Friday 13 May 2016

ఎన్ని వేదాలు చదివిన యెంత సోమయాజులైన - అన్నమయ్య కీర్తన.






ఈ వారం అన్నమయ్యకీర్తన.
ప. ఎన్ని వేదాలు చదివి యెంత సోమయాజివైన
     కన్నెలు వద్దనుండగా కాంక్షలేల తీరును.                   ||
౧.   కొరకుండేవా నీవు గొల్లెతలఁ గనుఁగొంటే
      పారదా మనసు వారి పాలిండ్లపై
      ఊరదా నీ నోరు తేనెలొలికే మోవి పండ్లకు
      పేరదా వలపు వారి బెల్లింపు మాటలకు                    ||
౨.   చిక్కవా వారికి నీవు చేతులు పైఁ జాఁచితేను
      చొక్కకుండేవా మేనులు సోఁకించితేను
      చక్కనుండేవా వారు సరసము లాడితేను
      పక్కన రేగఁడా తమి భావించి నవ్వితేను                   ||
౩.    పాయగాలవా సతులు భ్రమియించి కూడితేను
      అయినా తనివి నీకు నంతలోననే
      యేయడ శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నేఁడు
      మాయలకు లోను గాదా మంతనమాడితేను     || 

భావ మాధుర్యం :
          అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీకృష్ణుని శృంగారాన్ని సమర్ధిస్తున్నారు. ఎన్ని వేదాలు చదివినా, ఎంత సోమయాజివైనా కన్నెపిల్లల సాంగత్యం ఉంటె కోరికలు రేగక తగ్గుతాయా అంటున్నారు.
          గొల్లెతలు కావాలని నీ వద్దకు చేరితే వారి పాలిండ్లపై నీ దృష్టి పడి నీ మనసు చలించదా? తేనెలొలికే వారి పెదవులను చూస్తె నీ నోరు ఊరదా? మైమరపించు వారి మాటలకు వారిపై నీకు వలపు కలుగదా?
          వారు ప్రేమతో చేతులు చాచితే వారికౌగిట్లోకి చేరవా? వారు సరసములాడుతూ చక్కగా నవ్వితే నీకు మోహము కలుగదా?
          వాళ్ళు కలిగించే భ్రమలకి లొంగక వదలి ఉండగలవా? అయినా నీ తనివి తీరుతుందా? నేడు శ్రీ వేంకటేశ్వరా! నీవు నన్నుయేలితివి. నీ మాయలకు లోనై నేనూ నీతో మంతనాలాడేను.

No comments:

Post a Comment