ఈ వారం అన్నమయ్య కీర్తన.
వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి
భారత రామయణాలై పరగె నీ కధలు ॥
భువిమీద రావణుడు పుట్టగాగా రాముడవై
తవిలి ఇందరికి బ్రత్యక్షమైతివి,’
వివరింప నంతవాడు వెలసితేగా నీవు
అవతార మందితే నిన్నందరును జూతురు ॥
రమణ గంసాది యసురలు లూటి సేయగాగా
తమి గృష్ణావతార మిందరి కైతివి,
గములై ఇంతటి వారు గలిగితేగా నీవు నేడు
అమర జనించి మాటలాడుదు విందరితో. ॥
ఎంత ఉపకారియో హిరణ్య కశిపుడు
చెంత నరసింహుడని సేవ ఇచ్చెను,
ఇంతట శ్రీ వేంకటేశ ఇన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని బ్రతికితి మిదివో ॥
భావ మాథుర్యం..
ఈ కీర్తనలో అన్నమయ్య పాపాత్ములను, రాక్షసులను కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు భూమి మీదకు రాబట్టేగా పరమాత్ముడు వాళ్ళను సంహరించడం కోసం వివిద రూపాలలొ అవతరించి, జనులనందరినీ కటాక్షించాడు. ఇదీ అన్నమయ్య అంటే..
ఓ పరమాత్మా! నిన్ను భూమి మీద అవతరింపజేసేలా చేసిన వారిదే పుణ్యము. అందుమూలముగా నీ కథలు బారత రామాయణాలుగా ప్రసిధ్ధి చెందాయి.
ఈ భూమి మీద రావణుడు పుట్టబట్టి ఆనిని సంహరించుటకు నీవు శ్రీరాముడిగా అవతరించితివి. వివరంగా చెప్పాలంటే అంతటివాడు జన్మించబట్టే నీవు అవతరమెత్తితివి. నిన్ను అందరూ దర్శించుకొనే భాగ్యం కలిగింది.
శ్రీ రమణా! కంసాది అసురులు మానవులను దోపిడీచేయబూనగా, నీవు కృష్ణావతారమెత్తితివి. పాపాత్ములైన వారు జనించబట్టేగా నీవు భూమీద జన్మించి అందరితో మాటలాడేవు. మంతనాలాడేవు.
ఇంక హిరణ్యకశిపుడు ఎంత ఉపకారము చేసినాడొ.. అతను కోరిన వింత వరము వల్ల అద్భుతమైన నరసింహావతార మెత్తితివి. నీ సేవ చేసుకొనే భాగ్యం మాకు కల్పించితివి. శ్రీ వేంకటేశా ఇన్ని రూపులూ నీవే. నిన్నే శరణని మేమందరమూ బ్రతుకుతున్నాము.