Friday 21 December 2018

పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా! - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
అన్నమయ్య ఈ కీర్తనలో నాలుక పవిత్రం కావాలంటే ఉబుసుపోని పలుకులు, వాళ్ళ మీద వీళ్ళమీద చెప్పుకునే చాడీలు వద్దు అంటున్నాడు. శ్రీవేంకటేశ్వరుని బహువిధాల కీర్తించినప్పుడు మాత్రమే మనిషి జిహ్వ పవిత్రమౌతుంది అంటున్నాడు.
కీర్తన:
పల్లవి: పావనము గావో జిహ్వ బ్రదుకవో జీవుఁడా!
వేవేల కితని నింక వేమాఱునుం బాడి ||పల్లవి||
చ.1.హరినామములే పాడి అతనిపట్టపురాణి
ఇరవై మించినయట్టియిందిరం బాడి!
సరస నిలువంకలాను శంఖచక్రములఁ బాడి!
వరదకటిహస్తాలు వరుసతోఁ బాడి ||పావ||
చ.2.ఆదిపురుషునిఁ బాడి అట్టే భూమిసతిఁ బాడి
పాదములఁ బాడి నాభిపద్మముఁ బాడి
మోదపుబ్రహ్మాండాలు మోచే వుదరముఁ బాడి
ఆదరానఁ గంబు కంఠ మంకెతోఁ బాడి ||పావ||
చ.3.శ్రీవెంకటేశుఁ బాడి శిరసుతులసిం బాడి
శ్రీవత్సము తోడురముఁ జెలఁగి పాడి
లావుల మకరకుండలాలకర్ణములు పాడి!
ఆవటించి యితనిసర్వాంగములుఁబాడి ||పావ||
“ఓ జీవుడా! నీ జిహ్వతో శ్రీనివాసుని వేవేల కీర్తించి పావనం కారాదా! నీ నాలుకను పావనం చేసుకోరాదా! అని విన్నవిస్తున్నాడు.
ఓ జిహ్వా! నిరంతరం శ్రీహరి నామాలను కీర్తించు. ఆయన పట్టపురాణి యైన ఇందిరను కీర్తించు. ఆ శ్రీహరి శంఖు చక్రాలను కీర్తించు. ఆయన కటిప్రదేశములో నున్న వరద హస్తాన్ని కీర్తించు. ఆవిధంగా కీర్తించి తరించమని మోక్షప్రాప్తిని పొందమని అన్నమయ్య ఉద్బోధ.
ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువును ప్రార్ధిద్దాం. శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీదేవి ఆయన పాదములను ఒత్తుతుండగా చూచి తరించి కీర్తిద్దాం. పదునాలుగు భువనభాండమ్ములను ఆనందంతో మోస్తున్న ఆదిదేవుని కీర్తిద్దాం. ఆదరంగా శంఖంవంటి కంఠముగల శ్రీనివాసుని చేరి కీర్తిద్దాం.
శ్రీవేంకటేశ్వరుని మనసారా త్రికరణ శుద్ధితో కీర్తిద్దాం. ఆయన శిరసుపై ఉన్న తులసిమాలను కీర్తిద్దాం. విజృంభించి ఆయన వక్షస్థలంపై గల శ్రీవత్సము అనే పేరుగల పుట్టుమచ్చను కీర్తిద్దాం. ఆదేవదేవుని మకరకుండలములను గాంచి కీర్తించి తరిద్దాం. పొందికగా శోభించే ఆయన సర్వాంగాలను కీతించి తరిద్దాం రండి అని ప్రబోధిస్తున్నాడు అన్నమయ్య.
విశ్లేషణ : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య

No comments:

Post a Comment