Tuesday, 12 January 2021

వచ్చిందమ్మా వచ్చిందమ్మా సంక్రాంతి

 





వచ్చిందమ్మా వచ్చిందమ్మా సంక్రాంతి

పల్లెలలో, పట్టణాలలో అంబారన్నంటే సంబరాలతో
ఆడుతూ పాడుతూ వచ్చిందమ్మా సంక్రాంతి
పల్లె గృహాల ముంగిట్లో తీర్చిదిద్దిన రంగవల్లులతో
బంతిపూల మధ్య గొబ్బెమ్మలతో వచ్చిందమ్మా సంక్రాంతి.
అందమైన గడపలు పసుపు, బొట్టుని అలంకరించుకుని
మామిడి తోరణాల సువాసనతో పులకరిస్తూ వచ్చింది సంక్రాంతి.
హరిదాసుల మేలుకొలుపులతో, డూడూ బసవన్నల విన్యాసాలతో
నింగికెగసే భోగిమంటలతో వచ్చిందమ్మా సంక్రాంతి.
అరిసెల ఘుమఘుమలతో, పూతరేకుల నేతి వాసనలను
అస్వాదిస్తూ అరుదెంచింది సంక్రాంతి.
కొత్త పంట చేతికంది సంతోషంతో రైతన్నలో కలిగిన
ఆనందానుభూతితో కలిసి వచ్చింది సంక్రాంతి.
కోడి పందాలు, కర్ర సాములు గారడీ విద్యలతో
పల్లె ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ వచ్చింది సంక్రాంతి.
పట్టణాలలో అంతస్తుల భవన సంస్కృతిలో ఉన్నా,
అక్కడికీ వచ్చింది సంక్రాంతి సంబరం.
ఇల్లిల్లు శుభ్రపడి, చెత్తా చెదారం భోగిమంటకి ఆహుతి చేసి,
నాగరికత పలకరింపులతో, శుభాకాంక్షలతో వచ్చింది సంక్రాంతి.
గుమ్మాలకి బంతిపూల తోరణాలతో, కళాత్మకంగా అలంకరించుకున్
శొభాయమానంగా ఇంటింటికీ వచ్చింది సంక్రాంతి.
కొత్త కొత్త పిండివంటలు చేసుకుని ఇరుగుపొరుగులకు
పంపకాలతో వచ్చింది సంక్రాంతి.
పేకాట, హౌసీ, అంతాక్షరి వంటి ఆటలతో
అందరికీ అహ్లాదం కలిగిస్తూ వచ్చింది సంక్రాంతి.
.. పొన్నాడ లక్ష్మి

మధుర జ్ఞాపకం

 మధుర జ్ఞాపకం

అవి భువనేశ్వర్ లో మేమున్న రోజులు. తెలుగు సినిమాలు ఉండేవి కావు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఒక షో తెలుగు సినిమా వేసేవారు. దానికోసం తాపత్రయంపడి ఎండలో వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరు తెలుగువారందరూ కలుస్తారాని ఓ సరదా. ఓసారి అలాగే ఓ ఆదివారం నాడు తెలుగు సినిమాకి వెళ్ళాం. సినిమా అయ్యాక తెలుగు మిత్రులందరితో మాట్లాడి బైక్ మీద ఇంటికి చేరాం. ఇంటికొచ్చి చూసుకుంటే నా చేతి వాచీ లేదు. హాల్లోనో పడిపోయిందో, బైక్ మీద వస్తుంటే దార్లోనే పడిపోయిందో తెలియలేదు. నాకు రిస్టు వాచీ అంటే చాలా ఇష్టం. పాత వాచీ పాడైపోతే మా శ్రీవారు కొత్త వాచీ బహుకరించారు. ఆ వాచీ పోగొట్టుకున్నందుకు చాలా బాధనిపించింది. ఆ రోజు సాయంత్రం ఎదురింట్లో ఉన్న ప్రకాశరావు గారింటికి (ప్రకాశరావు గారు AG office లో Accounts Officer గా పనిచేసేవారు) వెళ్ళి మాటల్లో వాళ్ల అమ్మాయిలతో ఈ విషయం చెప్పాను. మర్నాడు ప్రకాశరావు గారు అఫీసునుండి వస్తూ ‘లక్ష్మీ నీ వాచీ ఎక్కడుందో తెలిసిపోయింది’ అని సంతోషంగా చెప్పారు. మాకేమీ అర్ధం కాలేదు. 12 గం.ల తెలుగు సినిమా షో అయిన తర్వాత, matinee show హిందీ సినిమాకి వచ్చిన ఒక ఒడియా విద్యార్ధి కి తన సీట్లో నా వాచీ కనిపించిందిట. ముందు షో తెలుగు సినిమా అయింది కాబట్టి ఆ వాచీ ఎవరో తెలుగువారిదే అయ్యుంటుందని గ్రహించి అధిక తెలుగువారు పని చేస్తున్న AG office notice board లో వాచీ తనకు దొరికినట్లు, పోగొట్టుకున్నవారు వచ్చి తీసుకోవలసిందిగా తన చిరునామా ఇచ్చి తెలియజేసాడు. ప్రకాశరావు గారు ఆ చిరునామా నాకిచ్చారు. మర్నాడు మా శ్రీవారు అతని ఇంటికి వెళ్ళి విషయం చెప్పారు. ఆ అబ్బాయి ఎన్నొ వివరాలు అడిగి, వాచీ మాదేనని నిర్ధారించుకుని మాకు ఆ వాచీ అందజేశాడు.
అతని సమయస్ఫూర్తి, నిజాయితీ మమ్మల్ని అబ్బురపరచింది. ఆ తర్వాత అతను మంచి స్నేహితుడయ్యాడు. ఈ సంఘటన నేనెప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకం !!
- పొన్నాడ లక్ష్మిమధుర జ్ఞాపకం
అవి భువనేశ్వర్ లో మేమున్న రోజులు. తెలుగు సినిమాలు ఉండేవి కావు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ఒక షో తెలుగు సినిమా వేసేవారు. దానికోసం తాపత్రయంపడి ఎండలో వెళ్ళేవాళ్ళం. అక్కడ అందరు తెలుగువారందరూ కలుస్తారాని ఓ సరదా. ఓసారి అలాగే ఓ ఆదివారం నాడు తెలుగు సినిమాకి వెళ్ళాం. సినిమా అయ్యాక తెలుగు మిత్రులందరితో మాట్లాడి బైక్ మీద ఇంటికి చేరాం. ఇంటికొచ్చి చూసుకుంటే నా చేతి వాచీ లేదు. హాల్లోనో పడిపోయిందో, బైక్ మీద వస్తుంటే దార్లోనే పడిపోయిందో తెలియలేదు. నాకు రిస్టు వాచీ అంటే చాలా ఇష్టం. పాత వాచీ పాడైపోతే మా శ్రీవారు కొత్త వాచీ బహుకరించారు. ఆ వాచీ పోగొట్టుకున్నందుకు చాలా బాధనిపించింది. ఆ రోజు సాయంత్రం ఎదురింట్లో ఉన్న ప్రకాశరావు గారింటికి (ప్రకాశరావు గారు AG office లో Accounts Officer గా పనిచేసేవారు) వెళ్ళి మాటల్లో వాళ్ల అమ్మాయిలతో ఈ విషయం చెప్పాను. మర్నాడు ప్రకాశరావు గారు అఫీసునుండి వస్తూ ‘లక్ష్మీ నీ వాచీ ఎక్కడుందో తెలిసిపోయింది’ అని సంతోషంగా చెప్పారు. మాకేమీ అర్ధం కాలేదు. 12 గం.ల తెలుగు సినిమా షో అయిన తర్వాత, matinee show హిందీ సినిమాకి వచ్చిన ఒక ఒడియా విద్యార్ధి కి తన సీట్లో నా వాచీ కనిపించిందిట. ముందు షో తెలుగు సినిమా అయింది కాబట్టి ఆ వాచీ ఎవరో తెలుగువారిదే అయ్యుంటుందని గ్రహించి అధిక తెలుగువారు పని చేస్తున్న AG office notice board లో వాచీ తనకు దొరికినట్లు, పోగొట్టుకున్నవారు వచ్చి తీసుకోవలసిందిగా తన చిరునామా ఇచ్చి తెలియజేసాడు. ప్రకాశరావు గారు ఆ చిరునామా నాకిచ్చారు. మర్నాడు మా శ్రీవారు అతని ఇంటికి వెళ్ళి విషయం చెప్పారు. ఆ అబ్బాయి ఎన్నొ వివరాలు అడిగి, వాచీ మాదేనని నిర్ధారించుకుని మాకు ఆ వాచీ అందజేశాడు.
అతని సమయస్ఫూర్తి, నిజాయితీ మమ్మల్ని అబ్బురపరచింది. ఆ తర్వాత అతను మంచి స్నేహితుడయ్యాడు. ఈ సంఘటన నేనెప్పటికీ మరచిపోలేని మధుర జ్ఞాపకం !!
- పొన్నాడ లక్ష్మి

Saturday, 7 November 2020

తల్లి బాధ్యత.

 ఆకలి తెలిసీ అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేదీ, అనువుగా మందలించేదీ, ఆదర్శంతో తీర్చి దిద్దేదీ తల్లి. అని మహాభారతంలో ఒక విశ్లేషణ,

అయితే ఈతరం తల్లులు మొదటి మాటను మాత్రమే ఆచరిస్తున్నారు. వారు అడిగినవన్నీ కొనిపెట్టడం, అల్లారుముద్దుగా, కష్టం తెలియకుండా పెంచడం చాలా మంది ఇళ్ళల్లో చూస్తున్నాము. నిజానికి అమ్మ ఆదిగురువు అంటారు, మంచి చెడ్డలు, మర్యాదలు, మన సంస్కృతి అన్నీ చెప్పవలసింది అమ్మే. పెద్దలు కనిపిస్తే నమస్కరించడం ఇంటికి వచ్చినవారిని ఆత్మీయంగా పలకరించడం, సమయపాలన ఇలాంటి విషయాలు అతి మామూలుగా పిల్లలికి మాటల మధ్యలో చెప్పొచ్చు. అన్నీ పెద్దయితే వాళ్ళే తెలుసుకుంటారు అని అంటూఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం?. కొంతవరకు తల్లితండ్రుల భాద్యత లేదా? జన్మతః కొందరికి ఎవరూ ఏమీ చెప్పకుండానే మ్ంచి అలవాట్లు అలవడతాయి. కొంతమంది పిల్లలు తల్లితండ్రులు, గురువులు చెప్పగా నేర్చుకుంటారు.
పిల్లలకి మంచి నడవడి రావాలంటె తల్లితండ్రులదే బాధ్యత అని నాకనిపిస్తూంది. వారికి కావలసినవన్నీ, వారు నొచ్చుకుంటారని అమర్చి పెట్టేస్తుంటారు. చిన్నప్పుడు మాకు ఎలాంటి సరదాలు తీరలేదు, అంచేత మా పిల్లలకి ఏలోటూ ఉండకూడదని అని నేటి తరం భావిస్తున్నారు. అదీ కొంతవరకు నిజమే. కోరికలు తీర్చడంతో పాటు మంచినడవడిగల పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత కూడా తల్లిదే.

Sunday, 1 November 2020

విశాఖ ప్రయాణం.

 

విశాఖ ప్రయాణం.

 

“అమ్మా! నేను బయల్దేరి వైజాగ్ వస్తున్నాను” చిన్నకూతురు మధు గొంతు ఫోంలో విన్న భారతికి ఏమీ అంతుపట్టలేదు. అమ్మా! మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఈ  విపత్కర పరిస్థితులలో ఈవిడెందుకు ఇప్పుడు బల్దేరుతూంది అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అయిదారు నెలల నుంచి భుజం నొప్పితో భారతి చాలా బాధపడుతూంది. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కి చూపించుకుని ఎక్ష్రేలు, స్కాన్ తీయించుకొంది. భుజం దగ్గిర ఎముక పూర్తిగా అరిగిపోయిందని, లూస్ బాడీస్ ఉన్నాయి అవి తీసెయ్యాలని, డాక్టర్స్ చెప్పారు.  చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరి, పైగా ఈ వయస్సులో తట్టుకోగలనా అని భయం, అన్నీ కలిసి ఆపరేషన్ కి మొగ్గు చూపట్లేదు. కొడుకు విజయ్, కూతురు మధు హైదెరబాద్లో ఉంటున్నారు. పెద్ద కూతురు విశాఖపట్నంలో ఉంటూంది.  సంగతంతా తెలిసి కొడుకు, కూతుళ్ళు ఎలాగైనా ఆపరేషన్ చెయించుకోవాలని పట్టుబడుతున్నారు. నిన్న కొడుకు విజయ్ ఫోన్ లో మాట్లాడి అమ్మా మేము నీకు సర్జరీ  చేయించేస్తాము. నువ్వు అంత బాధ పడుతుంటే మాకెలా తోస్తుంది. డబ్బుగురించి నువ్వేం అలోచించకు, నువ్వు ఏం చెప్పినా మేము వినం అని ఖరాఖండిగా అన్నాడు. దాని పరిణామమే మధు రాక అయ్యుంటుంది అనుకుంటుందగా మళ్ళీ మధు ఫోన్ చేసింది.

అదేమిటే! హఠాత్తుగా ఈ ప్రయాణం? అని ప్రశ్నించింది. “అమ్మా! నువ్వు చెయ్యి నొప్పితో చాలా బాధ పడుతున్నావని, సర్జరీ అవసరమని అక్క చెప్పింది. అక్కకి నడుం నొప్పి ఎక్కువగా ఉందట, ఆఫీస్ లో  కూడా సెలవు దొరకట్లేదని, నన్ను రమ్మని చెప్పింది. ఆసుపత్రికి నిన్ను తెసుకెళ్ళడానికి, పరీక్షలు అవీ చేయించడానికి అవసరాన్ని బట్టి సర్జరి చేయించడానికి రమ్మంటూంది. అందుకే గోదావరిలో బయల్దేరాను”. అంది.  “అది చెప్పడం నువ్వు బయలుదేరిపోవడం చాలా బాగుందమ్మా! పరిస్థితులెలా ఉన్నాయి రోజు రోజుకీ కరోనా విజృంభిస్తూంది.  ఈ సమయంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం శ్రేయస్కరం. తోందరపడి బయల్దేరి  ఇబ్బందులపాలవుతావేమో. అయినా నాదేం ప్రాణం తీసే జబ్బుకాదు. కాస్త పరిస్థితులు చక్కబడ్డాక అలోచించుకోవచ్చు. అందాకా ఏవో మందులు వాడుతున్నాను కదా!” అని భారతి అంటుంటే అవతలినుంచి నవ్వులు వినిపించాయి. అప్పుడు మధు “ఇబ్బందుల పాలవ్వటమేమిటమ్మా? అనేక ప్రమాద పరిస్థితులను దాటుకొని తమ్ముడింటికి ఇప్పుడే చేరాను. నేను వైజాగ్ దాకా రాలేదు  అని చావు కబురు చల్లగా చెప్పింది. భారతికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించింది ఏమిటే నీ మాటలు సరిగ్గా చెప్పి ఏడు. అంది గాభరా పడుతూ ..  అమ్మా! నువ్వు ఒట్టి గాభర మనిషివి అందుకే నీకు సగం విషయాలు చెప్పం. ఇబ్బందులన్నీ తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరాను కనుక ఇప్పుడు నీకు ఫోన్ చేసాను అంది. అసలేం జరిగింది? సరిగ్గా చెప్పు.అంది భారతి.

అక్క దగ్గర్నుంచి ఫోన్ వచ్చాక నేను, తమ్ముడు  నీ సమస్య గురించి మాట్లాడుకున్నాము. తమ్ముడు ఈమధ్యే కొత్త కంపెనీ లో చేరాడు. తనకి సెలవు దొరకడం కష్టమని, నన్ను వెళ్ళమని అన్నాడు. డబ్బు సంగతి తను చూసుకుంటానని గోదావరి లో టికెట్ బుక్ చేశాడు.  మధ్యాహ్నం వచ్చి నన్ను తీసుకుని స్టేషన్ కి వచ్చాడు. నేను పకడ్బందిగా మాస్క్, గ్లొవ్స్ అన్నీ వేసుకుని తయారయి వచ్చాను, అక్కడి సిబ్బంది స్టేషన్ లోకి తమ్ముడిని రానివ్వలేదు.నేను సామాను తీసుకుని లోపలికి వెళ్ళాను. ప్లాట్ ఫామ్ రద్దీగానే ఉంది.  స్టేషన్ కి రెండు గంటలు ముందు రావాలని, అందరిని నిశితంగా పరీక్ష చేసి బండి ఎక్కనిస్తామని రైల్వే వారి ఆదేశం. అలాగే వచ్చాను అక్కడ ఏవిధమైన పరీక్షలూ లేవు.  ట్రైన్ వచ్చేసరికి జనాలు గుమ్మం దగ్గిర మూగేసారు. కాస్త రద్ది తగ్గాక పెట్టెలోకి ఎక్కాను. అక్కడి పరిస్థితి చూస్తే తల తిరిగిపోయింది.

అడ్డదిడ్డంగా సామానులు, మనుష్యులు నించుందికి కూడా జాగా లేదు. ఒక్కళ్ళకీ మాస్క్స్ లేవు. కనీస జాగ్రత్తకూడా పాటించటం లేదు. మీద బెర్త్ నాది. అందాక కింద కూచుందామంటే కింద బెర్త్స్ రెండింటిలోనూ అనారోగ్యంతో పడుకుని ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు. చేసేది లేక లగేజ్ కింద సర్ది మీదకి కష్టపడి ఎక్కాను. ఏదో స్పెషల్ బండిట. మీదని కూడా కూర్చుందికి వీలుగా లేదు. ఈలోపున తమ్ముడి ఫోన్. బండి ఎక్కవా? జాగ్రత్తగా కూచున్నావా అని ఏం జాగ్రత్తరా బాబూ అని పరిస్థితి వివరించాను. వాడు వెంటనే గాభరాపడి అక్కా! నువ్వు బండి దిగిపో ఇంటికి వచ్చేద్దువుగాని. నేను వచ్చి తీసుకెల్తాను. ఆ బండిలో వెళ్ళావంటే కరోనా కచ్చితంగా వచ్చేస్తుంది. నీ ద్వారా అమ్మ వాళ్ళకి సంక్రమిస్తే బాబోయ్! తలుచుకుంటేనే భయంగా ఉంది. బండి దిగిపో అన్నాడు. కొంపదీసి దిగిపోయావేమిటే అంది భారతి. చెప్పేది పూర్తిగా వినమ్మా. తమ్ముడు చెప్పిందే నాకూ నయమనిపించింది. అసలే అనారోగ్యంగా ఉన్న నేను 14 గంటలు ఆ కూపేలో ప్రయాణిస్తే ఏమైనా జరుగుతుంది. అనుకుని కష్టపడి మీదనుంచి దిగాను. ఈలోపున బండి కదిలిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. వచ్చే స్టేషన్ మౌలాలిలో దిగిపో నేను వస్తాను అన్నాడు. సామానులు సర్దుకుని జనాల్ని తప్పించుకుని ద్వారం దగ్గరికి వచ్చేసరికి మౌలాలి కూడా దాటిపోయింది. బండి ఆగలేదు కూడా.. అప్పుడు మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. ఆ తరువాత స్టేషన్ ఘట్కేసర్ దిగిపో అన్నాడు. తరువాత్ స్టేషన్ లో బండి ఆగలేదు. ఇంక లాభం లేదని చైన్ లాగాను. బండి స్టేషన్ కి కాస్తదూరంలో ఆగింది. గబ గబా సామాను పట్టుకుని దిగేసాను. చిన్నగా వాన పడుతూంది. ఈలోపున రైల్వే సిబ్బంది నలుగురు దిగి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతసేపు పడ్డ టెంషన్ కి నాకు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. అయినా వాళ్ళు అడిగిన అన్నింటికీ జవాబు చెప్పాను. నేను పడ్డ అవస్థంతా చెప్పేను. మీ ఎవరి సలహా అయినా తీసుకుందామంటే  మీరెవ్వరూ కనిపించలేదు అన్నాను. మీకు ఇబ్బంది వస్తుందని మీ పక్కనే కూచుంటామా? అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. నా శారీరిక పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించ లేదు. నాకు వళ్ళుమండి నేనూ తిక్కగానే సమాధానం చెప్పి ఏం చేసుకుంటారొ చేసుకోండి నా ఆరోగ్యం బాగులేదు. ఇక్కణ్ణుంచి ఎలాగోలా ఇల్లు చేరాలి అనుకుని దిగాను. అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఏవో రాసుకుని బండెక్కిపోయారు. బండి కదిలింది.

బ్రతుకుజీవుడా అనుకొని సామాను పట్టుకుని ట్రాక్ పక్కనుంచి వానలో తడుస్తూ ఒక ఇరవై నిమిషాలు నడిచి స్టేషన్ చేరాను. తీరా చూస్తే అది చర్లపల్లి స్టేషన్. నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు కొంచెం ఆయాసం తీర్చుకుని తమ్ముడికి ఫోన్ చేసాను. వాడు వెంటనే అక్కా నేను అక్కడికే వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు చాలా వాన పడుతూంది అని జవాబిచ్చాడు. కంగారు పడకు మెల్లిగా రా! వాన పడితే హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అని జవాబిచ్చి బెంచి మీద కూర్చున్నాను. ఈలోపున స్టేషన్ కానిస్టెబుల్ వచ్చి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. మీరు ఇక్కడ ఎందుకు దిగారు అంటూ.. వాడికి జవాబు చెప్పాను. ఆఫీస్ రూం కి వచ్చి నే చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు. అలాగే చేసాను. వాడు ఒక్కడే స్టేషంలో నేనూ ఒక్కాదాన్నే చీకటి పడుతూంది, వానకూడా ఎక్కువయింది. మనసుకి ధైర్యం చెప్పుకుని కూర్చున్నాను అరగంట పొయాక తమ్ముడు వచ్చాడు.  అక్కా! ఉన్నావా తల్లీ నిన్ను చూసిందాకా నా ప్రాణం నిలబడలేదు. పద వెళ్దాం కారులో మాట్లాడుకుందాం అని చెప్పి సామాను తీసుకుని బయల్దేరాడు. వాణ్ణి చూసాక నాకూ కొంత ఉపశమనం కలిగింది.  ఇద్దరం కారులో కూర్చుని హోరుమని వానలో ఇంటివైపు బయల్దేరాం. దారిలో అంతా వివరంగా చెప్పాను. ఇంటికి చేరేసరికి తమ్ముడి పిల్లలు, భార్యా అందోళనగా ఎదురు  చూస్తూ కనిపించారు. అందర్నీ పలకరించి లోపలికివచ్చి కాస్త తేరుకుని నీకు ఫోన్ చేసాను. అంది మధు.

కూతురు చెప్పినదంతా వినేసరికి ఒక్కసారి ఒంట్లో వణుకు వచ్చింది భారతికి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకుంది ఎంత దారుణంగా ఉన్నాయి రోజులు?  చీకటివేళ నిర్మానుష్యమైన ప్రదేశంలో రైల్వే పట్టాల పక్కనుంచి ఒక్కర్తీ నడుచుకు రావడం, ఎవరైన కనిపెట్టి ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏదీ గతి? ఎంత దారుణం జరిగేది? ఆ వానలో టెంషన్ తో కారు నడిపిన కోడుకు పరిస్థితి అలోచించినకొద్దీ మనసు వికలమై పోతూంది. కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.  తను నమ్ముకున్నా ఆంజనేయ స్వామే తన పిల్లల్ని కాపాడాడు అనకుని, స్వామికి పదే పదే నమస్కరిస్తూ నిట్టూరుస్తూ కూర్చుంది. భారతి భర్త వచ్చి, నాకు ఇందాకలే విజయ్ ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితి. మధుని తీసుకు రావడానికి వెళ్తూ నాతో మాట్లాడాడు. అమ్మకి చెప్పకండి కంగారు పడుతుంది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పాడు.. అయితే అంతా మీకు తెలుసన్నమాట! ఇంతసేపూ మీరు అన్యమనస్కంగా ఉంటే ఏమో అనుకున్నాను. మీ గుండె నిబ్బరం మెచ్చుకో వచ్చు అని నిష్టూరమాడింది. పోన్లే పిల్లలికి ఏం కాలేదుగా ఇంకా ఎందుకు బెంగ? పద  పడుకో  ఇంక. అని అనునయించాడు.

Sunday, 27 September 2020

బాలు - కవిత



 


మా మరిది గారు చి.
Umamaheswar Rao Ponnada
అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పై రాసిన కవిత యధాతధంగా :
బాలు
---------
అయిదున్నర దశాబ్దాలు అలరించిన
ఓ గొంతు మూగబోయింది!
అఖండంగా కురుస్తున్న ఓ అమృతధార
హఠాత్తుగా ఆగిపోయింది!
వెన్నెల కరిగి సన్నగా అతని
గొంతులోంచి జారినట్లు ఉండేది.
సన్నజాజి అతని పెదవుల మీదనే
విరిసి పాటతో పరిమళించినట్లుండేది.
ఎవరైనా అనుకున్నామా?
నిశ్శబ్దంగా మొలిచిన ఓ లేత స్వరం
తేనెల జల్లులు కురిపిస్తుందని,
కోట్లాది మనసులని మురిపిస్తుందని,
భాషా హద్దులని చెరిపేస్తుందని!
ఎవరైనా ఊహించామా!
పాట అతని గొంతులో మరో గుండెగా వెలుస్తుందని,
పాటే అతనికి ఊపిరిగా నిలుస్తుందని!
మన ప్రతి ఉదయం అతని పాటతో పలకరిస్తుందని,
ప్రతి తెలుగు గుండె అతని పాటతో పులకరిస్తుందని!
ఏమైందో, ఏమో?
పై నుంచి ఎవరైనా చేతులు చాచి పిలిచారో?
ఈ బాలు ఇక మీకు చాలు అని తలచాడో?
హడావుడిగా తన పాటల మూటల్ని
భుజాన వేసుకొని మరొక కొత్త వేదికను
వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు!
ఇకపై
అక్కడ గంధర్వలోకంలో రోజూ
అతని గానకచేరీ కొనసాగుతూనే ఉంటుంది!
ఇక్కడ గాలి ఉన్నంత వరకు మనకోసం
అతని పాటను మోసుకొస్తూనే ఉంటుంది!
.........
రాతలు పొన్నాడ ఉమామహేశ్వర రావు
గీతలు: శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తి

Saturday, 29 August 2020

తెలుగు బిడ్డ - కవిత

 తెలుగుదేశమందు పుట్టి తెలుగుబిడ్డనని చెప్పి

తెలుగును విస్మరించెదవేల తెలుగుబిడ్డా!
మధురమైన తెలుగుభాష దొరలు మెచ్చ్చిన భాష
పొట్టకూటికై ఆంగ్లభాష నేర్చి అమ్మభాషను మరచెదవేల తెలుగుబిడ్డా!
హరికథలు చెప్పి పామరులను సైతం రంజింపచేసిన భాష
బుర్రకథలతో వీరుల చరిత్రలతో   వినోదాన్ని అందరికీ పంచిన భాష
అవధాన ప్రక్రియతో ఔరా! అనిపించినా అమృత భాష
పండిత ప్రవచనాలతో విజ్ఞానం పంచిన భాష నీకు చేదయిందా తెలుగు బిడ్డా!
తెలుగు భాషకు మాత్రమే సొంతమయిన ఛందస్సు, గణవిభజన గల పద్యాల సొగసు
తేటతెలుగు భాష గొప్పదనం నీకేల  కానరాదు తెలుగు బిడ్డా!
ఆనాటి కవుల సాహీతీ సంపదని, అన్నమయ్య పదకవితల్లోని భావజాలాన్నీ
వాగ్గేయకారకుల కీర్తనల్లోని మధురిమనీ నీవేల ఆస్వాదించలేకపోతున్నావు తెలుగుబిడ్డా!
స్వచ్ఛమైన తెలుగుభాషలో ఆంగ్లపదాలు మేళవించి,
అమృతతుల్యమైన తెలుగుభాషని ఎంగిలిభాష చేయకు తెలుగుబిడ్డా!
అవసరార్ధం పరభాషను నేర్చినా అమ్మ భాషకు తెగులు పట్టించకు తెలుగు బిడ్డా!

(2018, ఆగస్టు నెలలొ 'తెలుగు తల్లి కెనడా' లో ప్రచిరితమై బహుమతి పొందిన నా కవిత)

Saturday, 15 August 2020

సంసారమే మేలు సకల జనులకు... అన్నమయ్య కీర్తన.

 ఈ వారం అన్నమయ్య కీర్తన.

సంసారమే మేలు సకల జనులకు
కంసాంతకుని భక్తి కలిగితే మేలు.

వినయవు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాగకుంటే మేలు,
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు. !!

కోరి నొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు,
భారపుటిడుమలను పడకుండితే చాలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు !!

పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి
యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు.

భావం… సకల జనులకూ సంసారము మేలే.. సంసారం ఈదుతున్నా భవబంధాలన్నిటిని మోస్తున్నా కంసాంతుకుడైన ఆ హరిని స్మరించడమే మేలు.

వినయంతో కూడిన విద్యను సాధిస్తే మేలు. ఆడంబరాలకు పోయి అప్పుల పాలవకుండా ఉంటే మేలు. లోభం వల్ల అక్రమాలూ, అప్పులూ చేసి భూమికి భారం కాకుండా ఉంటే మేలు. వెన్నంటి ఉన్న కోపాన్ని విడిచితే మేలు.

కోరి ఎవరినీ ఏమీ యాచించి అవమాన పడకుండా ఉంటే మేలు. జీవులను హింసించకుండా ఇతరులను కష్టపెట్టి అనేక కష్టాలను తెచ్చుకోకుండా ఉంటే మేలు. మన చేత బాధింపబడ్డ వారిచే నిందింపబడకుండుటే మేలు.

పరకాంతల నాశించి భంగపడకుండుటే మేలు. దొరకొని ముళ్ళదారులను తొక్కకుంటే మేలు. శ్రీ వేంకటేశ్వరుని నిష్టతో కొలిచి నిశ్చింతుడైతే అన్ని విధాలా మేలు.

గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పు లేదు కానీ, పరమాత్మునిపై మనస్సు నిలిపి నిష్కామ బుధ్ధితో నీ భాధ్యతలను నిర్వర్తించు అని ఈ కీర్తనలో అన్నమయ్య మనకి వ్యక్తీకరించాడు.