Wednesday 13 April 2016

ముందే తొలగవలె – మోసపోక సంగ మెల్ల -- అన్నమయ్య కీర్తన.

ప. ముందే తొలగవలె – మోసపోక సంగ మెల్ల
కందువబోయిన నీళ్ళు – కట్టగట్ట వచ్చునా ?
౧. అనలము బోడగంటే – నండనున్న మిడుతలు
పనిలేకున్నా నందు – బడకుండీనా ?
పొనిగి చెలులగంటే – పురుషుల చూపు లెల్లా
ననిశము నందు మీద – నంటబారకుండునా ?
౨. గాలపుటెర్రల గంటే – కమ్మి నీటిలో మీలు
జాల నా పసలజిక్కి – చావకుండీనా ?
ఆలరి బంగారుగంటే – నందరి మనసులూను
పోలిమి నాపస జిక్కి – పుంగుడు గాకుండు నా ?
౩. చేరిముత్యపు జిప్పల చినుకులు నినిచితే
మేర తేట ముత్యములై – మించ కుండీనా ?
ధారుణి శ్రీ వేంకటేశు – దాసుల సంగతి నుంటే
పోరచి నేజీవులైన – బుణ్యులు గాకుందురా ?
భావము: ముముక్షువులైన వారు మోసమునకు గురికాక జాగరూకలై ముందే విషయసుఖముల తోడి సంగమును తోలగవలెను. నీళ్ళు పోయిన తరువాత కట్టగట్టి లాభమేమి?
నిప్పును గన్నచో చెంతనున్న మిడుతలు పనిలేకున్నాను అందున పడుకుండ ఉండలేవు. అట్లే కాంతల గన్న పురుషుల చూపు లెల్ల వేళల వారిపై ప్రసరంపకుండ ఉండలేవు.
గాలములకు తగిల్చిన ఎర్రాలను గాంచినచో నీటిలోన చేపలు వాటిపై మూగి ఆ రుచికి జిక్కి వేదనతో చావకుండా పోవు. అట్లే వలపించి చిక్కులబెట్టు పాడు బంగారును గన్నచో ఎల్లవారి చిత్తములును దాని మిసమిసలకు వాసమై దిగజారి పోకుండా నుండజాలవు.
ముత్యపుచిప్పలలో చినుకులు నిమ్పినచో అవి తేటముత్తెములై ప్రకాశింపక మానవు. అట్లే శ్రీ వేంకటేశ్వరుని దాసులతోడి సాగత్యము గలిగియున్నచో ఎట్టివారైనను ఘనతతో పుణ్యాత్ములు కాకపోరు.
కాన విజ్ఞులైనవారు ముందే మెలుకువ గల్గి భోగావస్తువులతోడి సంగమును తొలగించుకోనవలెనని ఈ సంకీర్తనలో అన్నమయ్య బోధించాడు.

No comments:

Post a Comment