Sunday 14 January 2018

అలుగకువమ్మ నీ వాతనితో నెన్నండును - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన.

అలుగకువమ్మ నీ వాతనితో నెన్నండును
పలువేడుకలతోనె పాయకుండురమ్మా !!

 జలధిఁ దపము సేసె సాధించెఁ బాతాళము
నెలఁత నీ రమణుఁడు నీకుఁగానె
ఇలవెల్లా హారీంచె నెనసెఁ గొండగుహల
యెలమి నిన్నిటాను నీకితవుగానె. !!

బాలబొమ్మచారై యుండె, పగలెల్లా సాధించె
నీ  లీలలు దలఁచి   నీకుఁగానె
తాలిమి వ్రతమువట్టి ధర్మముతోఁ గూ డుండె
పాలించి నీవు చెప్పిన పనికిఁగానె !!

యెగ్గు సిగ్గుఁ జూడఁడాయె యెక్కెను శిలాతలము
నిగ్గుల నన్నిటా మించి నీకుఁగానె
అగ్గలపు శ్రీవెంకటాద్రీశుఁడై నిలిచె
వొగ్గి నిన్నురాన మోచివుండుటకుఁ గానె. !!

ఇది దశావతార వివరణ కీర్తన అని పోల్చుకోగలిగినవారు నిజంగా అన్నమయ్య కీర్తనలలో ప్రావీణ్యం ఉన్నవారేనని అంగీకరించవచ్చు. జాగ్రత్తగా పరిశీలించండి.
ఓ! దేవీ! నీకోసం స్వామి ఎన్ని పాట్లు పడ్డాడమ్మా! కావున నీవెన్నడూ అతనిపై అలగవద్దు. ఎన్నో వేడుకలతో అతన్ని ఎన్నడూ ఎడబాయక  ఉండాలి. అప్పుడే  మాబోటి వారికి ఆనందం.
నీ విభుడు జలధిని తపింపజేసాడు(మత్స్యావతారము), పాతాళమును సాధించి మంథరపర్వతాన్ని నిలిపాడు(కూర్మావతారము). భూమిని కైవశము చేసికొన్నాడు (వరహావతారము). కొండగుహలలో నిలిచాడు(నరసింహావతారము). ఇన్నింటిలోనూ నీకు హితమునే ఒనరించినాడు. నీ రమణుడు నీకుగానే సహకరించాడు.
బాలబ్రహ్మచారిగా అవతరించి బలిని రసాతలం పంపి భూమిని రక్షించాడు.(వామనావతారం). దుర్మార్గులైన క్షత్రుయులపై పగసాధించాడు (పరశురామావతారం). వీటిలోకూడా పుడమిరూపంలో ఉన్న నీ కొరకే శ్రమించాడు. ధర్మపరిరక్షణే ధ్యేయంగా, వ్రతముగాచేపట్టాడు(శ్రీ రామావతారం). నీవు చెప్పిన పని కోసమే ఆమె నీ ఆజ్ఞను పాలించింది. (శ్రీకృష్ణావతారం)
ఓ దేవీ! ఇతగాడు సిగ్గుయెగ్గులు పాటించడాయె (బుధ్ధావతారం) శిలాతలము అనగా 'రికాబు' ను ఎక్కినాడు. (కల్కి అవతారము) దుస్సహమైన శ్రీవేంకటేశ్వరుడై నిలిచినాడు. మరి ఈ అవతారం దేనికో తెలుసా తల్లీ! నిన్ను తన ఉరమున మోయుటకే సుమా!
(వ్యాఖ్యానం. అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)

No comments:

Post a Comment