Saturday 28 December 2019

అందుకే సుమ్మీ నే జేసే ఆచారాలు - అన్నమయ్య కీర్తన.


ఈ వారం అన్నమయ్య కీర్తన.


అందుకే సుమ్మీ నే జేసే అచారాలు దైవమా!
నిందవాయ నా మనసు నాపై నిలుపవె..

బట్టబయట దోలితేను బందెమేయు బసురము
పట్టి మేపితేను తన పనులు సేయు,
ఇట్టె వదిలితేను ఎందైనా బారు మనసు
కట్టుక నేమస్తుడైతే కైవసమై యుండును.

బండి దప్పితే బంట్లు పరదేశు లౌదురు
యెడయక కూడుకొంటే హితు లౌదురు,
విడిచితే ఇటులనే కడకు బారు మనసు
ఒడలిలో నణచితే ఒద్దికై ఉండును.

చే వదలితే పెంచిన చిలుకైన మేడలెక్కు
రావించి గూట పెట్టితే రామా యనును,
భావించకుండితే ఇట్టె పారునెందైనా మనసు
శ్రీ వేంకటేశు గొలిచితే చేతజిక్కి ఉండును.

భావముః    ఈ కీర్తనలో అన్నమయ్య మనసును నిగ్రహించుకుని పరమాత్ముని మీదకు ఏ విధంగా మళ్ళించుకోవాలో   విశదీకరించాడు.

ఓ దైవమా! చంచలమైన నా మనస్సు ఎన్నో నిందలపాలై ఉన్నది. నీవు కరుణించి నీపై నామనస్సు నిలబడేలా చెయ్యి. అందుకే సుమా ఈ ఆచారాలన్ని నేను పాటిస్తున్నాను.

పశువును బట్టబయటకు దోలిన పైరు మేసి బందులదోడ్డి పాలబడి బందీ అగును. అదే మన ఇంటిలో పట్టి ఉంచి మేపితే  మనకు  అవసరమైన పనులు చేయును. అట్లే మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడితే దాని ఇష్టమువచ్చినట్లు తిరిగి, తిరిగి చెడిపోవును. అట్లు వదలక నియమము గల వాడు మనస్సును నిగ్రహించుకొనినచో స్వాధీనమై ఉండును.
కట్టుబాటు తప్పించి వదిలిపెట్టినచో సేవకులు పరదేశులై విచ్చలవిడిగా సంచరింతురు. వారిని అదుపులో పెట్టుకుని, వారితో హితముగా సంచరిస్తే సనిహితులై సేవలు చేయుదురు.ఇట్లే విడిచిపెట్టినచో మనస్సు కూడా మన మాట వినదు. తనలోనే నిగ్రహించినచో చెప్పిన మాట వినును.

తాను ముద్దుగా పెంచుకొన్న చిలుకైనను చేయి వదిలినచో ఎగిరిపోయి మేడలేక్కి, చెట్లెక్కి తిరుగాడును. చేరదీసి పంజరములో నుంచిన మనము చెప్పినట్లు రామా! రామా! అనును. అట్లే భగవంతునిపై మనస్సును నిలపకున్నచో, ఇటు అటూ పరుగులు పెట్టును.   శ్రీవేంకటేశుని పై మనస్సును నిలిపి ధ్యానించినచో స్వాధీనమై మేలు గూర్చును.

Saturday 21 December 2019

నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే - అన్నమయ్య కీర్తన.

ఈ వారం అన్నమయ్య కీర్తన.
కీర్తన:
పల్లవి: నారాయణుడ! నీ నామము మంత్రించి వేసి
పారేటి ఈ జీవుల భ్రమ విడిపించవే ॥పల్లవి॥
చ.1 మదనభూతము సోకి మగువలు బురుషులు
అదన విరిదలలై యంగమొలలై
పెదవి నెత్తురు వీర్చి పెనుగోళ్ళ జించుకొంటా
కొదలు కుత్తికలను గూసేరు జీవులు ॥ పారేటి ॥
చ.2 పంచభూతములు సోకి భ్రమసి యజ్ఞానులై
పొంచి హేయములు మన్నుబూసు కొంటాను
అంచెల వీడెపురస మందునిందు గిరియుచు
యెంచి ధనము పిశాచాలిట్లైరి జీవులు ॥ పారేటి ॥
చ. 3 తమితోడ మాయాభూతము సోకి బహుజాతి
యెముకలు దోలు నరాలిరవు చేసి
నెమకి శ్రీవేంకటేశ నిన్ను జేర కెక్కడైన
తాము దా మెరగరింతటా జూడు జీవులు
(రాగం: సామంతం; ఆ.సం. సం.3; 286 వ రేకు; కీ.సం.494)
విశ్లేషణ:
ఓ శ్రీవేంకటేశ్వరా! ఒక్కసారి నీ నారాయణ మంత్రాన్ని మంత్రించి జీవులపై వదలినట్లైతే జీవన వ్యాపారాలలో, అనేక మోహాలలో, అనేక అనవసర వ్యాసంగాలతో ఉండే మనుష్యులు తమ తమ భ్రమలను వీడి నీశరణు వేడి కైవల్యం పొందరా! కానివ్వండి…. నారాయణమంత్రరాజాన్ని వదలండి అని జీవులజీవితోద్ధరణకై అన్నమయ్య స్వామిని శరణువేడి ప్రార్ధిస్తున్నాడు
.
ఓ శ్రీనివాసుడా! ఈ జీవులకు మదనభూతం సోకింది. తత్కారణంగా పురుషులు, స్త్రీలు వివశులై విచక్షణ నశించి దిగంబరులై, పెదవులలో రక్తము చిమ్మే దాకా, గోళ్ళతో శరీరంపై గోట్లు పడేదాకా రక్కుకుంటూ, అతిశయించిన మదనోత్సాహంతో అవతలి వారి కుత్తుకలు తెగే వరకూ తెగిస్తున్నారు. దంతక్షతాలు నఖక్షతాలు అనే శృంగార క్రీడ బరితెగించినదని, బజారున పడిందని..వాపోతూ… నిరశిస్తున్నాడు అన్నమయ్య. ఎంత ఘోరం! ఎంత దారుణం! ఎంత దౌర్భాగ్య స్థితి.
ఓ పరంధామా! ఈ సృష్టిలోని పంచభూతములు వీరిని పూర్తిగా వశపరచుకొన్నవి. బయటపడలేని భ్రమలలో మునిగి కన్నుమిన్ను గానక కొట్టుమిట్టాడుతున్నారు. ఎంత హేయమో చూసారా! ఒడలికి మట్టిని పూసుకుని వెర్రి ఆనందంపొందేవాడు ఒకడు. తాంబూల సేవనమే ముఖ్యం అని తలుస్తూ ఆ రసాస్వాదనే జీవిత పరమార్ధం అనుకునేవారు మరికొందరు. జీవులందరికీ ధనపిశాచము పట్టింది. ఉఛ్చనీచాలు పుడమిలో నశించాయి. ధనసంపాదనకు ఏపనికైనా సిద్ధపడుతున్నారు. ఇక మీరు నారాయణ మంత్రం వదలవలసినదే!
ఓ పరాత్పరా! పరంధామా! విపరీతమైన ధనదాహం, కామదాహం కారణంగా జీవులకు మాయా భూతం సోకింది. తద్వారా “తానెవరో!” తెలిసికోలేని స్థితికి దిగజారాడు. నేను అంటే ఎముకలు…తోలు… ఇదే… ఇదే నాజాతి…ఇదే నేనంటే అనే భ్రమ సోకింది. ప్రతిజీవి పరమాత్మ స్వరూపమనే విషయం విస్మరణకు గురి అయినది. అందువల్ల అరిషడ్వర్గాల వలలో చిక్కాడు. జననమరణ చక్రంలో పడి తిరుగుతున్నాడు. వేల సంవత్సరాలు ఇదే తంతు కొనసాగుతోంది. దీని నుంచి “నారాయణ మంత్రం” ప్రసాదించి జీవులను బయటపడవేయ వలసినదిగా ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.
భావం..శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు.

Friday 13 December 2019

వేదన.

వేదన.
జననం వేదన మరణం వేదన
జనన మరణాల మధ్య నలిగే జీవనం వేదన.
బాల్యంలో పాఠశాల చదువులు వేదన
కౌమార్యంలో అమ్మ చెప్పిన బుధ్ధులు విని వేదన
యవ్వనంలో జీవిత భాగస్వామి కోసం ఆరాటంలో వేదన
సంసారసాగరంలో మునిగితేలుతూ
పిల్లల బవితవ్యం కోసం వేదన.
రెక్కలొచ్చి పిల్లలు ఖండాంతరాలకి ఎగిరిపోతే,
వారి రాకకోసం నిరీక్షణలో వేదన.
చరమాంకంలో మృత్యువుకోసం ఎదురుచూపులలో వేదన.

ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు..


ఈ వారం అన్నమయ్య కీర్తన. 


ఎంచి చూచితే ఇతనికెవ్వరెదురు
కొంచడేమిటికి వీడె ఘూర నారాసింహుడు.

గక్కన అహోబలాన కంబములోన వెడలి
ఉక్కుమీరి హిరణ్యుని నొడిసిపట్టి
చెక్కలువార గోళ్ళ జించి చెండాడినయట్టి
వెక్కసీడు వీడివో వీర నారసింహుడు.

భవనాసి ఏటిదండబాదుకొని కూచుండి
జవళి దైత్య పేగులు జందేలు వేసి
భువియు దివియు ఒక్క పొడవుతో నిండుకొని
తివురుచున్నాడు వీడె దివ్య నారసింహుడు.

కదిసి శ్రీసతి గూడి గద్దెమీద గూచుండి
యెదుట ప్రహ్లాదుడు చేయెత్తి మొక్కగా
అదన శ్రీ వేంకటాద్రినందరికి వరాలిచ్చి
సదరమైనాడు వీడె శాంత నారసింహుడు.

భావం..
ఈ కీర్తనలో నరసింహస్వామి ప్రతాపాన్ని, గొప్పదనాన్ని వర్ణిస్తున్నాడు అన్నమయ్య.
ఎంచి చూడగా ఈతని కెవ్వరు ఎదురు రాగలరు ఈతనికితనే సాటి అయిన ఘోర నారసింహుడు.
అహోబలక్షేత్రం లో కంబములోనించి వెలికి వచ్చి, అతి బలవంతుడైన హిరణ్యకశిపుని వొడిసి పట్టుకొని,  తన వాడియన గోళ్ళతో చీల్చి చెండాడి సాటిలేనటువంటి వీరనారసింహుడితడు.
భవనాసి ఏటి తీరాన తనభుజబలం చూపిస్తూ కూర్చుని ఆ రాక్షసుని పేగులు జందేలుగా వేసుకొని, భూమి ఆకాసం ఒక్కటే పొడవుగా నిండి తిరుగుచున్న దివ్య నారసింహుడితడు.
సమీపాన శ్రీసతితో కలసి గద్దెమీద కూర్చొని, ఎదురుగా ప్రహ్లదుడు చేయెత్తి మొక్కుతుండగా, శ్రీవెంకటాద్రిమీద కొలువై యుండి అందరికీ వరాలిచ్చే తేలికపడ్డ వాడైన శాంత నారసింహుడితడు.

Tuesday 10 December 2019

అందం


మగువ  అందం.

మనసు దోచిన మగువ అందమే అందం
రసజ్ఞుల హృదయలలో రాగాలను పలికించిన కడు రమ్యమైన అందం
అసమాన సౌందర్య రాశివని వేనోళ్ళ పొగడ్తలందుకున్న అందం
ఆమె ప్రతి కదలికా అందమే, ప్రతి భంగిమా అందమే
అందానికి అందం నువ్వేనని ప్రశంశలు అందుకున్న అందం
ఆమె రాసిన రాత అందం, ఆమె గీసిన గీత అందం
ఆధునికాలంకరణలో ఆహ్లాదపరచే అందం
మనసుపైన మత్తుజల్లి ఆనందలోకాల విహరింపజేసే
                                   అపురూపమైన అందం
అభినందనల వెల్లువలో తడిసి ముద్దయిన అందం.
వన్నె తగ్గినా అభిమానుల అంతరంగాలలో
                                  స్థిరనివాసమైన అందం.

మహిళ


మహిళ


అలనాడు అత్తవారింట్లో అత్త, ఆడపడుచుల సాధింపులతో,
వేధింపులతో దుఃఖాన్ని దిగమింగి కాపురాలు చేసే కోడళ్ళు.
వ్యసనపరుడైన భర్తకి అహోరాత్రాలు చాకిరీ చేసి,
అతని రుసరుసలకు బదులుచెప్పలేక బ్రతుకునీడ్చే భార్యలు.
వరకట్నపిశాచి కరకు కోరల మధ్య నలిగిపోయి,
సజీవదహనమయిన నవ వధువులు.
ఆడపిల్లను కన్నందుకు అత్తవారింట్లో అవమానభారంతో
దుఃఖితులైన మాతృమూర్తులు.
మారిన కాలంలో జీవనయానం సాగించుటకు
వీధిలోకి అడుగుపెట్టిన మహిళలు.
సంస్కారహీనులైన సహోద్యోగుల వెకిలి సకిలింపులకు
హేయమైన చూపులకు విసిగి వేసారిన ఉద్యోగినులు.
కళాశాలలో ప్రేమోన్మాదుల చేతులలోరసాయనిక దాడులకు
బలియై భవిష్యత్తును కోల్పోయిన విద్యార్ధినులు
ఈ నాడు చిన్నా పెద్దా తారతమ్యం లేక,
మానభంగాలకూ, దారుణ హత్యలకూ గురై
ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న అభాగినులూ..
ఇంకెప్పుడు స్త్రీకి స్వేచ్ఛ? రక్షణ? నిశ్చింత?


Friday 6 December 2019

సువ్వి సువ్వి సువ్వలమ్మ | నవ్వుచు దేవకి నందనుగనియె - అన్నమయ్య కీర్తన


ఈ వారం అన్నమయ్య కీర్తన
సువ్వి సువ్వి సువ్వలమ్మ | నవ్వుచు దేవకి నందనుగనియె ||

|| శశివొడచె అలసంబులు గడచె |
దిశల దేవతల దిగుళ్ళు విడిచె ||

|| కావిరి విరిసి కంసుడు గినిసె |
వావిరిబువ్వుల వానలు గురిసె ||

|| గతిసేనే అటు గాడిదలు గూసె |
కుతిల కుడిచి జనకుడు నోరుమూసె ||

|| గగురు పొడిచె లోకము విధి విడిచె |
మొగులు గురియగ యమునపై నడచె ||

|| కలిజారె వెంకటపతి మీరె |
అలుమేల్మంగ నాచారలుకలు దీరె ||

దెవకీదేవి నవ్వుచూ కొడుకుని కన్నది, అని బియ్యం దంచుతూ ఆడువారు సువ్వి సువ్వి అనే ఊత పదాన్ని పాడుకుంటూ దంచుతున్నారు.

అష్టమినాడు చంద్రుడుదయించాడు. కష్టాలన్నీ తీరిపోయాయి. దేవతలందరూ విచారం విడిచారు.

నల్లని పొగఅంటి చీకటి కమ్ముకుంది. కంసుడు కోపగించుకున్నాడు. వావిలపూల వానలు కురిశాయి.

వసుదేవుడు రేపల్లెకి వెళ్ళే మార్గంలో గాడిద కూసింది. భయపడి దాని నోరు మూసాడు.

రోమాలు నిక్కబొడిచాయి. లోకం గతితప్పినట్లయింది. మేఘాలు వర్షిస్తుండగా యమున నదిపై నడిచాడు.



కాలం ద్వాపరయుగం దాటి కలియుగంలోకి చేరింది. వేంకటేశ్వరుడుగా వచ్చాడు. ఇక అలిమేలుమంగకు, నాంచారుకూ కోపాలు తీరాయి.

Monday 2 December 2019

Dwarka of Lord Krishna Mystery in Telugu |Sri krishna Dwaraka found in d...

అంతా రామమయం.

*అంతా రామమయం; మన బతుకంతా రామమయం.*
💥💥💥💥💥💥💥💥💥💥
*ఒక దేశానికి , జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి . మనకు అలాంటిది రామాయణం . ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు . మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు . మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం రాముడు .*
*ధర్మం పోత పోస్తే రాముడు . ఆదర్శాలు రూపుకడితే రాముడు . అందం పోగుపోస్తే రాముడు . ఆనందం నడిస్తే రాముడు . వేదోపనిషత్తులకు అర్థం రాముడు . మంత్రమూర్తి రాముడు . పరబ్రహ్మం రాముడు . లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు .*
*ఎప్పటి త్రేతా యుగ రాముడు ? ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ? అయినా మన మాటల్లో , చేతల్లో , ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే .*
*చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట – శ్రీరామరక్ష సర్వజగద్రక్ష . బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట – రమాలాలి – మేఘశ్యామా లాలి . మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు – శ్రీరామ రక్ష – సర్వ జగద్రక్ష . మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట – అయ్యో రామా . వినకూడని మాట వింటే అనాల్సిన మాట – రామ రామ .*
*భరించలేని కష్టానికి పర్యాయపదం – రాముడి కష్టం . తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే – రాముడు . కష్టం గట్టెక్కే తారక మంత్రం – శ్రీరామ . విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట – శ్రీరామ శ్రీరామ శ్రీరామ . అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట – అన్నమో రామచంద్రా ! వయసుడిగిన వేళ అనాల్సిన మాట – కృష్ణా రామా !*
*తిరుగులేని మాటకు – రామబాణం . సకల సుఖశాంతులకు – రామరాజ్యం . ఆదర్శమయిన పాలనకు – రాముడి పాలన . ఆజానుబాహుడి పోలికకు – రాముడు . అన్నిప్రాణులను సమంగా చూసేవాడు – రాముడు .*
*రాముడు ఎప్పుడు మంచి బాలుడే . చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా – రామా కిల్డ్ రావణ ; రావణ వాజ్ కిల్డ్ బై రామా .*
*ఆదర్శ దాంపత్యానికి – సీతారాములు . గొప్ప కొడుకు – రాముడు . అన్నదమ్ముల అనుబంధానికి – రామలక్ష్మణులు . గొప్ప విద్యార్ధి – రాముడు(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) . మంచి మిత్రుడు – రాముడు(గుహుడు చెప్పాడు ). మంచి స్వామి రాముడు (హనుమ చెప్పారు ). సంగీత సారం రాముడు (రామదాసు , త్యాగయ్య చెప్పారు ). నాలుకమీదుగా తాగాల్సిన నామం రాముడు ( పిబరే రామ రసం – సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు ). కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం – రాముడు . నోరున్నందుకు పలకాల్సిన నామం – రాముడు . చెవులున్నందుకు వినాల్సిన కథ – రాముడు . చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు – రాముడు . జన్మ తరించడానికి – రాముడు , రాముడు , రాముడు .*
——————–
*రామాయణం పలుకుబళ్లు.*
———-///———-
*మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ , ప్రతిబింబిస్తూ ఉంటుంది . తెలుగులో కూడా అంతే .*
*ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే – రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని అడిగినట్లే ఉంటుంది . చెప్పడానికి వీలుకాకపోతే – అబ్బో అదొక రామాయణం . జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే – సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ . ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే – అదొక పుష్పకవిమానం . కబళించే చేతులు , చేష్ఠలు కబంధ హస్తాలు . వికారంగా ఉంటే – శూర్పణఖ . చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ). పెద్ద పెద్ద అడుగులు వేస్తే – అంగదుడి అంగలు .* *మెలకువలేని నిద్ర – కుంభకర్ణ నిద్ర . పెద్ద ఇల్లు – లంకంత ఇల్లు . ఎంగిలిచేసి పెడితే – శబరి . ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే – ఋష్యశృంగుడు .అల్లరి మూకలకు నిలయం – కిష్కింధ కాండ . విషమ పరీక్షలన్నీ మనకు రోజూ – అగ్ని పరీక్షలే . పితూరీలు చెప్పేవారందరూ – మంథరలే . యుద్ధమంటే – రామరావణ యుద్ధమే . ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ – రావణ కాష్ఠాలే .)కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం ).*
*సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు .బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు . ఒక ఊళ్లో పడుకుని ఉంటారు . ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు . ఒంటిమిట్టది ఒక కథ . భద్రాద్రిది ఒక కథ . అసలు రామాయణమే మన కథ . అది రాస్తే రామాయణం – చెబితే మహా భారతం .*

(వట్సాప్ నుండి సెకరణ)

Saturday 23 November 2019

అల్లరి.

Meeraj Fathima
అల్లరి
అలసిపోయి ఇంటికొస్తానా..
అలిగి ఏ మూలో నక్కి ఉంటావ్.
.
అన్నం తినననే నీ మంకుపట్టూ,
అందరూ తిట్టారనే నీ కంప్లైంటూ..,
.
హడావిడిగా ఉండే నా పని వేళలూ..,
నా గది ముందు తచ్చాడే నీ అడుగులూ..,
.
స్నానం చేయననీ, మంచం దిగననీ.. నీ మొరాయింపూ,
వీది, వీధంతా నీమాట వినలేదనే నీ దబాయింపూ,
.
జేబులోని చిల్లరంతా నీదేననే గద్దింపూ ..,
వీధి చివరి దుకాణం వరకూ తీసుకెళ్ళమనే అర్దింపూ..,
.
నిన్నుతప్ప ఇంకెవరినీ దగ్గర తీయరాదనే మొండితనం,
నన్ను ఒక్కఅంగుళం కూడా కదలనివ్వని నీ పంతం.
.
నీ చుట్టూ ఇందరున్నా..ఎవ్వరూ లేరనుకొనే ఒంటరితనం,
సంతానాన్ని మాత్రమే గుర్తించే అమ్మతనం.
.
( వయస్సు మీదపడి మతిలేని ఎందరో తల్లులు చేసే అల్లరే ఇది,
మన అల్లరిని ముద్దుగా భరించిన వారి అల్లరిని బాధ్యతగా భరిద్దాం

అమ్మేదోకటియు అసీమలోనిదొకటి


ఈ వారం అన్నమయ్య కీర్తన.

అమ్మేదొకటియు అసీమలోనిదొకటి
ఇమ్ములమా గుణములు యెంచ చోటేదయ్యా!        !!

ఎప్పుడు నేము చూచిన నింద్రియ కింకరులము
ఇప్పుడు నీ కింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకుదాస్యము నేము సేసేము
చెప్పి నీ దాసుల సిగ్గుగాదా మాకు                     !!

పడతులకెప్పుడును పరతంత్రులము నేము
పడి నీ పరతంత్ర భావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతియించే అందుకును           !!

తనువు లంపటాలకు తగ మీదెత్తితి మిదె
వొనరి నీ ఊడిగాన కొదిగే దెట్టు
ననచి శ్రీవేంకటేశ నాడే నీకు శరణంటి
వెనకముందెంచక నీవె కావవయ్యా!                    !!

భావం..

మనం కానిది మనమని చూపెట్టుకునేందుకు మనం పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి దైన్యం నుంచి మనం బయటపడాలంటె ఆ దేవదేవుడిని శరణు వేడుకోవాలి. మనలోని కపటత్వాన్ని కడిగివేయమని ఆ పరమాత్మని వేడుకోవాలి. అలాంటి భావనతోనే ఈ భగవతోత్తముడు ఈ కీర్తనను రచించాడు.

ఓ వేంకటేశ్వరా! మా గుణాలను విశ్లేషించే ప్రయత్నం చేయకయ్యా! మేము మూటలోనున్నవి ఒకరకమైతే, ముందు మరోరకం వస్తువులు పెట్టి ఆకర్షిస్తున్న కపట వ్యాపారస్తుల్లాంటివాళ్ళం . ఇది నీకు తెలియనిది కాదు.

మేమెప్పుడూ ఇంద్రియాలకు బానిసలము. ఇంద్రియాలకు యజమానులుగా ఉండవలసిన మేము, వాటికి బానిసలుగా మారిపోతున్నాము. అవి మన అధీనంలో ఉండవలసినది పోయి  మేమే వాటి అధీనంలోకి వెళ్ళిపోతున్నాము. ధనానికే దాస్యం చేస్తూ, నీ దాస్యాన్ని విస్మరిస్తున్నాము. నీ దాసులమని చెప్పుకుందుకి సిగ్గుపడుతున్నామయ్యా!

స్త్రీవ్యామోహంతో చిత్తచాంచల్యము కల మాకు నీగురించి ఆలోచన ఏది? జిహ్వచాపల్యంతో తపించే నాలుకకు నిన్ను నుతీంచే అవకాశమేది? ఈ చాపల్యం నీ నామస్మరణకు దూరం చేస్తూంది.

ఈ తనువు లంపటాల్లో చిక్కుకున్న మేము నీకు ఊడిగం చేస్తూ ఎప్పటికి తరించగలము? శ్రీవేంకటేశా!  నిన్నే శరణన్న మమ్మల్ని ముందువెనుకలు ఆలోచించక కాచుకోమని ఆర్ద్రతో అన్నమయ్య వేడుకొంటున్నాడు.

Wednesday 20 November 2019

అన్నమయ్య అందరివాడు.

పదకవితామహుడైన అన్నమయ్యను మావాడంటారు సాహితీమూర్తులు.వాగ్గేయకారుడు కనుక మావాడంటుంది కర్ణాటక సంగీతలోకం.లలితమైన పదాలతో శృంగారాన్ని ఒలికించాడు కనుక మావాడంటారు సినీ,లలితసంగీత కళాకారులు.జనపదాలు పాడిన అన్నమయ్య మావాడంటారు జానపదులు.తత్వబోధ చేశాడు కనుక మావాడంటారు వేదాంతులు.రామానుజ సిద్ధాంత మతప్రచారకుడు కనుక మావాడంటారు శ్రీవైష్ణవులు.సర్వమానవ సమానత్వాన్ని చాటాడు కనుక మావాడంటారు సంఘసంస్కర్తలు.మధురభక్తిలో తనిసి,తరించినవాడు కనుక మావాడంటారు భక్తజనం...
అయితే,నాఉద్దేశ్యంలో అన్నమయ్య అందరివాడు.ఆయన రచనలలోని వైవిధ్యం,మరి యే కవిలోనూ కానరాదు.వేలకొలదీ సంకీర్తనలలో ప్రతి ఒక్కటీ ఒక ఆణిముత్యమే...ఆలోచనామృతమే.
నా అనుభవంలో అన్నమయ్య సంకీర్తనల పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించటం,'కత్తిమీద సాము' వంటిది.'అలరులు కురియగ' కృతిని రాగ,స్వరసహితంగా శుద్ధ శాస్త్రీయపద్ధతిలో ఒకరు పాడతారు.'ఏమొకో చిగురుటధరమున' అంటూ భావబంధురంగా లలితంగా మరొకరు ఆలపిస్తారు.'తందనానా ఆహి' అంటూ జానపద ఫక్కీలో మరొకరు గానంచేస్తారు..వీరిలో అందరికీ సమానంగా హర్షధ్వానాలిస్తారు శ్రోతలు..అయితే గాయకులు ఎంచుకొన్న ఆ కీర్తనలు వారు పాడిన బాణీలో కాక,మరొకరకంగా పాడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించండి..దేనికదే ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి.వీటిలో దేనికి ప్రథమ బహుమతి ఇవ్వాలి? అనేది సదా ప్రశ్నార్థకమే..
అది అన్నమయ్య పదంలో ఉన్న విలక్షణత!
అన్నమయ్య సాహిత్యమయితే రాగిరేకులలో నిక్షిప్తం చేయబడటంచేత లభ్యమైంది కానీ స్వరమెట్లు లేకపోవటం చేత,ఎవరికి నచ్చిన బాణీలో వారు స్వరపరచుకొని, పాడుకుంటున్నారు.అలాగని అన్నమయ్య కీర్తనలు స్వరపరచటానికి అందరికీ అర్హత ఉంది అనవచ్చా?కనీస రాగ,తాళ,భాషా పరిజ్ఞానం లేకుండా వాటిని స్వరపరచవచ్చా?లేదు...అయితే...ఆసాహిత్యాన్ని బాగా మనసుకు పట్టించుకొని,అందులోని అచ్చతెనుగుపదాల అర్థాలను ఆకళింపు చేసుకొని,సంగీత ఛందస్సును పాటిస్తూ,ఆనాటి కాల,మాన పరిస్థితులపై కూడా కొంత అవగాహనతో చేసిన బాణీలు నిలబడుతున్నాయి.లేనివి కాలగర్భంలో కలసిపోతున్నాయి.
ఉదాహరణకు 'అంతర్యామి!అలసితి,సొలసితి' అంటూ ఎంతో నిర్వేదంతో అన్నమయ్య పాడుకొన్న సంకీర్తనను, హుషారెక్కించే 'కుంతలవరాళి' రాగంలో కదంతొక్కించినా,'చక్కని తల్లికి చాంగుభళా' అనే జానపదాన్ని 'నీలాంబరి' వంటి నిద్రపుచ్చేరాగంలో స్వరపరచినా శ్రోతలు మెచ్చగలరా?
అన్నమయ్య సంకీర్తనలను,సంగీత విద్వాంసులే స్వరపరచాలని,వాటిని కచ్చేరీలలో ప్రథానాంశంగా పాడుకొనేట్లు చేయాలనే తలంపు సైతం సరికాదు.అన్నీ అందుకు వీలు పడవు.
అనేక ఘనమైన రాగాలను మాలికగాచేసి,క్లిష్టమైన తాళంలో కూర్చిన బాణీ కన్నా,సులువుగా అందరూ పాడుకొనే వీలుతో,అరటిపండు ఒలిచిపెట్టిన రీతిగా సాహిత్యం తెలిసేట్లు సరళంగా చేసిన ఒక అన్నమయ్య జోలపాట జనబాహుళ్యంలో ఎక్కువ ప్రచారంలో ఉంది.
రాగమాలికగా బహుళ ప్రసిద్ధమైన అన్నమయ్యకీర్తన 'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన'..బృందావనసారంగ, మాయామాళవగౌళ రాగాలలో స్వరపరచబడింది.నిజానికి అది రాగమాలిక కాదు.రెండు కన్నా ఎక్కువ రాగాలలో కూర్చితేనే అది మాలిక అవుతుంది.ఆకీర్తన నడక,చతురస్ర గతిలో నల్లేరుమీద నడకలా సాగుతుండగా,దానికి విరుద్ధమైన మిశ్రచాపు తాళంలో కూర్చవలసిన ఔచిత్యం ఏమిటి?పైగా.. ఖచ్చితమైన ఛందోనియమాలు పాటించబడిన అన్నమయ్య కీర్తనకు,ఆవిధంగా తాళభేదం చేయటంతో ఛందోభంగం కలగలేదా!
మహావిద్వాంసులైన మంగళంపల్లివారిని ఒక సందర్భంలో అన్నమయ్య గురించి మాట్లాడమంటే, 'అన్నంకోసం పాడుకొనేవాణ్ణి, అన్నమయ్య గురించి ఏమి మాట్లాడగలను?' అన్నారు.అటువంటిది..ఈనాడు అన్నమయ్య కీర్తనలను ధనసముపార్జనకు ఒక సాధనంగా భావించి,అరకొర సంగీత,సాహిత్య జ్ఞానంతో,అన్నమయ్య హృదయాన్ని కొంతైనా తెలుసుకోకుండా కొందరు స్వరపరచి పాడటం,పాడించటం ఆమహావాగ్గేయకార శిరోమణికి అందించే నిజమైన నివాళి అనిపించుకుంటుందా?
ఇక ప్రదర్శన విషయానికొస్తే,అన్నమయ్య కీర్తనాగాన కచేరీలో,స్వరకల్పనాది మనోధర్మ సంగీతాన్ని పాడవద్దని శాసించే నిర్వాహకుల్ని చూశాను నేను.నిజానికి అందుకు అనుకూలమైన కీర్తనలలో,సమర్థులైన గాయకులు,మితిమించని విధంగా ఆలాపన,స్వరకల్పన,నెరవులు వంటివి చేర్చటం వలన శ్రోతలకు కొంత విశ్రాంతి కలగటమేకాక,కళాకారుడి సృజనాత్మకత వెల్లడి అయే అవకాశం ఉంటుంది.రెండు గంటల కచేరీలో మూడు,నాలుగు అంశాలలో ఈవిధమైన మనోధర్మప్రదర్శన చేయటం ఆహ్వానింపపగినదే!
నాకు ఒక సందేహం కలుగుతూ ఉంటుంది.ఎన్నడైనా త్యాగరాజస్వామి,అన్నమయ్య కీర్తన విని ఉంటారా? అవకాశమే లేదు.అయితే ఇద్దరిదీ భక్తి మార్గమే కనుక, వారిరువురి రచనలలోనూ కొండొకచో భావసారూప్యత కనబడుతుంది.ఉదాహరణకు 'అలర చంచలమైన ఆత్మలందుండనీ అలవాటు సేసెనీ ఉయ్యాల!' అని అన్నమయ్య అంటే, 'ఏతావునరా!నిలకడనీకు? ఎంచిజూడగా నగబడవు!' అని త్యాగయ్యగారంటారు.'ఎవరని నిర్ణయించిరిరా?నిన్నెట్లారాధించిరిరా!నరవరులు!' అని త్యాగయ్యగారంటే,'ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు' అంటారు అన్నమయ్య.
ఏది ఏమైనా,తెలుగువారిగా పుట్టటం మన అదృష్టం.అన్నమయ్య మొదలుకొని, మైసూరు వాసుదేవాచార్య వరకూ అందరూ తెలుగులోనే భగవంతుని కీర్తించారు.ఆ కీర్తనలను తనివితీరగా భావించి,పాడుకొనే వరం తెలుగువారి సొత్తు.
అన్నమయ్య సాహిత్యమే అంత గొప్పగా ఉంటే... ఇక ఆయన సంగీతమెంత గొప్పగా ఉండిఉంటుంది?ఆనాడు వాడుకలో ఉన్న రాగాలు పరిమిత సంఖ్యలోనే ఉండేవి కదా!..మరి రాగిరేకులమీద వ్రాసిన విధంగా చూస్తే,ఒకే రాగాన్ని కొన్ని వందల సంకీర్తనలకు ఆయన ఎలా స్వరపరచి పాడుకొని ఉంటారు? ఊహకు అందని విషయమది!..
అందుకే...అందరం 'అన్నమయ్యా!నీకు వందన మన్నామయ్యా!' అనవలసిందే!..
-Modumudi Sudhakar

Friday 15 November 2019

బంగారు తల్లి.


అమ్మొక దారి నాన్నొక దారి వెతుక్కుంటే,
అమ్మమ్మ పంచన చేరిన అమాయకపు బాలిక 
పది వసంతాలలోనే పరిపూర్ణమైన అనుభవం. 
దారి తెన్ను లేని జీవితం,
అంధకారబంధురమైన భవితవ్యం
ఆప్యాయత తప్ప కడుపునింపలేని అమ్మమ్మ పేదరికం
ఫలితం ఆసరా లేని మరొక అమ్మకు, అమ్మమ్మకు దత్తత..
కొత్త ఇంట్లో కొత్త వాతావరణంలో ఇమడలేని నిస్సహాయత.
కాలగమనంలో తొలగిన అరమరికలు, ఉప్పొంగిన ఆప్యాయతలు.
తను లేనిదే అమ్మమ్మకు ఊపిరి లేదు, అమ్మకు నిద్ర రాదు.
అమ్మమ్మకు, అమ్మకు, మావయ్యకు తలలో నాలుక.
అమ్మ బందువులందరూ తన్ను అభిమానించే వారే,
ఒకరు అన్న, ఒకరు వదిన, ఒకరు అక్క, ఇంకొకరు బావ.
ఒకరు చదువు చెప్తే, ఇంకొకరు పాటలు నేర్పితే
ఆడుతూ పాడుతూ సాగే జీవనం.
పాఠశాల వదలి, కళాశాలలో అడుగుపెట్టిన నాడు
రంగుల కలలా కనిపించే జీవితం, అంతలోనే వక్రించిన విధి.
బాధ్యత నెరిగి, చేదోడుగా మసలి విద్యాబుధ్ధులు నేర్చుతున్న చిట్టితల్లిని
కాన్సెర్ మహమ్మారి తన క్రూరమైన కోరలతో కబళించివేసింది.
బంగారుస్వప్నం చెదరిపోయింది.
అమ్మను, అమ్మమ్మనూ అనాథలను చేసి తరలిపోయింది.
అతిథిగావచ్చి అలరించి అందరి మన్ననలను పొంది,
అంతలోనే కనుమరుగయిపోయిన బంగారు తల్లిని మరచేది ఎలా?

Thursday 24 October 2019

అదృష్టం


అదృష్టం అందరినీ వరించదు,
వరించినవారికి సంతృప్తి ఉండదు.
ఇంకా ఏదో కావాలనే తపన.
ఆశనిరశలమధ్య కొట్టుమిట్టాడే మానసం.
చీకటి వెనుక వెలుగే రాదా?
కష్టసుఖాలు ఇంతేకాదా ఆన్నాడో సినీకవి.
చీకటేకానీ వెలుగు పొడచూపదు కొందరి జీవితాలలో..
కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు.
నిర్విరామంగా కృషి చేసినా ఫలితం శూన్యమే!
చెక్కు చెదరని ఆత్మస్థైర్యం కొందరిదైతే,
అన్నీ అమరినా అనుభవించలేని తత్వం కొందరిది.
షడ్రుచుల సమ్మేళనం జీవితం,

Saturday 28 September 2019

అన్నిటి మూలం బతఁడు - అన్నమయ్య కీర్తన.





అన్నమయ్య శ్రీనివాసుని ఘనతను గురించి మనకు వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువే అన్నిటికీ మూలము అని ఎలుగెత్తి చాటుతున్నాడు భక్త హృదయాలకు. ఆ వివరాలను ఈ కీర్తనలో చూద్దాం.
కీర్తన:
పల్లవి: అన్నిటి మూలం బతఁడు
వెన్నుని కంటెను వేల్పులు లేరు || అన్నిటి ||
చ.1. పంచభూతముల ప్రపంచ మూలము
ముంచిన బ్రహ్మము మూలము
పొంచిన జీవుల పుట్టుగు మూలము
యెంచఁగ దైవము యితఁడే కాఁడా || అన్నిటి ||
చ.2. వెనుకొని పొగడేటి వేదాల మూలము
మునుల తపములకు మూలము
ఘనయజ్ఞాదుల కర్మపు మూలము
యెనలేని దైవ మితఁడే కాఁడా || అన్నిటి ||
చ.3. అగపడి సురలకు నమృత మూలము
ముగ్గురు మూర్తులకు మూలము
నగు శ్రీవేంకటనాథుఁడే మూలము
యెగువ లోకపతి యితఁడే కాఁడా || అన్నిటి ||
ఈ సర్వ సృష్టికి మూలస్తంభము శ్రీ వేంకటేశ్వరుడే! శ్రీ మహావిష్ణువుకన్న ఘనమైన దైవమీ యిలలోలేదు. ఆయన శరణు వేడండి. కైవల్యప్రాప్తిని సులభంగా పొందండి అని ఉద్భోదించడం ఈ కీర్తనలోని సారాంశం.
పంచభూతములు అనగా మనిషి ప్రతి అడుగుకూ ఆధారభూతమైన ఈ భూమండలం, మనిషి జన్మించినదాది మరణించే వరకూ ఊపిరినిచ్చే వాయువు, మనిషి దాహాన్ని తీర్చి సేదనిచ్చే నీరు, మనిషిని జీవితాంతం తల్లి గర్భంలా కాపాడే ఆకాశము, జీవించడానికి శక్తినిచ్చే అగ్ని, ఇవన్నీ కూడా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. కానీ ఆ పంచభూతాలకు మూలము శ్రీనివాసుడు. ఆయనే చతుర్ముఖుడైన బ్రహ్మ, సృష్టికి మూలమైన వానికి కూడా మూలమితడే. ఇతని యందే ఆ బ్రహ్మ జన్మించాడు. మరి మనము నిత్యము నిరతము తలచవలసినవాడు శ్రీమహావిష్ణువే కదా! అన్య చింతనలెందుకు? ఆయన్ను సదా సేవించి ముక్తులవండి అంటున్నాడు అన్నమయ్య.
చతుర్వేదముల ఘనతను మనకు తెలిపి వేద విహారుడై ఆ వేదాలలో విహరించే మహావిష్ణువితడే! సర్వ ముని, ఋషి జన సమూహములకు మూలమితడే! సమస్త సృష్టి ఇతని వలననే జనియించి లయిస్తున్నది. యజ్ఞ యాగాదులకు కర్త కర్మ క్రియ ఇతడే! ఈ యజ్ఞకర్తకు మించిన దైవము ఈ సృష్టిలో మరొకడు గలడా! అన్నిటికీ ఆది, అంత్యము యితడే! శరణు శరణని పాప పంకిలాన్ని పటాపంచలు గావించుకొనండి అంటున్నాడు అన్నమయ్య.
ఒకనాడు క్షీరసాగర మధనంలో శ్రీమహావిష్ణువు సురాసురులకు మోహినిగా అగుపించి సురలకు అమృతపానం గావించిన ఘనమైన దేవుడు శ్రీమహావిష్ణువే కదా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్న భేదం లేక ముగ్గురికీ మూలమైన మూలపురుషుడు ఈ మహావిష్ణువే కదా! ఏడు ఊర్ధ్వలోకములైన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకములకు అధిపతి యితడే కదా! ఈతని మించిన దైవము ఈ చతుర్దశభువనములలో లేడు. ఆయన పదకమలాలను పట్టుకొని సేవించి సుగతులను పొందండి అని మనకు సందేశమిస్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య.
విశ్లేషణ : శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో

Friday 27 September 2019

ఎదుటనే ఉండగాను యెడమాటలేమిటికే - అన్నమయ్య కీర్తన



ఎదుటనే ఉండగాను యెడమాటలేమిటికే
కదిసి పెనుగులాడే కలయికలే మేలే.. !!
మచ్చికలు నెరపితే మనసులేకము లౌను
ఇచ్చకము తెచ్చితేనే ఇంపులు పుట్టు
ముచ్చటలు గలిసితే ముదురు నడియాసలు
మెచ్చులుగా బతితోడి మేలములే మేలే. !!
నగవు లుప్పతిలితే ననుపులు సమకూడు
మొగమోట గలిగితే మొనయు దమి
తగులాయా లొనరితే దట్టమౌను వలపులు
మగవానితో మంచిమాటలే మేలే !!
చూపులు తారసించితే సొంపులు మిక్కుటమౌను
కాపురాలు దొరకితే గట్టియౌ బొందు
పైపై నీమీది బత్తి బాయక నన్నేలినాడు
చేపట్టి శ్రీవేంకటేశు సేవలే మేలే.
భావ మాధుర్యం:
దాంపత్య జీవితం ఎలా ఉండాలో ఈ కీర్తనలో వివరించాడు అన్నమయ్య. ఓ దేవీ ! ఆలుమగలు కలిసి జీవిస్తుంటే వాళ్ళ మధ్య దూరం పెంచే మాటలు ఎందుకమ్మా..? పోట్లాట తరువాత కలయిక ఎంత మధురమో తెలుసా?
అనుకూలత చూపిస్తే మనసులు కలుస్తాయి. ఒకరిపైఒకరు ప్రీతి తెచ్చుకుంటేనే ఇష్టం కలుగుతుంది. నీ మాటలు కలిస్తే ఆశలు చిగుళ్ళు తొడుగుతాయి. ముంగిలా ఉండేకంటే పతితో సరసాలాడితేనే బాగుంటుంది.
నవ్వుతూ సంభాషిస్తే అనురాగములు అతిశయిస్తాయి. మొగమోటము కలిగితే ఆపేక్షలు పెరుగుతాయి. అనురాగం మీ మధ్య ఉంటేనే వలపు వృధ్ధిచెందుతుంది. భర్తతో ఏదైనా మంచి మాటలే మాట్లాడాలి.
చూపులతో చూపులు కలుపుతూ మాట్లాడుకోవాలి. కాపురాలు చేస్తుంటేనే భార్యాభర్తల మధ్య కూటములు కలుగుతాయి. మీమీద ఎంతో భక్తి, ప్రేమా ఉన్నా నా భక్తిని చూసి నన్నూ అనుగ్రహించాడమ్మా శ్రీవేంకటేశుడు. ఆ శ్రీవేంకటేశుని సేవలే అన్నిటా మేలు.
(భావమాధుర్యం : శ్రీ అమరవాది శుభ్రహ్మణ్య దీక్షితులు గారి సౌజన్యంతో)

Sunday 22 September 2019

ఆతడే ఇన్నియును నిచ్చు. అన్నమయ్య కీర్తన.


21..9..19..ఈ వారం అన్నమయ్య కీర్తన.

ప. ఆతడే ఇన్నియును నిచ్చు నడిగిన వల్లాను
    చేతిలోనే ఉండగాను చింతించరు హరిని.            !!

చ.  వలెనంటే సంపదలు వట్టి యలమట బెట్టు
     అలసి నోపనంటేను అండనే ఉండు.
     తలచి ఇందరు నీ తరితీపుల జిక్కి
     తలచ రెందును బరతత్వమైన హరిని.              !!

౨.  ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
     వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి.
     పోసరించి ఇందరు నీ పొందుల భ్రమలబడి
     పాసివున్నారదే తమ పతియైన హరిని.            !!

౩.   గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
     పట్టపగలైతే తమ పాల నుండును.
     బట్టబయలు సందిలి పెట్టేరు గాని చే
     పట్టరు శ్రీ వేంకటాద్రిపైనున్న హరిని.         !!

భావము..  ఆ పరమాత్ముని భక్తితో ప్రార్ధించినచో జీవుల కోరికలనెల్లా తానే నెరవేర్చును. అందుబాటులో అనగా తమ హృదయమునందే ఉన్న హరిని గూర్చి చింతించలేరు.

కావలెనని సంపదలను ఆశిస్తే అవి మనల్ని తిప్పలు బెట్టి అందకుండా పోతాయి. వాటిపై విసిగి, అవి నాకక్కర్లేదు అనుకొని ఆశ వదలిపెట్టి భగవంతునిపై భారముంచినచో తమకు తామే అవి మన చెంతకు వచ్చి చేరును. ఈ సూక్ష్మమును తెలియక సంపదల వ్యామోహములో పడి పరతత్వమైన హరిని నమ్మలేకున్నారు.  

పురుషులు ఆశపడి వెంటబడిన పడతులు బిగువు చూపుదురు. కాస్త నిగ్రహము చూపి వారే బెట్టుగానున్నచో అ పడతులే తమ చెంతకు చేరుదురు. కాని జనులందరూ స్త్రీలపై వ్యామోహముతో వారికై ఆతాటపడి తమ స్వామియైన శ్రీహరిని వీడి యున్నారు.

రాత్రి గాఢనిద్రలో నున్నప్పుడు ఈ ప్రపంచమంతా కలవలె తోచును. కానీ తెల్లవారేసరికి అంతా ఎప్పటిలాగే కనుపించును. ఇంతగా అశాశ్వతమైన ఈ ప్రపంచములో జీవులు బట్టబయలు పందిలి వదిలిపెట్టినట్లుగాఏమో సాధింపగోరి వ్యర్ధ ప్రయత్నములు చేయుచున్నారే కానీ శాశ్వతుడై శ్రీ వెంకటాద్రి మీద నున్న శ్రీహరినిమాత్రము విశ్వసించరు.

ఇచ్చుటలో ఉన్న హాయి. కథానిక.


ఇచ్చుటలో ఉన్న హాయి..

“అమ్మా” అన్న పనిమనిషి రమణమ్మ పిలిపుతో ఆలోచనలలోనుండి బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టింది లలిత.
అమ్మో అప్పుడే ఎనిమిది అయిపోయిందా? రమణమ్మ వచ్చేసింది అనుకుంటూ కూర్చున్న చోటు నుంచి లేచింది. సూర్యచంద్రులే గతులు తప్పినా, ప్రపంచమే తల్లకిందులయినా రమణమ్మ మాత్రం సరిగ్గా ఎనిమిది గంటలకి గుమ్మంలో ప్రత్యక్ష్యం అవుతుంది. అంత చక్కని సమయపాలన ఆమెది.  పిల్లలు స్కూల్  కి  వెళ్ళాక కాసేపు విస్రాంతిగా కాఫీ తాగుతూ సేద తీరుతూంటుంది లలిత. రమణమ్మ వచ్చాక మళ్ళీ దినచర్య మొదలు.
రోజూ నవ్వుతూ పలకరించి, గలగలా మాట్లాడుతూ, కాస్త లలితను సాధిస్తూ చకచకా తనపని తాను చేసుకుపోతూ ఉంటుంది రమణమ్మ..   కానీ ఈ రోజు మాత్రం ముభావంగా దిగులుగా కనిపించింది. మొహం చిన్నబోయి ఉంది. “ఏమయింది రమణమ్మ అలా ఉన్నావు? ఒంట్లో బాగులేదా” అని అడిగింది లలిత. “ఏటోనమ్మా మేము ముసలోళ్ళం అయిపోనామంట! మమ్మల్ని పనిలోంచి తీసేసి వేరే వయసోళ్ళని పన్లోకి పెట్టుకుంటారట” అంది దీనంగా.
రమణమ్మ వాళ్ళది గొదావరి జిల్లాలో చిన్న గ్రామం. అక్కడ జీవనోపాధి కుదరక బందువులసాయంతో హైదెరాబాద్ వచ్చి అపార్త్మెంట్లో పనికి కుదురుకున్నారు. లలిత వాళ్ళ పక్క అపార్త్మెంట్ లో రమణమ్మ భర్త వాచ్ మెన్ గా చేస్తున్నాడు. రమణమ్మ నాలుగిళ్ళలో పని చెసుకుంటూ భర్తకు చేదోడు వాదోదుగా ఉంటూ గుట్టుగా కాలం గడుపుతున్నారు. వారిక్ ముగ్గురు కుమార్తెలు. వారికి పెళ్ళిళ్ళు చేసి ఉన్నలో ఉన్నంత ముద్దుముచ్చట్లు, పెట్టుపోతలు చూస్తుంటారు. వాళ్ళు కూడా హైదెరాబాద్లోనే వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు, పండక్కి, పున్నానికి వచ్చి పోతుంటారు.
కాలం ఎప్పుడూ ఒక్కలా నడవదు. రమణమ్మ భర్తకి రెండేళ్ళక్రితం క్షయ వ్యాధి సోకి సరిగ్గా పని చేయలేకపోతున్నాడు. రమణమ్మే ఇటు భర్తను చూసుకుంటూ, అటు అపార్త్మెంట్ పని కూడా తనే చేసుకుంటూంది. ఆమె పనితో సంతృప్తి చెందని వారు,  వీరిని తొలగించి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకుందామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రమణమ్మకి పుట్టెడు బెంగ పట్టుకుంది.  తన గోడంతా లలితకి చెప్పుకుని బాధపడింది. మరి నీ పిల్లలు ఉన్నారుగా వారికి చెప్పలేక పోయావా? వారి దాపునే ఉండి నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చుగా అంది లలిత. “అయ్యో తల్లే ఏం చెప్పమంటావు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. వాళ్ళకి చెప్తే “మా సంసారాలు  మేమే ఏదుకోలేకపోతన్నం. ఇంక నిన్నూ ఆ రోగిష్టి ముసలాడిని ఎక్కడ సూడగలం? మా మొగోళ్ళు ఒప్ప్పుకుంటారేట్?” అని కుందబద్దలుకొట్టినట్లు చెప్పేసారమ్మా అంది బాధగా..సరే.. ఏదో మార్గం అలోచిద్దాంలే! నువేమీ బెంగపడకు రమణమ్మా! అని ఆమెకు ధైర్యం చెప్పి పంపించింది.
లలిత యోగా టీచెర్. ఉదయం సాయంత్రం క్లాసులు చెప్తూ ఉంటుంది. మిగతాసమయం ఖాళీ కదా అని ఈమధ్యే ఒక ప్లే స్కూల్ ఆరంభించి నడుపుతూంది. స్కూల్ ని తన చాకచక్యంతో, తెలివితేటలతో  కొద్ది కొద్దిగా అభివృధ్ధి పథంలోకి తీసుకు వెల్తూంది. భర్త పిల్లలు వెళ్ళాక మిగత సమయాన్ని ఇలా వినియోగించుకుంటూంది. రమణమ్మ సమస్యని విని, ఆమెకెలాగయినా  ఏదో ఒక మార్గం చూపాలని ఆలోచిస్తూంది. రాత్రి భర్త తో కూడా ఈ విషయం  ప్రస్తావించింది.
ఈ మధ్యే లలిత ప్లే స్కూల్ అభివృధ్ధి చేసే ఉద్దేశంలో పిల్లల సామానులు, ఆట బొమ్మలు కొన్ని పెట్టుకుందికి పక్కనే ఒక గది తీసుకుంది. అది మదిలో మెదలి లలిత ఆలోచనకి ఒక రూపు వచ్చింది. మర్నాడు రమణమ్మతో ‘నువ్వు ఏం బెంగ పెట్టుకోకు  మా స్కూల్ లో ఆయాగా చేద్దువుగాని, నీకు అక్కడ ఒక గది ఇస్తాను. నువ్వు మీ ఆయన అందులో ఉండొచ్చు.ఓపికను బట్టి  మీ ఆయన ఏదైనా చిన్న పని చెయ్యొచ్చు. నువ్వు కూడా అక్కడ ఒకటి రెందు ఇంటి పనులు చేసుకో” అని చెప్పింది. ఒక్కసారి రమణమ్మ కళ్ళలో నీళ్ళు చిప్పిలాయి. సొంతపిల్లలు కూడా మా గురించి ఈపాటి అలోచించలేదమ్మా.. నామీద ఇంత నమ్మకంతో, సానుభూతితొ దారి చూపిస్తున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవలమ్మా “ అన్న రమణమ్మతో “అంత పెద్ద మాటలు వద్దు ఏదో నాకు తోచిన సాయం చేస్తున్నాను అంది లలిత.  రమణమ్మ ముఖంలో సంతోషం, ధీమా చూసి ‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’ అని సన్నగా పాడుకుంటూ సంతృప్తిగా, ఉత్సాహంగా దినచర్య ప్రారంభించింది.



అమ్మ ఆదిగురువు.


అమ్మేగా ఆదిగురువు అడుగేసే వరకూ
నాన్నేగా ఆచార్యుడు బడికెళ్ళే వరకూ
ఒనమాలు దిద్దించిన ఒజ్జలనే మరువను
వారిమాట వేదవాక్కు వదిలెళ్ళే వరకూ
కళాశాల చదువుల్లో యేదోలోకం మాదీ
ఆరాధన గురువంటే అదిదాటే వరకూ
ఆగురువుల గొప్పదనం ఎంఏలో తెలుసా
వారంటే వణుకుగదా చదువయ్యే వరకూ
సాధిస్తూ పనినేర్పిన అత్తగారు గురువేగా
ఆసంగతి తెలిసిందా దివికేగే వరకూ
లోకమెరుగ నీయకుండ అన్నీతానే జేసే
అసలుగురువు తనేఅందు నేపోయే వరకూ !
జగద్గురువు నెరుగుదువా జంధ్యాలా నీవూ
ఆధ్యాత్మికమే అంటదు ఇదితెలిసే వరకూ !
**********************************
*