గక్కన తిరువేంకటగిరిపతిఁ గని
వొక్కమనసుతో నుండరో ప్రజలు

||ఏటి||


ఎందుకు జనులందరు ఈ అశాశ్వతమైన సిరిసంపదలు వెనుక పడతారో తెలియదు.

శాశ్వతమైన శ్రీవేంకటేశ్వరుని భక్తి చెంతనుండగా చాలును.
ఎండలో వేడి భరించక్కరలేదు, చలిలో వణకక్కరలేదు, మంటల్లో ఉడుకక్కరలేదు అండగా వున్న శ్రీహరిని అంతరాత్మ లో తలచుకుని వుంటే. ఇదే పండించే పచ్చని పసిడి బంగారం. ప్రజలారా! తెలుసుకుని చక్కగా బ్రతుకులు సాగించండి.

అడవుల్లో ఉండక్కరలేదు. ఆకులు, అలములు తిని కడుపులో ఆకలి చంపుకుని, తిన్నది అరగక కుండా వుండక్కరలేదు. లక్ష్మిదేవి పతి అయిన నారాయణునికి నిరంతరం దాసులై వుండండి చాలును. ఓ ప్రజలారా! అప్పుడు మీరు గొప్ప గొప్ఫ పదవులు, పుణ్యాలు ఇహపరాలు రెండింటిలోను పొందవచ్చును.

మీరు దేవుళ్ళను, దేవాలయాలు దర్శించ డానికి దేశము నాలుగు దిక్కుల తిరిగి తిరిగి, పాదాలు పై పుండ్లు వచ్చేటట్లు, పొంగిపోయేటట్టు తిరగక్కరలేదు. ఓ ప్రజలారా! మీరు ఒక్క మనస్సు తో చక్కున తిరు వేంకటగిరిపతి అయిన శ్రీవేంకటేశ్వరుని చూసి భక్తి తో పూజించిన చాలు. పుణ్యాలు, స్వర్గాలు, ముక్తి అన్నీ వాటంతటవే లభిస్తాయి.