Wednesday 11 February 2015

రామాయణంలో రాజనీతి (౧)



రామాయణం ; అయోధ్యాకాండ.
          భరతుడు అయోధ్య వచ్చి జరిగిన అనర్ధం తెలుసుకుని, ఎంతో బాధపడి శ్రీరాముడిని వనవాసం నుంచి తీసుకురావాలని వశిష్టుడు,జాబాలి మొదలగు మునులతో, కౌసల్య, సుమిత్ర, కైకేయి, శత్రుఘ్నుడితో  కొంతసేనతో, మంత్రులతో అరణ్యానికి బయలుదేరుతాడు. శ్రీ రాముడు భరతుడిని ఆప్యాయంగా చేరదీసి యోగక్షేమాలు అడిగి  పరిపాలనా విధానం గురించి ప్రశ్నిస్తూనే రాజనీతి ఉద్భోధ చేస్తాడు.
          మనహితవు కోరే పురోహితులను మర్యాదగా చూసుకుంటున్నావా? సేవకులను, విద్యలను, వేదవిదులను అభిమానంతో గౌరవిస్తున్నావా? శూరులు జితేంద్రియులు, వేద వేదాంగవిదులు,ఇంగితజ్ఞానులు అయిన వారితోనే మంత్రాలోచన జరుపుతున్నావా? నిద్రనుంచి సకాలం లో మేలుకొని విధ్యుక్తాలు నెరవేర్చు కుంటున్నావా? రాజ్య విషయాలలో నీ ఒక్కడి ఆలోచన యెంత అనర్ధమో, అనేకులతో సంప్రదించడమూ అంతే ప్రమాదము. మూర్ఖులను చేరదీసి విద్వాంసులను దూరం చేసుకోవడం లేదు కదా? లక్షలాదిగా మూర్ఖులు, స్వార్ధపరులు మనచుట్టూ చేరతారు. వీరెవరూ విషమదశ లో మనవెంట ఉండరు. శాస్త్రవిదుడైన ధీరుడే నీ మంత్రాలోచనకు అవసరం.
          సేవకులలో ఉత్తమ, మధ్యమ, అధమవర్గాల వారుంటారు.  అది కనిపెట్టి వారిని ఆయా యోగ్యకర్మాలలో ఉంచుతున్నావా? విశ్వాసనీయులనూ, పిత్రుపితామః పరంపరగా మనసేనలో ఉండేవారిని ఉన్నత స్థానాలలో ఉంచాలి. ఆచారభ్రష్టుడైన యజమానిని రుత్విజుడూ, బలత్కరించిన పురుషుని స్త్రీ, ద్వేషభావం తోనే చూస్తారు. అలానే విపరీతంగా పన్నులు పిండే ప్రభువును ప్రజలు పరమ శత్రువుగా చూస్తారు.
          ఇంకా ఎన్నో ధర్మ సూక్ష్మాలు రాముడు చెప్పాడు. మిగతావి రేపు రాస్తాను. ఇవన్నీ ఏకాలంలో అయినా  ప్రభువులూ, ప్రభుత్వం పాటించ వలసిందే.

No comments:

Post a Comment