Wednesday 11 February 2015

రామాయణంలో రాజనీతి (౨)



శ్రీమద్రామాయణం. అయోధ్యకాండ.
శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాక తిరిగి అయోధ్యకు రాముడిని తీసుకురావాలని భరతుడు అరణ్యానికి వెళతాడు. అప్పుడు భరతుని యోగక్షేమాలు అడుగుతూనే రాజధర్మాన్ని రాజుకు ఉండవలసిన లక్షణాలనీ రాముడు భరతునికి చెప్తాడు.
          సేనలో అందరికీ జీతభత్యాలు సకాలంలో అందకపోతే చాలా ప్రమాదం సుమీ ... దూతల విషయంలో చాలా జాగ్రత్తలుండాలి. వాడు మన దేసీయుడే కావాలి. విద్వాంసుడూ, ప్రరిభావంతుడూ, భరతశాస్త్రవిదుడూ కావాలి. ధర్మాధ్యక్ష,నగరాధ్యక్ష  మొదలగు వారందరి ప్రవృత్తులనూ కనిపెట్టడానికి చారులను నియోగించావా?
          వేద వేదాంగజ్ఞానం లేక తర్కమే ప్రమాణంగా సాగేవారిని దరిచేరనీయకు. వ్యసాయం, పశుపోషణ, వాణిజ్యం ప్రధానంగా జీవయాత్ర సాగించే వైశ్య శిఖామణుల కష్టసుఖాలు స్వయంగా చూసుకుంటున్నావా ? రాజ్యంలో దుర్గాలన్నీ ధన,ధాన్య సమృద్ధి తో ఉంటున్నాయా? శిల్పకారులూ, యంత్రనిర్మాతలూ, ధనుర్దారులూ అసంతుష్టులు కాకుండా ఉంటున్నారా? ధనాగారం అపాత్రుల చేతిలో పదనివ్వకూడదు సుమీ.. ఆదాయాన్ని మించి వ్యయం పెరగకూడదు.
          నీ రాజ్యంలో పవిత్రులూ, పూజ్యులూ, నిర్దోషులూ నిష్కారణంగా దండితులు కాకూడదు. దోషం నిరూపితమైనాక సకాలంలో దోషిని దండిస్తున్నావా? ఏ ప్రలోభానికో లొంగి దండనీతికి దూరమవుతున్నావా? దోషిని సకాలంలో శిక్షించక పోయినా,  నిర్దోషిని కారాగారం పాలు చేసినా అది రాజునీ, రాజవంశాన్నీ నాశనం చేస్తుంది. (మనదేశంలో ప్రస్తుతం జరిగే అనర్ధాలన్నీ ఇవే కదా..)
          విభూషితగాత్రుడవై, ప్రసన్నవదనంతో ప్రజాసముదాయానికి అనుదినం ఉదయకాలం దర్సనమిస్తున్నావా?  సుఖాభిలాషతో రాత్రులు చేయవలసిన కామోపసేవనానికి దివావేళ ఉపక్రమించారాదని ఎరుగుదువుగా...   ఇంద్రియలోలుడవై చరించకూడదని గ్రహించావా?
          మనకున్న జ్ఞానాన్ని శీలంతో సఫలం చేసుకోవాలి. దండధరుడై ధర్మమార్గాన సాగే ప్రభువును ప్రజలు మన్నిస్తారు. వానికే ఇహపరాలు కరతలామలకాలు అని రాజధర్మాన్ని బోధించాడు.
ఎన్నో వేల సంవత్సరాలక్రితం ఇంత రాజనీతిని వాల్మికి గారు బోధించారంటే మన సంస్కృతి, మన పురాణాల గొప్పదనం అంచనాకి అందకుండా ఉంది. రాముడు చెప్పిన రాజనీతి, రాజధర్మం ప్రభువులు, ప్రభుత్వం పాటిస్తే రామరాజ్యం కాకపోతుందా?

No comments:

Post a Comment