Monday 9 June 2014

నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన – ఈనెపాన రక్షించీ నీశ్వరుడే కాక - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన :

నేననగా నెంతవాడ నెయ్యపు జీవులలోన – ఈనెపాన రక్షించీ నీశ్వరుడే కాక.

ఎవ్వరు బుద్ధి జెప్పిరి ఇలపై జీమలకెల్లా – నెవ్వగ బుట్టలుగొల్చు నించుకొమ్మని,
అవ్వల సంసార భ్రాంతి అనాదినుండియు లోలో దవ్వించి తలకెత్తే యంతర్యామే కాక !

చెట్టులకెవ్వరు బుద్ధి చెప్పేరు తతికాలాన – బుట్టి కాచి బూచి నిండా బొదలుమని,
గుట్టుతో జైతన్యమై గుణము లన్నిటికిని తిట్ట పెట్టి రచించిన దేవుడింతే కాక!

బుద్ధులెవ్వరు చెప్పిరి పుట్టినట్టి మెకాలకు – తిద్ది చన్నుదాగి పూరి దినుమని,
పొద్దు పొద్దు లోననుండి భోగములు మఱపిన – నిద్దపు శ్రీవేంకటాద్రి నిలయుడే కాక!

భావం:

సృష్టిలో స్నేహము గల జీవులనేకములున్నవి. నేననగా ఎంతవాడిని. అందరినీ కాపాడినట్లు నన్నీనెపమున ఆ పరమేశ్వరుడు కాపాడుచున్నాడు.

ఇలలో చీమలు అతి ప్రయత్నముతో తమ పుట్టలను ధాన్యముతో నింపుకొనుచున్నవి. అట్లు చేయవలెనని వాటికి ఎవరు నేర్పారు? అనాదిగా జీవుల అంతరంగములో సంసార భ్రాంతి కలిగించి సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడే వాటికాబుద్హి నేర్పి బ్రతుకు తెరువు చూపించాడు.

అదను తప్పక మొలకెత్తి, పూచి కాచి సంపూర్ణముగా వృద్ధి పొందమని చెట్లకు ఎవరు నేర్పారు? సృష్టిలో నిగూఢముగా నున్న చైతన్యమే వాటి కాయాగుణములను కలిగించి దేవుడే చెట్టు చేమలకట్టి స్థితిని కల్పించాడు.

పుట్టిన జంతువుల కన్నిటికి వెంటనే చనుబాలు గ్రోలి, కసవు మేసి బ్రతుకమని నేర్పిన వారెవరు? ప్రతినిత్యము అంతరంగములో నుండి ప్రేరకుడై ఆయా ప్రాణులకు ఆయా భోగములు అమర్చిన దయామయుడైన శ్రీ వేంకటేశ్వరుడే ఆపని చేయుచున్నాడు.

నారుపోసిన దేవుడే నీరు పోయునన్నట్లు జీవులను సృష్టించిన భగవంతుడే వారి పోషణాది ప్రవృత్తులకు హేతువగుచున్నాడు. అన్నమయ్య తాను సంకీర్తనాచార్యుడై, అనుదినము దేవుని మహిమను కీర్తించుచూ జీవించుటకు కారణము ఆ నెపమున తన్ను రక్షింపబూనిన పరమేశ్వరుడే అని ఈ కీర్తనలో వ్యక్తపరిచెను.

No comments:

Post a Comment