Saturday 10 May 2014

సహజ గమకాల అమర గాయకులు


దక్షిణాది చిత్రసీమలో ఎందరో మహాగాయకులు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మాధుర్యం. అందరిలోకి ప్రత్యేకమైన గాత్ర మాధుర్యం స్వర్గీయ శ్రీమతి భానుమతిరామక్రిష్ణ గారిది. ఆమె గాత్రం లో సహజమైన గమకాలూ, సంగతులు పలుకుతాయి.  ఎందరో గాయకులు ఎన్నో సంగతులను, గమకములను అభ్యసించి పలికిస్తారు. కాని  భానుమతిగారు మాత్రం అతి సునాయాసంగా తన గాత్రంలో ఎంత  కష్టమైన సంగతి అయినా అలవోకగా  పలికించే వారు.  ఆమె గళం లో ఆ విరుపులు ఆ వంపులు అతి సహజంగా ఉట్టిపడతాయి . అది ఆమెకి భగవంతుడు ఇచ్చిన వరం. అంత మధురమైన, శాస్త్రీయమైన గానం విని ఆనందించగలగడం మన అదృష్టం. వేరవ్వరూ ఆమె గాత్రాన్ని అనుకరించ లేరు. ఆమెకే సొంతమైన ఆ గమకాలూ, సంగతులు మరెవ్వరూ పలికించలేరు.

అలాగే ఉత్తరాదిన స్వర్గీయ  మన్నాడే గారి గాత్రంలో  కూడా  ఓ ప్రత్యేకత ఉంది.  ఆయన  గళంలో కూడా సహజమైన గమకాలు, సంగతులు జాలువారుతాయి.  ఉదాహరణకి “ సుర్ నా సజే క్యా గావున్ మైన్ “ “తుజ్హే సూరజ్ కహూన్ య చందా ” మొదలైన   రసగుళికలు  ఎన్నో! ఎన్నెన్నో !! వీరు హాస్య గీతాలు ఆలపించినా అందులోనూ హాస్యంతోపాటు సుమధురమయిన గమకాలు పలుకుతుంటాయి.

 https://www.youtube.com/watch?v=vZhJIBxK35E&hd=1
http://www.youtube.com/watch?v=hpVvfPKyjLM&hd=1

భానుమతి గారికి, మన్నాడే గారికి  గమకాలూ సంగతులు పలికించడము లోనూ  చాలా సారూప్యత గోచరిస్తుంది . వీరిరువురూ సినీ రంగంలో  కాకుండా శాస్త్రీయ సంగీత  ప్రపంచానికే అంకితమయివుంటే  మరో ఇద్దరు గొప్ప శాస్త్రీయ సంగీత  మహా కళాకారులుగా,   భారతదేశ రత్నాలుగా పేరు గాంచేవారు. అంతటి గొప్పవారు మళ్ళీ జన్మించి ఆ గానామృతాన్ని పంచుతారన్న ఆశ లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన గాయకుల్ని ఆ అమరులు వదిలిపెట్టరు.

  

No comments:

Post a Comment