Saturday, 28 December 2019

అందుకే సుమ్మీ నే జేసే ఆచారాలు - అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.


అందుకే సుమ్మీ నే జేసే అచారాలు దైవమా!
నిందవాయ నా మనసు నాపై నిలుపవె..

బట్టబయట దోలితేను బందెమేయు బసురము
పట్టి మేపితేను తన పనులు సేయు,
ఇట్టె వదిలితేను ఎందైనా బారు మనసు
కట్టుక నేమస్తుడైతే కైవసమై యుండును.

బండి దప్పితే బంట్లు పరదేశు లౌదురు
యెడయక కూడుకొంటే హితు లౌదురు,
విడిచితే ఇటులనే కడకు బారు మనసు
ఒడలిలో నణచితే ఒద్దికై ఉండును.

చే వదలితే పెంచిన చిలుకైన మేడలెక్కు
రావించి గూట పెట్టితే రామా యనును,
భావించకుండితే ఇట్టె పారునెందైనా మనసు
శ్రీ వేంకటేశు గొలిచితే చేతజిక్కి ఉండును.

భావముః    ఈ కీర్తనలో అన్నమయ్య మనసును నిగ్రహించుకుని పరమాత్ముని మీదకు ఏ విధంగా మళ్ళించుకోవాలో   విశదీకరించాడు.

ఓ దైవమా! చంచలమైన నా మనస్సు ఎన్నో నిందలపాలై ఉన్నది. నీవు కరుణించి నీపై నామనస్సు నిలబడేలా చెయ్యి. అందుకే సుమా ఈ ఆచారాలన్ని నేను పాటిస్తున్నాను.

పశువును బట్టబయటకు దోలిన పైరు మేసి బందులదోడ్డి పాలబడి బందీ అగును. అదే మన ఇంటిలో పట్టి ఉంచి మేపితే  మనకు  అవసరమైన పనులు చేయును. అట్లే మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడితే దాని ఇష్టమువచ్చినట్లు తిరిగి, తిరిగి చెడిపోవును. అట్లు వదలక నియమము గల వాడు మనస్సును నిగ్రహించుకొనినచో స్వాధీనమై ఉండును.
కట్టుబాటు తప్పించి వదిలిపెట్టినచో సేవకులు పరదేశులై విచ్చలవిడిగా సంచరింతురు. వారిని అదుపులో పెట్టుకుని, వారితో హితముగా సంచరిస్తే సనిహితులై సేవలు చేయుదురు.ఇట్లే విడిచిపెట్టినచో మనస్సు కూడా మన మాట వినదు. తనలోనే నిగ్రహించినచో చెప్పిన మాట వినును.

తాను ముద్దుగా పెంచుకొన్న చిలుకైనను చేయి వదిలినచో ఎగిరిపోయి మేడలేక్కి, చెట్లెక్కి తిరుగాడును. చేరదీసి పంజరములో నుంచిన మనము చెప్పినట్లు రామా! రామా! అనును. అట్లే భగవంతునిపై మనస్సును నిలపకున్నచో, ఇటు అటూ పరుగులు పెట్టును.   శ్రీవేంకటేశుని పై మనస్సును నిలిపి ధ్యానించినచో స్వాధీనమై మేలు గూర్చును.

Saturday, 21 December 2019

నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
కీర్తన:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే ॥పల్లవి॥
చ.1 మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు ॥ పారేటి ॥
చ.2 పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు ॥ పారేటి ॥
చ. 3 తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
(రాగం: సామంతం; ఆ.సం. సం.3; 286 వ రేకు; కీ.సం.494)
విశ్లేషణ:
ఓ శ్రీవేంకటేశ్వరా! ఒక్కసారి నీ నారాయణ మంత్రాన్ని మంత్రించి జీవులపై వదలినట్లైతే జీవన వ్యాపారాలలో, అనేక మోహాలలో, అనేక అనవసర వ్యాసంగాలతో ఉండే మనుష్యులు తమ తమ భ్రమలను వీడి నీశరణు వేడి కైవల్యం పొందరా! కానివ్వండి…. నారాయణమంత్రరాజాన్ని వదలండి అని జీవులజీవితోద్ధరణకై అన్నమయ్య స్వామిని శరణువేడి ప్రార్ధిస్తున్నాడు
.
ఓ శ్రీనివాసుడా! ఈ జీవులకు మదనభూతం సోకింది. తత్కారణంగా పురుషులు, స్త్రీలు వివశులై విచక్షణ నశించి దిగంబరులై, పెదవులలో రక్తము చిమ్మే దాకా, గోళ్ళతో శరీరంపై గోట్లు పడేదాకా రక్కుకుంటూ, అతిశయించిన మదనోత్సాహంతో అవతలి వారి కుత్తుకలు తెగే వరకూ తెగిస్తున్నారు. దంతక్షతాలు నఖక్షతాలు అనే శృంగార క్రీడ బరితెగించినదని, బజారున పడిందని..వాపోతూ… నిరశిస్తున్నాడు అన్నమయ్య. ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత దౌర్భాగ్య స్థితి.
ఓ పరంధామా! ఈ సృష్టిలోని పంచభూతములు వీరిని పూర్తిగా వశపరచుకొన్నవి. బయటపడలేని భ్రమలలో మునిగి కన్నుమిన్ను గానక కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత హేయమో చూసారా! ఒడలికి మట్టిని పూసుకుని వెర్రి ఆనందంపొందేవాడు ఒకడు. తాంబూల సేవనమే ముఖ్యం అని తలుస్తూ ఆ రసాస్వాదనే జీవిత పరమార్ధం అనుకునేవారు మరికొందరు. జీవులందరికీ ధనపిశాచము పట్టింది. ఉఛ్చనీచాలు పుడమిలో నశించాయి. ధనసంపాదనకు ఏపనికైనా సిద్ధపడుతున్నారు. ఇక మీరు నారాయణ మంత్రం వదలవలసినదే!
ఓ పరాత్పరా! పరంధామా! విపరీతమైన ధనదాహం, కామదాహం కారణంగా జీవులకు మాయా భూతం సోకింది. తద్వారా “తానెవరో!” తెలిసికోలేని స్థితికి దిగజారాడు. నేను అంటే ఎముకలు…తోలు… ఇదే… ఇదే నాజాతి…ఇదే నేనంటే అనే భ్రమ సోకింది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమనే విషయం విస్మరణకు గురి అయినది. అందువల్ల అరిషడ్వర్గాల వలలో చిక్కాడు. జననమరణ చక్రంలో పడి తిరుగుతున్నాడు. వేల సంవత్సరాలు ఇదే తంతు కొనసాగుతోంది. దీని నుంచి “నారాయణ మంత్రం” ప్రసాదించి జీవులను బయటపడవేయ వలసినదిగా ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
భావం..శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.

Friday, 13 December 2019

వేదన.

వేదన.
జననం వేదన మరణం వేదన
జనన మరణాల మధ్య నలిగే జీవనం వేదన.
బాల్యంలో పాఠశాల చదువులు వేదన
కౌమార్యంలో అమ్మ చెప్పిన బుధ్ధులు విని వేదన
యవ్వనంలో జీవిత భాగస్వామి కోసం ఆరాటంలో వేదన
సంసారసాగరంలో మునిగితేలుతూ
పిల్లల బవితవ్యం కోసం వేదన.
రెక్కలొచ్చి పిల్లలు ఖండాంతరాలకి ఎగిరిపోతే,
వారి రాకకోసం నిరీక్షణలో వేదన.
చరమాంకంలో మృత్యువుకోసం ఎదురుచూపులలో వేదన.

ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు..


ఈ వారం అన్నమయ్య కీర్తన. 


ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు
కొంచడేమిటికి వీడె ఘూర నారాసింహుడు.

గక్కన అహోబలాన కంబములోన వెడలి
ఉక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్ళ జించి చెండాడినయట్టి
వెక్కసీడు వీడివో వీర నారసింహుడు.

భవనాసి ఏటిదండబాదుకొని కూచుండి
జవళి దైత్య పేగులు జందేలు వేసి
భువియు దివియు ఒక్క పొడవుతో నిండుకొని
తివురుచున్నాడు వీడె దివ్య నారసింహుడు.

కదిసి శ్రీసతి గూడి గద్దెమీద గూచుండి
యెదుట ప్రహ్లాదుడు చేయెత్తి మొక్కగా
అదన శ్రీ వేంకటాద్రినందరికి వరాలిచ్చి
సదరమైనాడు వీడె శాంత నారసింహుడు.

భావం..
ఈ కీర్తనలో నరసింహస్వామి ప్రతాపాన్ని, గొప్పదనాన్ని వర్ణిస్తున్నాడు అన్నమయ్య.
ఎంచి చూడగా ఈతని కెవ్వరు ఎదురు రాగలరు ఈతనికితనే సాటి అయిన ఘోర నారసింహుడు.
అహోబలక్షేత్రం లో కంబములోనించి వెలికి వచ్చి, అతి బలవంతుడైన హిరణ్యకశిపుని వొడిసి పట్టుకొని,  తన వాడియన గోళ్ళతో చీల్చి చెండాడి సాటిలేనటువంటి వీరనారసింహుడితడు.
భవనాసి ఏటి తీరాన తనభుజబలం చూపిస్తూ కూర్చుని ఆ రాక్షసుని పేగులు జందేలుగా వేసుకొని, భూమి ఆకాసం ఒక్కటే పొడవుగా నిండి తిరుగుచున్న దివ్య నారసింహుడితడు.
సమీపాన శ్రీసతితో కలసి గద్దెమీద కూర్చొని, ఎదురుగా ప్రహ్లదుడు చేయెత్తి మొక్కుతుండగా, శ్రీవెంకటాద్రిమీద కొలువై యుండి అందరికీ వరాలిచ్చే తేలికపడ్డ వాడైన శాంత నారసింహుడితడు.

Tuesday, 10 December 2019

అందం


మగువ  అందం.

మనసు దోచిన మగువ అందమే అందం
రసజ్ఞుల హృదయలలో రాగాలను పలికించిన కడు రమ్యమైన అందం
అసమాన సౌందర్య రాశివని వేనోళ్ళ పొగడ్తలందుకున్న అందం
ఆమె ప్రతి కదలికా అందమే, ప్రతి భంగిమా అందమే
అందానికి అందం నువ్వేనని ప్రశంశలు అందుకున్న అందం
ఆమె రాసిన రాత అందం, ఆమె గీసిన గీత అందం
ఆధునికాలంకరణలో ఆహ్లాదపరచే అందం
మనసుపైన మత్తుజల్లి ఆనందలోకాల విహరింపజేసే
                                   అపురూపమైన అందం
అభినందనల వెల్లువలో తడిసి ముద్దయిన అందం.
వన్నె తగ్గినా అభిమానుల అంతరంగాలలో
                                  స్థిరనివాసమైన అందం.

మహిళ


మహిళ


అలనాడు అత్తవారింట్లో అత్త, ఆడపడుచుల సాధింపులతో,
వేధింపులతో దుఃఖాన్ని దిగమింగి కాపురాలు చేసే కోడళ్ళు.
వ్యసనపరుడైన భర్తకి అహోరాత్రాలు చాకిరీ చేసి,
అతని రుసరుసలకు బదులుచెప్పలేక బ్రతుకునీడ్చే భార్యలు.
వరకట్నపిశాచి కరకు కోరల మధ్య నలిగిపోయి,
సజీవదహనమయిన నవ వధువులు.
ఆడపిల్లను కన్నందుకు అత్తవారింట్లో అవమానభారంతో
దుఃఖితులైన మాతృమూర్తులు.
మారిన కాలంలో జీవనయానం సాగించుటకు
వీధిలోకి అడుగుపెట్టిన మహిళలు.
సంస్కారహీనులైన సహోద్యోగుల వెకిలి సకిలింపులకు
హేయమైన చూపులకు విసిగి వేసారిన ఉద్యోగినులు.
కళాశాలలో ప్రేమోన్మాదుల చేతులలోరసాయనిక దాడులకు
బలియై భవిష్యత్తును కోల్పోయిన విద్యార్ధినులు
ఈ నాడు చిన్నా పెద్దా తారతమ్యం లేక,
మానభంగాలకూ, దారుణ హత్యలకూ గురై
ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న అభాగినులూ..
ఇంకెప్పుడు స్త్రీకి స్వేచ్ఛ? రక్షణ? నిశ్చింత?


Friday, 6 December 2019

సువ్వి సువ్వి సువ్వలమ్మ | నవ్వుచు దేవకి నందనుగనియె - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన
సువ్వి సువ్వి సువ్వలమ్మ | నవ్వుచు దేవకి నందనుగనియె ||

|| శశివొడచె అలసంబులు గడచె |
దిశల దేవతల దిగుళ్ళు విడిచె ||

|| కావిరి విరిసి కంసుడు గినిసె |
వావిరిబువ్వుల వానలు గురిసె ||

|| గతిసేనే అటు గాడిదలు గూసె |
కుతిల కుడిచి జనకుడు నోరుమూసె ||

|| గగురు పొడిచె లోకము విధి విడిచె |
మొగులు గురియగ యమునపై నడచె ||

|| కలిజారె వెంకటపతి మీరె |
అలుమేల్మంగ నాచారలుకలు దీరె ||

దెవకీదేవి నవ్వుచూ కొడుకుని కన్నది, అని బియ్యం దంచుతూ ఆడువారు సువ్వి సువ్వి అనే ఊత పదాన్ని పాడుకుంటూ దంచుతున్నారు.

అష్టమినాడు చంద్రుడుదయించాడు. కష్టాలన్నీ తీరిపోయాయి. దేవతలందరూ విచారం విడిచారు.

నల్లని పొగఅంటి చీకటి కమ్ముకుంది. కంసుడు కోపగించుకున్నాడు. వావిలపూల వానలు కురిశాయి.

వసుదేవుడు రేపల్లెకి వెళ్ళే మార్గంలో గాడిద కూసింది. భయపడి దాని నోరు మూసాడు.

రోమాలు నిక్కబొడిచాయి. లోకం గతితప్పినట్లయింది. మేఘాలు వర్షిస్తుండగా యమున నదిపై నడిచాడు.



కాలం ద్వాపరయుగం దాటి కలియుగంలోకి చేరింది. వేంకటేశ్వరుడుగా వచ్చాడు. ఇక అలిమేలుమంగకు, నాంచారుకూ కోపాలు తీరాయి.