Friday 2 September 2016

ఎవ్వరెట్టయినా నుండనీ - అన్నమయ్య కీర్తన.


ప.  ఎవ్వ రెట్టయినా  నుండనీ  ఇదివో  నేను
     నవ్వుతా  నీ సేవ సేతు నడుమ నేను.                   ||
౧.  మనసున నొకమాట  మరఁగున  నొకమాఁట
     యెనసి నే(న?) నయములు యెరఁగ నేను (?)     
     వనితనై నీమీఁది వలపే గతియని
     తనివోక బతికే దానను నేను.                              ||
౨.  వోలిసితే నొకటియు నోల్లకుంటే నొకటియు
     చలివేడి వేసాలు జరప నేను
     కలికితనాన నీతో కాఁపురమే గతియని
     తలఁచి పొందులు సేసే దానను నేను                      ||
౩.  ఒక్కపరి ఇచ్చకము వొక్కపరి  మచ్చరము
    ఇక్కడా నక్కడ యెలయించను నేను
    గక్కన శ్రీ వేంకటేశ కలసితి విటు నన్ను
    మక్కువ నిటువలెనే మరుగుదు నేను.                   ||                                                                           

భావము:  ఇదిగో! స్వామీ! ఎవరెట్లాగయనా ఉండనీ నేను మాత్రం నీవు  కావాలనుకున్న చిన్నదాన్నే. నవ్వుతూ  నీ సేవ చేసుకుని తరిస్తాను.
మనసులోనొకమాట,  చాటుగా నొకమాట చెప్పి నయగారాలు పోయేదాన్ని  కాను. నీ మీద వలపుతో వచ్చిన దాననే, కాని  తనివితీరని పొందు కావాలనుకునేదాన్ని కాను.
ప్రభూ! నేను కావాలనుకుంటే ఒకమాట, వద్దనుకుంటే మరొకమాట చెప్పేదాన్ని కాదు. రెండురకాల ద్వంద్వ పద్ధతిలో వేషాలు వేయను. అందరి స్త్రీల వలెనె నీతో  కాపురమే గతియని తలచి నీ పొందు కోరే దానను.
ఒకసారి ఇష్టం చూపించడం, ఇంకొకసారి మచ్చరముతో తిరస్కరించడం చేసి, ఇక్కడా  అక్కడా అని నిన్ను కూడటం నాకు నచ్చదు. శ్రీ వేంకటేశ్వరా! నన్ను కరుణించి చేరదియ్యి. లేకుంటే నీ పై  నా  మక్కువ  ఇలాగే  మరుగున ఉండిపోనీ..

 శ్రీ వేంకటేశుని వలచిన వనితయొక్క నిస్వార్ధమైన  అనురాగం ఎటువంటిదో అన్నమయ్య  ఈ  కీర్తనలో వివరించాడు.

No comments:

Post a Comment