Saturday 7 November 2020

తల్లి బాధ్యత.

 ఆకలి తెలిసీ అన్నం పెట్టేది, అదనెరిగి ఆగ్రహించేదీ, అనువుగా మందలించేదీ, ఆదర్శంతో తీర్చి దిద్దేదీ తల్లి. అని మహాభారతంలో ఒక విశ్లేషణ,

అయితే ఈతరం తల్లులు మొదటి మాటను మాత్రమే ఆచరిస్తున్నారు. వారు అడిగినవన్నీ కొనిపెట్టడం, అల్లారుముద్దుగా, కష్టం తెలియకుండా పెంచడం చాలా మంది ఇళ్ళల్లో చూస్తున్నాము. నిజానికి అమ్మ ఆదిగురువు అంటారు, మంచి చెడ్డలు, మర్యాదలు, మన సంస్కృతి అన్నీ చెప్పవలసింది అమ్మే. పెద్దలు కనిపిస్తే నమస్కరించడం ఇంటికి వచ్చినవారిని ఆత్మీయంగా పలకరించడం, సమయపాలన ఇలాంటి విషయాలు అతి మామూలుగా పిల్లలికి మాటల మధ్యలో చెప్పొచ్చు. అన్నీ పెద్దయితే వాళ్ళే తెలుసుకుంటారు అని అంటూఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం?. కొంతవరకు తల్లితండ్రుల భాద్యత లేదా? జన్మతః కొందరికి ఎవరూ ఏమీ చెప్పకుండానే మ్ంచి అలవాట్లు అలవడతాయి. కొంతమంది పిల్లలు తల్లితండ్రులు, గురువులు చెప్పగా నేర్చుకుంటారు.
పిల్లలకి మంచి నడవడి రావాలంటె తల్లితండ్రులదే బాధ్యత అని నాకనిపిస్తూంది. వారికి కావలసినవన్నీ, వారు నొచ్చుకుంటారని అమర్చి పెట్టేస్తుంటారు. చిన్నప్పుడు మాకు ఎలాంటి సరదాలు తీరలేదు, అంచేత మా పిల్లలకి ఏలోటూ ఉండకూడదని అని నేటి తరం భావిస్తున్నారు. అదీ కొంతవరకు నిజమే. కోరికలు తీర్చడంతో పాటు మంచినడవడిగల పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత కూడా తల్లిదే.

Sunday 1 November 2020

విశాఖ ప్రయాణం.

 

విశాఖ ప్రయాణం.

 

“అమ్మా! నేను బయల్దేరి వైజాగ్ వస్తున్నాను” చిన్నకూతురు మధు గొంతు ఫోంలో విన్న భారతికి ఏమీ అంతుపట్టలేదు. అమ్మా! మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. ఈ  విపత్కర పరిస్థితులలో ఈవిడెందుకు ఇప్పుడు బల్దేరుతూంది అని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అయిదారు నెలల నుంచి భుజం నొప్పితో భారతి చాలా బాధపడుతూంది. ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కి చూపించుకుని ఎక్ష్రేలు, స్కాన్ తీయించుకొంది. భుజం దగ్గిర ఎముక పూర్తిగా అరిగిపోయిందని, లూస్ బాడీస్ ఉన్నాయి అవి తీసెయ్యాలని, డాక్టర్స్ చెప్పారు.  చాలా ఖర్చుతో కూడుకున్న సర్జరి, పైగా ఈ వయస్సులో తట్టుకోగలనా అని భయం, అన్నీ కలిసి ఆపరేషన్ కి మొగ్గు చూపట్లేదు. కొడుకు విజయ్, కూతురు మధు హైదెరబాద్లో ఉంటున్నారు. పెద్ద కూతురు విశాఖపట్నంలో ఉంటూంది.  సంగతంతా తెలిసి కొడుకు, కూతుళ్ళు ఎలాగైనా ఆపరేషన్ చెయించుకోవాలని పట్టుబడుతున్నారు. నిన్న కొడుకు విజయ్ ఫోన్ లో మాట్లాడి అమ్మా మేము నీకు సర్జరీ  చేయించేస్తాము. నువ్వు అంత బాధ పడుతుంటే మాకెలా తోస్తుంది. డబ్బుగురించి నువ్వేం అలోచించకు, నువ్వు ఏం చెప్పినా మేము వినం అని ఖరాఖండిగా అన్నాడు. దాని పరిణామమే మధు రాక అయ్యుంటుంది అనుకుంటుందగా మళ్ళీ మధు ఫోన్ చేసింది.

అదేమిటే! హఠాత్తుగా ఈ ప్రయాణం? అని ప్రశ్నించింది. “అమ్మా! నువ్వు చెయ్యి నొప్పితో చాలా బాధ పడుతున్నావని, సర్జరీ అవసరమని అక్క చెప్పింది. అక్కకి నడుం నొప్పి ఎక్కువగా ఉందట, ఆఫీస్ లో  కూడా సెలవు దొరకట్లేదని, నన్ను రమ్మని చెప్పింది. ఆసుపత్రికి నిన్ను తెసుకెళ్ళడానికి, పరీక్షలు అవీ చేయించడానికి అవసరాన్ని బట్టి సర్జరి చేయించడానికి రమ్మంటూంది. అందుకే గోదావరిలో బయల్దేరాను”. అంది.  “అది చెప్పడం నువ్వు బయలుదేరిపోవడం చాలా బాగుందమ్మా! పరిస్థితులెలా ఉన్నాయి రోజు రోజుకీ కరోనా విజృంభిస్తూంది.  ఈ సమయంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండడం శ్రేయస్కరం. తోందరపడి బయల్దేరి  ఇబ్బందులపాలవుతావేమో. అయినా నాదేం ప్రాణం తీసే జబ్బుకాదు. కాస్త పరిస్థితులు చక్కబడ్డాక అలోచించుకోవచ్చు. అందాకా ఏవో మందులు వాడుతున్నాను కదా!” అని భారతి అంటుంటే అవతలినుంచి నవ్వులు వినిపించాయి. అప్పుడు మధు “ఇబ్బందుల పాలవ్వటమేమిటమ్మా? అనేక ప్రమాద పరిస్థితులను దాటుకొని తమ్ముడింటికి ఇప్పుడే చేరాను. నేను వైజాగ్ దాకా రాలేదు  అని చావు కబురు చల్లగా చెప్పింది. భారతికి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించింది ఏమిటే నీ మాటలు సరిగ్గా చెప్పి ఏడు. అంది గాభరా పడుతూ ..  అమ్మా! నువ్వు ఒట్టి గాభర మనిషివి అందుకే నీకు సగం విషయాలు చెప్పం. ఇబ్బందులన్నీ తప్పించుకుని క్షేమంగా ఇల్లు చేరాను కనుక ఇప్పుడు నీకు ఫోన్ చేసాను అంది. అసలేం జరిగింది? సరిగ్గా చెప్పు.అంది భారతి.

అక్క దగ్గర్నుంచి ఫోన్ వచ్చాక నేను, తమ్ముడు  నీ సమస్య గురించి మాట్లాడుకున్నాము. తమ్ముడు ఈమధ్యే కొత్త కంపెనీ లో చేరాడు. తనకి సెలవు దొరకడం కష్టమని, నన్ను వెళ్ళమని అన్నాడు. డబ్బు సంగతి తను చూసుకుంటానని గోదావరి లో టికెట్ బుక్ చేశాడు.  మధ్యాహ్నం వచ్చి నన్ను తీసుకుని స్టేషన్ కి వచ్చాడు. నేను పకడ్బందిగా మాస్క్, గ్లొవ్స్ అన్నీ వేసుకుని తయారయి వచ్చాను, అక్కడి సిబ్బంది స్టేషన్ లోకి తమ్ముడిని రానివ్వలేదు.నేను సామాను తీసుకుని లోపలికి వెళ్ళాను. ప్లాట్ ఫామ్ రద్దీగానే ఉంది.  స్టేషన్ కి రెండు గంటలు ముందు రావాలని, అందరిని నిశితంగా పరీక్ష చేసి బండి ఎక్కనిస్తామని రైల్వే వారి ఆదేశం. అలాగే వచ్చాను అక్కడ ఏవిధమైన పరీక్షలూ లేవు.  ట్రైన్ వచ్చేసరికి జనాలు గుమ్మం దగ్గిర మూగేసారు. కాస్త రద్ది తగ్గాక పెట్టెలోకి ఎక్కాను. అక్కడి పరిస్థితి చూస్తే తల తిరిగిపోయింది.

అడ్డదిడ్డంగా సామానులు, మనుష్యులు నించుందికి కూడా జాగా లేదు. ఒక్కళ్ళకీ మాస్క్స్ లేవు. కనీస జాగ్రత్తకూడా పాటించటం లేదు. మీద బెర్త్ నాది. అందాక కింద కూచుందామంటే కింద బెర్త్స్ రెండింటిలోనూ అనారోగ్యంతో పడుకుని ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు. చేసేది లేక లగేజ్ కింద సర్ది మీదకి కష్టపడి ఎక్కాను. ఏదో స్పెషల్ బండిట. మీదని కూడా కూర్చుందికి వీలుగా లేదు. ఈలోపున తమ్ముడి ఫోన్. బండి ఎక్కవా? జాగ్రత్తగా కూచున్నావా అని ఏం జాగ్రత్తరా బాబూ అని పరిస్థితి వివరించాను. వాడు వెంటనే గాభరాపడి అక్కా! నువ్వు బండి దిగిపో ఇంటికి వచ్చేద్దువుగాని. నేను వచ్చి తీసుకెల్తాను. ఆ బండిలో వెళ్ళావంటే కరోనా కచ్చితంగా వచ్చేస్తుంది. నీ ద్వారా అమ్మ వాళ్ళకి సంక్రమిస్తే బాబోయ్! తలుచుకుంటేనే భయంగా ఉంది. బండి దిగిపో అన్నాడు. కొంపదీసి దిగిపోయావేమిటే అంది భారతి. చెప్పేది పూర్తిగా వినమ్మా. తమ్ముడు చెప్పిందే నాకూ నయమనిపించింది. అసలే అనారోగ్యంగా ఉన్న నేను 14 గంటలు ఆ కూపేలో ప్రయాణిస్తే ఏమైనా జరుగుతుంది. అనుకుని కష్టపడి మీదనుంచి దిగాను. ఈలోపున బండి కదిలిపోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. వచ్చే స్టేషన్ మౌలాలిలో దిగిపో నేను వస్తాను అన్నాడు. సామానులు సర్దుకుని జనాల్ని తప్పించుకుని ద్వారం దగ్గరికి వచ్చేసరికి మౌలాలి కూడా దాటిపోయింది. బండి ఆగలేదు కూడా.. అప్పుడు మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసాను. ఆ తరువాత స్టేషన్ ఘట్కేసర్ దిగిపో అన్నాడు. తరువాత్ స్టేషన్ లో బండి ఆగలేదు. ఇంక లాభం లేదని చైన్ లాగాను. బండి స్టేషన్ కి కాస్తదూరంలో ఆగింది. గబ గబా సామాను పట్టుకుని దిగేసాను. చిన్నగా వాన పడుతూంది. ఈలోపున రైల్వే సిబ్బంది నలుగురు దిగి నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతసేపు పడ్డ టెంషన్ కి నాకు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. అయినా వాళ్ళు అడిగిన అన్నింటికీ జవాబు చెప్పాను. నేను పడ్డ అవస్థంతా చెప్పేను. మీ ఎవరి సలహా అయినా తీసుకుందామంటే  మీరెవ్వరూ కనిపించలేదు అన్నాను. మీకు ఇబ్బంది వస్తుందని మీ పక్కనే కూచుంటామా? అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. నా శారీరిక పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించ లేదు. నాకు వళ్ళుమండి నేనూ తిక్కగానే సమాధానం చెప్పి ఏం చేసుకుంటారొ చేసుకోండి నా ఆరోగ్యం బాగులేదు. ఇక్కణ్ణుంచి ఎలాగోలా ఇల్లు చేరాలి అనుకుని దిగాను. అని గట్టిగా చెప్పేసరికి వాళ్ళు ఏవో రాసుకుని బండెక్కిపోయారు. బండి కదిలింది.

బ్రతుకుజీవుడా అనుకొని సామాను పట్టుకుని ట్రాక్ పక్కనుంచి వానలో తడుస్తూ ఒక ఇరవై నిమిషాలు నడిచి స్టేషన్ చేరాను. తీరా చూస్తే అది చర్లపల్లి స్టేషన్. నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు కొంచెం ఆయాసం తీర్చుకుని తమ్ముడికి ఫోన్ చేసాను. వాడు వెంటనే అక్కా నేను అక్కడికే వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు చాలా వాన పడుతూంది అని జవాబిచ్చాడు. కంగారు పడకు మెల్లిగా రా! వాన పడితే హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అని జవాబిచ్చి బెంచి మీద కూర్చున్నాను. ఈలోపున స్టేషన్ కానిస్టెబుల్ వచ్చి నన్ను ప్రశ్నించడం మొదలు పెట్టాడు. మీరు ఇక్కడ ఎందుకు దిగారు అంటూ.. వాడికి జవాబు చెప్పాను. ఆఫీస్ రూం కి వచ్చి నే చెప్పినదంతా రాసి సంతకం పెట్టమన్నాడు. అలాగే చేసాను. వాడు ఒక్కడే స్టేషంలో నేనూ ఒక్కాదాన్నే చీకటి పడుతూంది, వానకూడా ఎక్కువయింది. మనసుకి ధైర్యం చెప్పుకుని కూర్చున్నాను అరగంట పొయాక తమ్ముడు వచ్చాడు.  అక్కా! ఉన్నావా తల్లీ నిన్ను చూసిందాకా నా ప్రాణం నిలబడలేదు. పద వెళ్దాం కారులో మాట్లాడుకుందాం అని చెప్పి సామాను తీసుకుని బయల్దేరాడు. వాణ్ణి చూసాక నాకూ కొంత ఉపశమనం కలిగింది.  ఇద్దరం కారులో కూర్చుని హోరుమని వానలో ఇంటివైపు బయల్దేరాం. దారిలో అంతా వివరంగా చెప్పాను. ఇంటికి చేరేసరికి తమ్ముడి పిల్లలు, భార్యా అందోళనగా ఎదురు  చూస్తూ కనిపించారు. అందర్నీ పలకరించి లోపలికివచ్చి కాస్త తేరుకుని నీకు ఫోన్ చేసాను. అంది మధు.

కూతురు చెప్పినదంతా వినేసరికి ఒక్కసారి ఒంట్లో వణుకు వచ్చింది భారతికి. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకుంది ఎంత దారుణంగా ఉన్నాయి రోజులు?  చీకటివేళ నిర్మానుష్యమైన ప్రదేశంలో రైల్వే పట్టాల పక్కనుంచి ఒక్కర్తీ నడుచుకు రావడం, ఎవరైన కనిపెట్టి ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏదీ గతి? ఎంత దారుణం జరిగేది? ఆ వానలో టెంషన్ తో కారు నడిపిన కోడుకు పరిస్థితి అలోచించినకొద్దీ మనసు వికలమై పోతూంది. కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.  తను నమ్ముకున్నా ఆంజనేయ స్వామే తన పిల్లల్ని కాపాడాడు అనకుని, స్వామికి పదే పదే నమస్కరిస్తూ నిట్టూరుస్తూ కూర్చుంది. భారతి భర్త వచ్చి, నాకు ఇందాకలే విజయ్ ఫోన్ చేసి చెప్పాడు పరిస్థితి. మధుని తీసుకు రావడానికి వెళ్తూ నాతో మాట్లాడాడు. అమ్మకి చెప్పకండి కంగారు పడుతుంది, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అని చెప్పాడు.. అయితే అంతా మీకు తెలుసన్నమాట! ఇంతసేపూ మీరు అన్యమనస్కంగా ఉంటే ఏమో అనుకున్నాను. మీ గుండె నిబ్బరం మెచ్చుకో వచ్చు అని నిష్టూరమాడింది. పోన్లే పిల్లలికి ఏం కాలేదుగా ఇంకా ఎందుకు బెంగ? పద  పడుకో  ఇంక. అని అనునయించాడు.

Sunday 27 September 2020

బాలు - కవిత



 


మా మరిది గారు చి.
Umamaheswar Rao Ponnada
అమర గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పై రాసిన కవిత యధాతధంగా :
బాలు
---------
అయిదున్నర దశాబ్దాలు అలరించిన
ఓ గొంతు మూగబోయింది!
అఖండంగా కురుస్తున్న ఓ అమృతధార
హఠాత్తుగా ఆగిపోయింది!
వెన్నెల కరిగి సన్నగా అతని
గొంతులోంచి జారినట్లు ఉండేది.
సన్నజాజి అతని పెదవుల మీదనే
విరిసి పాటతో పరిమళించినట్లుండేది.
ఎవరైనా అనుకున్నామా?
నిశ్శబ్దంగా మొలిచిన ఓ లేత స్వరం
తేనెల జల్లులు కురిపిస్తుందని,
కోట్లాది మనసులని మురిపిస్తుందని,
భాషా హద్దులని చెరిపేస్తుందని!
ఎవరైనా ఊహించామా!
పాట అతని గొంతులో మరో గుండెగా వెలుస్తుందని,
పాటే అతనికి ఊపిరిగా నిలుస్తుందని!
మన ప్రతి ఉదయం అతని పాటతో పలకరిస్తుందని,
ప్రతి తెలుగు గుండె అతని పాటతో పులకరిస్తుందని!
ఏమైందో, ఏమో?
పై నుంచి ఎవరైనా చేతులు చాచి పిలిచారో?
ఈ బాలు ఇక మీకు చాలు అని తలచాడో?
హడావుడిగా తన పాటల మూటల్ని
భుజాన వేసుకొని మరొక కొత్త వేదికను
వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు!
ఇకపై
అక్కడ గంధర్వలోకంలో రోజూ
అతని గానకచేరీ కొనసాగుతూనే ఉంటుంది!
ఇక్కడ గాలి ఉన్నంత వరకు మనకోసం
అతని పాటను మోసుకొస్తూనే ఉంటుంది!
.........
రాతలు పొన్నాడ ఉమామహేశ్వర రావు
గీతలు: శ్రీ పొన్నాడ వెంకటరమణమూర్తి

Saturday 29 August 2020

తెలుగు బిడ్డ - కవిత

 తెలుగుదేశమందు పుట్టి తెలుగుబిడ్డనని చెప్పి

తెలుగును విస్మరించెదవేల తెలుగుబిడ్డా!
మధురమైన తెలుగుభాష దొరలు మెచ్చ్చిన భాష
పొట్టకూటికై ఆంగ్లభాష నేర్చి అమ్మభాషను మరచెదవేల తెలుగుబిడ్డా!
హరికథలు చెప్పి పామరులను సైతం రంజింపచేసిన భాష
బుర్రకథలతో వీరుల చరిత్రలతో   వినోదాన్ని అందరికీ పంచిన భాష
అవధాన ప్రక్రియతో ఔరా! అనిపించినా అమృత భాష
పండిత ప్రవచనాలతో విజ్ఞానం పంచిన భాష నీకు చేదయిందా తెలుగు బిడ్డా!
తెలుగు భాషకు మాత్రమే సొంతమయిన ఛందస్సు, గణవిభజన గల పద్యాల సొగసు
తేటతెలుగు భాష గొప్పదనం నీకేల  కానరాదు తెలుగు బిడ్డా!
ఆనాటి కవుల సాహీతీ సంపదని, అన్నమయ్య పదకవితల్లోని భావజాలాన్నీ
వాగ్గేయకారకుల కీర్తనల్లోని మధురిమనీ నీవేల ఆస్వాదించలేకపోతున్నావు తెలుగుబిడ్డా!
స్వచ్ఛమైన తెలుగుభాషలో ఆంగ్లపదాలు మేళవించి,
అమృతతుల్యమైన తెలుగుభాషని ఎంగిలిభాష చేయకు తెలుగుబిడ్డా!
అవసరార్ధం పరభాషను నేర్చినా అమ్మ భాషకు తెగులు పట్టించకు తెలుగు బిడ్డా!

(2018, ఆగస్టు నెలలొ 'తెలుగు తల్లి కెనడా' లో ప్రచిరితమై బహుమతి పొందిన నా కవిత)

Saturday 15 August 2020

సంసారమే మేలు సకల జనులకు... అన్నమయ్య కీర్తన.

 ఈ వారం అన్నమయ్య కీర్తన.

సంసారమే మేలు సకల జనులకు
కంసాంతకుని భక్తి కలిగితే మేలు.

వినయవు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాగకుంటే మేలు,
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు. !!

కోరి నొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు,
భారపుటిడుమలను పడకుండితే చాలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు !!

పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీ వేంకటాద్రి విభుని గొల్చి
యిరవై నిశ్చింతుడైతే నిన్నిటాను మేలు.

భావం… సకల జనులకూ సంసారము మేలే.. సంసారం ఈదుతున్నా భవబంధాలన్నిటిని మోస్తున్నా కంసాంతుకుడైన ఆ హరిని స్మరించడమే మేలు.

వినయంతో కూడిన విద్యను సాధిస్తే మేలు. ఆడంబరాలకు పోయి అప్పుల పాలవకుండా ఉంటే మేలు. లోభం వల్ల అక్రమాలూ, అప్పులూ చేసి భూమికి భారం కాకుండా ఉంటే మేలు. వెన్నంటి ఉన్న కోపాన్ని విడిచితే మేలు.

కోరి ఎవరినీ ఏమీ యాచించి అవమాన పడకుండా ఉంటే మేలు. జీవులను హింసించకుండా ఇతరులను కష్టపెట్టి అనేక కష్టాలను తెచ్చుకోకుండా ఉంటే మేలు. మన చేత బాధింపబడ్డ వారిచే నిందింపబడకుండుటే మేలు.

పరకాంతల నాశించి భంగపడకుండుటే మేలు. దొరకొని ముళ్ళదారులను తొక్కకుంటే మేలు. శ్రీ వేంకటేశ్వరుని నిష్టతో కొలిచి నిశ్చింతుడైతే అన్ని విధాలా మేలు.

గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించడంలో తప్పు లేదు కానీ, పరమాత్మునిపై మనస్సు నిలిపి నిష్కామ బుధ్ధితో నీ భాధ్యతలను నిర్వర్తించు అని ఈ కీర్తనలో అన్నమయ్య మనకి వ్యక్తీకరించాడు.

భావోద్వేగం.

 ఒక ఆత్మీయురాలి ఆర్తికి నా భావొద్వేగం..

ఆత్మీయతానురాగాలు అంగడిలో సరుకులు కావు
మూల్యం చెల్లించి సొంతం చేసుకోవడానికి,
ఆదరాభిమానాలు తాతముత్తాతల ఆస్తులు కావు
అధికారంతో కబళించి అనుభవించి తృప్తి చెందడానికి,
హృదయాంతరాళలో నుంచి పొంగి పొరలేదే నిజమైన అనురాగం,
అవరోధాలు లేని ప్రేమ విశ్వమంతా వ్యాపించి
తర తమ భేధం లేక అందరికీ పంచబడుతుంది.
ఈ సత్యం తెలుసుకోలేక ఈర్ష్యా అసూయలతో కలసి
అగ్నిగుండంలా మారిన మానసం.
ఒక్కరికే సొంతమవ్వాలనే సంకుచిత భావం.
అంతర్మథనంలో అంతరాత్మ ఘోషిస్తూంది.
అధీనంలో లేని మనసు అపరాధమని తెలిసీ
అంగీకరించడానికి మొరాయిస్తోంది.
సుగుణాలతో బాటు బలహీనతలని కూడా స్వీకరించి
చేరదియ్యాలని ఆత్యాశ!
అత్యాశతో కొట్టుమిట్టాడే మనసుకు
మిగిలేవి కన్నీళ్ళు, కలతలే!

ఒక చిన్న భావ వీచిక.

 ఒక చిన్న భావవీచిక.

అద్దాలమేడలు అందమైన కారులు లేవని చింతించా నొకనాడు.
ప్రశాంతమైన చిన్న పొదరిల్లే అంతులేని ఆనందాన్ని ఇస్తోంది ఈ నాడు.
కాలు కింద పెట్టనివ్వక, పువ్వులతో పూజించే భర్త కావాలని
ఊహలలో తేలిపోయానొకనాడు.
మానవత్వంతో అనురాగం పంచుతూ ఆప్యాయంగా చూసుకొనే భాగస్వామి లభించినందుకు సంతృప్తి పొందుతున్నా నీనాడు.
నానాలంకారభూషితనై నలుగురిలో మెప్పు పొందాలని అనుకున్ననొకనాడు
కాసంత బొట్టుతో, నల్లపూసల సౌభాగ్యంతో అత్యంత గౌరవం
పొందుతున్నానీనాడు.
ఉన్నతవిద్యలనభ్యసించి అందరిలా ఖండాంతరాలకు పిల్లలు పోలేదని
నిరాశ చెందానొకనాడు.
చెంతనే ఉండి అనవరతం నా బాగోగులు విచారిస్తూ బాధ్యతగా మసులుకొనే
సంతతిని చూసి గర్విస్తున్నాను ఈనాడు.

Monday 27 July 2020

అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.


అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.
పురుషాధిక్య సమాజంలో సాధారణంగా లోకులు పురుషునిలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. నీతిబోధలు చెయ్యరు. ఏ దోషాలు లేకపోయినా స్త్రీలకి అందరూ నీతులు చెప్పేవారే. సద్దుకుపోవాలని, సహించాలని ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ న్యాయవేత్త, సత్యవాది, మానవతావాది అయిన అన్నమయ్య 15వ శతాబ్ధం లోనే స్త్రీకి పురుషునితో పాటు సమానత్వం, స్వేచ్చాస్వాతంత్ర్యాలు కాంక్షించాడు. ఉదాహరణ
పొలుతులు జీవులే  పురుషులు జీవులే  -  తలప భావభేదమే కాని,
బలిమి స్వతంత్రము  పరతంతంత్ర మొకరికి  -  ఎలిమి చెల్లే నిందులో హినాధికములే..
అనే కీర్తనలో స్రీలు కూడా జీవులేనని, పురుషులకు స్వాతంత్ర్యమిచ్చి, స్త్రీలను పరతంత్రులుగా చేయడం హీనాతిహీనమని, స్త్రీలకూ వ్యక్తిత్వం, అభిరుచులు ఉంటాయని ఎలుగెత్తి చాటాడు. అన్నమయ్య వనితాభ్యుదయాభిలాషి. వనితలకూ విద్య, వేదాధ్యయనం అవసరమని, జ్ఞానదేవతలయిన గాయిత్రి, సరస్వతి స్త్రీమూర్తులేనని నొక్కి వక్కాణించాడు. అతని భార్య తాళ్ళపాక  తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఆ విదుషీమణి  చేసిన ఈ కావ్యరచనలో అన్నమయ్య సహకార ప్రోత్సాహాలు ఎంతున్నాయో మనకి అర్ధమౌతుంది.
అభిమానవతి అయిన ఏ స్త్రీ అయినా తన భర్త పరస్త్రీ సాంగత్యం చేస్తే ఓర్చుకోలేదు. అతనిలోని అవగుణాలని నిలదీసి ఖండిస్తుంది. ఈ అంశాన్ని  అన్నమయ్య అనేక కీర్తనలలో వ్యక్తపరిచాడు. ఒక నాయిక తన నాయకునకు ఎన్నోసార్లు నీతి బోధించి  ఫలితం లేకపోయేసరికి విసుగు చెంది జాజిపువ్వు జాజిపువ్వే అవుతుంది కానె దిరిశన పువ్వు అవుతుందా? నీ తత్వాని నీవు ఎంతైనా మానుతావా? కొంతమందికి అనురాగాలు, కొంతమందికి ద్వేషాలు చూపుతున్నావు. పొగడపుష్పాలని ఎంత ఇష్టంగా వాసన చూసినా అందులోని వాసనే ఉంటుంది కానీ దాని మదం పోతుందా? ఆ విధంగానే మితిమీరిన నీ చేష్టలు నీలాంటివారికి గాక తిరిగి నీ బుడ్ఢులు మంచివి అవుతాయా? ధీరుడవైన  శ్రీ  వేంకటేశా! వీడనిబంధాల వసంతంలో మా కోరికల ఆశ మానుతుందా! అని కొన్ని సామెతల ద్వారా అతనికి నీతి గరపడం తన ప్రేమను వ్యక్తం చెయ్యడం కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో నాయికా నాయకుల విరహం, అలుక మొదలైనవి వర్ణించబడిన చివరలో వారి సమైక్యత గోచరిస్తుంది. అందులో వివాహబంధం పటిష్టత, దాంపత్య జీవితంలో సద్దుబాటు కనిపిస్తాయి. దీనివలన జీవాత్మ పరమాత్మతో కలసి ఉన్నప్పుడే చిత్తశాంతి కలుగుతుందని అన్నమయ్య అంతర్గత భావన.
తన ఇష్టసఖునిపై అనేక కారణాలవల్ల కోపోద్రిక్త అయిన ఒక అభిమానవతి విజృంభించి అతనితో ‘నీ పొందు నాకు వద్దు పోరా!” ఓరి నీ పంతాలన్నీ వెలికి తీస్తాను, ఓరి బెదిరింపు చూపులతో వైరాన్ని దాటవద్దురా!, ఓరి ఎంతైనా ఇంక నిన్ను పోనివ్వను, ఇతరుల సంబంధాలు తలచవద్దురా!” ఇటువంటి ప్రయోగాలు అన్నమయ్య కీర్తనల్లో గమనిస్తే దారితప్పిన పురుషుని  నిలదీసి అడగడానికి, నీతిబోధ చెయ్యడానికి అన్నమయ్య స్త్రీకి ఒసగిన అధికారం, చనువు, స్వాతంత్ర్యం వ్యక్తమవుతున్నాయి. అంత పాతకాలంలో, స్త్రీని బానిసగా చూసే రోజుల్లో అన్నమయ్య స్త్రీల పట్ల చూపిన ఔదార్యం, విశాల భావం, సంస్కారం అన్నీ కనిపిస్తాయి.
కొన్ని కీర్తనల్లో అన్నమయ్య తానె చెలికత్తె రూపం ధరించి, నాయిక చేసిన ఆక్షేపణలకు అలిగిన నాయకునికి సద్బుద్ధులు చెప్పి, ఆనక స్వామిని పొగిడి, నాయికపై అనురక్తి కలిగించడం గోచరిస్తుంది. “నీ పై విరహంతో ఆమె నిద్రపోదు, భుజించదు అన్నిటా నీకు అనువైన సఖిపై నీకు అలుకెందుకయ్యా. ఇప్పుడే వెళ్ళి ఆమెని ఆదరించకపోతే నీ పాదాలపై ఒట్టు. ఆపైన నీచిత్తం ఆమె భాగ్యం” అంటూ అధికారంతో మందలించిన వైనం కనిపిస్తుంది. స్వల్పకారణాలకే ఆమెపై కోపించి అలిగి ఉన్న స్వామికి ధర్మబోధ చేస్తుంది.
నేటి ఆధునిక కాలంలో సంఘసంస్కర్తలు గావించిన సాంఘిక విప్లవాలవల్ల , పరిణితి చెందిన స్త్రీల మనోభావాల వల్ల స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకొని, అన్ని రంగాలలోనూ ఉద్యోగాలు చేస్తూ అభ్యుదయాన్ని  సాధిస్తున్నారు. ఈ చైతన్యం అందరు స్త్రీలలోనూ రావలసి ఉంది. నేటికీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని, నయవంచనలని మనసు విప్పి చెప్పుకోలేని వనితలెందరో ఉన్నారు. ‘స్త్రీకి ఇంటా బయటా అధికారం మాట అలా ఉంచి, తన మీద తన శరీరం మీద, తన జీవితం మీద, తన మనసు మీద  ముందుగా సంపూర్ణ అధికారం రావాలి’ అని ఎవరో రచయిత చెప్పినట్లు అన్నమయ్య కీర్తనల్లో ఇటువంటి దృక్పధం కూడా కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో ఈనాటి ఆధునిక స్త్రీకి లోకం మెచ్చే చైతన్యం, తెలివితేటలు, ప్రత్యేక వ్యక్తిత్వం ఆనాడే స్త్రీ పాత్రలకు అన్వయించడం, పురుషునికి ధర్మ ప్రబోధం చేయించడం గమనిస్తే, ఈనాటి పరిస్థితులను అన్నమయ్య ఆనాడే ఊహించిన కాలజ్ఞానిగా తోస్తుంది. అన్నమయ్య సంకీర్తనలను మనసు పెట్టి చదివితే స్త్రీవాదులే కాక మానవతావాదులందరూ కూడా ఆశ్చర్యానందాలు పొంది అన్నమయ్యకు చెయ్యెత్తి జే కొట్టకుండా ఉండలేరు. శిరస్సువంచి నమస్కరించకుండా ఉండలేరు.
--- పొన్నాడ లక్ష్మి

Sunday 5 July 2020

తానే తానే ఇందరి గురుడు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన (గురుపూర్ణిమ సందర్భంగా ఈ కీర్తన)

వ్యాఖ్యానం శ్రీ మేడసాని మోహన్ గారి సౌజన్యంతో :

గురు శిష్య సంబంధం:

భారతదేశంలో అనాదిగా వేద వాఙ్మయం, ఉపనిషత్తులు, వివిధ సంప్రదాయాలకు చెందిన ఆగమ శాస్త్రాలు ‘ముఖే ముఖే సరస్వతి’ సంప్రదాయంలోనే అధ్యయనం చేయబడుతున్నాయి. గురువుగారు వల్లె వేస్తూ ఉండగా శిష్యులు యథాతథంగా ఉచ్ఛరిస్తూ, ధారణ చేస్తూ సమస్త విద్యలను అభ్యసించేవారు. అంటే గురు శిష్యుల మధ్య పవిత్రమైన అనుబంధం, సత్సంబంధాలు భారతీయ సంతతికి పునాదులు. ఈ పరమ సత్యాన్ని గుర్తించిన అన్నమయ్య దేవదేవుడైన శ్రీనివాసుడే సమస్త జీవులకు గురుదేవుడని, ఆ స్వామికి గురుస్థానాన్ని ఆపాదిస్తూ ఈ క్రింది సంకీర్తన రచించినాడు.

"తానె తానె ఇందరి గురుడు
సాన బట్టిన భోగి జ్ఞాన యోగి

అపరిమితములైన యజ్ఞాలు వడిజేయు
ప్రసన్నులకు బుద్ధి పరగించి
తపముగా ఫలపరిత్యాగము గావించు
కపురుల గరిమల కర్మయోగి || తానె ||

అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ
మన్నించు బుద్ధులకు మరుగజెప్పి
ఉన్నత పదముల కానరగ కరుణించు
పన్నగ శయనుడే బ్రహ్మయోగి || తానె||

తనరగ కపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకట రాయుడై
ఒనరగ సంసార యోగము కృపసేయు
అనిమిషగతులకు అభ్యాసయోగి || తానె||"

సారాంశం :
దేవదేవుడైన శ్రీ వేంకటేశుడే ఈ సమస్త సృష్టిలోని జీవరాశులకు గురుడు. జీవులందరూ అనుసరింపవలసిన జ్ఞానయోగాన్ని ప్రసాదించే గురుదేవుడే ఆ స్వామి. పూర్వావతారాలలో కపిలాచార్యుడిగా, దత్తాత్రేయుడుగా జీవులకు జ్ఞానప్రబోధం చేసిన భగవంతుడే ఈ వేంకటరాయుడు. సమస్త యోగబలానికి అవసరమైన సాధనా సామాగ్రిని సమకూర్చే అభ్యాస యోగాన్ని అనుగ్రహించి జీవులను దైవీ సంసారం వైపు పయనింపచేసే యోగీశ్వరేశ్వరుడే ఈ వేంకటేశ్వరుడు.



Sunday 14 June 2020

మానసవింగం కవిత.




 కవిత..మానస విహంగం.


మానస విహంగం అందని జాబిల్లి కోసం అర్రులు చాస్తూ పరుగులు తీస్తోంది.
భావోద్వేగాలను, భావపరంపరలనూ అదుపులో పెట్టమని అంతరాత్మ ఘోషిస్తూంది
పలితకేశాలు, సడలిన దేహం తన ఉనికికి అద్దం పడుతున్నా, రంగుల పొహళింపుతో
తిరిగిరాని అందమైన రూపుకోసం విశ్వప్రయత్నం చేస్తూంది.
వయస్సు దేహనికే కాని మనసుకు లేదని వింతగా సమర్ధించుకుంటూంది.
ఎంత మెరుగులు దిద్దినా అరవైలో ఇరవైని పొందలేమని సమ్మతించలేకపోతూంది.
మళ్ళుతున్న వయసుని, చేజారిపోతున్న కాలాన్ని తలచి తలచి కృంగిపోతూంది.
పిచ్చి మనసా! అసంభవాన్ని సంభవం చెయ్యాలన్న ఆలోచనెందుకు?
మారుతున్న కాలాన్ని సంతోషంగా స్వీకరించి, జీవిత చరమాంకలోని
అనుభూతుల్ని ఆస్వాదిస్తూ జీవించు ప్రశాంతిగా!
 —






Sunday 17 May 2020

ప్రేమ సుధ.


ప్రేమ సుధ.
               
ఏ శుభగడియలో పరిచయమయ్యావో నేస్తమా!
నిను తలవని రోజు లేదు, 
నీ పరిచయం నాకు కలిగిన మహాభాగ్యం.
నీ గానం, నీ మధురవాక్కు నీ చిరునవ్వు,
నీ అభిరుచులు అన్నీ నాకు అపురూపమే..
నీ నోట పలికే నా నామం అతి మథురం
నీ ప్రోత్సాహమే నాలోని ప్రతిభకు ఆలంబన 
నిన్ను చూసిన మొదటి క్షణం
నీ కన్నులలో మెరుపులు, నా మదిలో రేగే అలజడులు
నీ చిత్రాలు నా కళకు ప్రేరణ
నీ మదిలో భావానికి ఏ రూపు ఉందో తెలియదు కానీ
నీ తలపే నాకు దివ్యానుభూతి..
నా హృదయంలో మెరిసిన మెరుపువి నీవు
నా భావాలకి ప్రతిరూపం నీవు
నా భావోద్వేగాన్ని నీతో పంచుకోవాలని ఆశ!
బంధాలలో చిక్కుకున్న నాకది సాద్యమా?
ఆంక్షలను దాటి నిన్ను చేరుకోగలనా?
అందుకోలేని గగనకుసుమానివే నీవు.
నిర్మలమైన నీ స్నేహం కలిగిస్తుంది నాకెంతో ఓదార్పు.

Sunday 10 May 2020

అమ్మ.

Ramana Prasad Maddirela అమ్మ
అరవిరిసిన బాల్యానికి సాక్షి అమ్మ
బ్రహ్మాదులు కూదా కొలవలేని ఆప్యాయతే అమ్మ
తప్పటడుగులను సరిదిద్దే గురురూపిణి అమ్మ
గూడుకట్టుకున్న బాధను తీర్చే అమృతస్వరూపిణి ఆమ్మ
కలబోసిన ఆప్యాయత అమ్మ
సృష్టిస్థితిలయకారిణి అమ్మ
ఎమీ ఆశించని ప్రేమమూర్తి అమ్మ
వడుగువృద్ధురాలయినా తరగని సౌందర్య పెన్నిధి అమ్మ
ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేని రుణమే అమ్మ
ఎన్ని చెప్పినా ఎదో మిగిలిపోయిన మాటే అమ్మ
అలసిపొయినా చెరగని చిరునవ్వు అమ్మ
చిట్టిగోరుముద్దలు తినిపించే అమృతహస్తమే అమ్మ
సన్యాసి కూడా వందనం చేసే విగ్రహమే అమ్మ
శివునికి బాల్యం రుచిచూపించిన నిగ్రహమే అమ్మ
త్రిమూర్తులను బాలులను చేసిన ఆత్మబలమే అమ్మ
ఇంటికి నిండుదనమయిన రూపమే అమ్మ
తన ప్రాణాన్నే పాలుగా మార్చిన అమృతమాధుర్యం అమ్మ
దిగ్దంతాలు వ్యాపించిన సుగందభరితమయిన పరిమళం అమ్మ

Sunday 19 April 2020

ఇందిర వడ్డించ అన్నమయ్య కీర్తన..

ఇందిర వడ్డించ యింపుగను
చిందక యిట్లే భుజించవో స్వామి
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కైన సయిదంపు పేణులను
సక్కెర రాసులు సద్యోఘృతములు
కిక్కిరియ నారగించవో స్వామీ
మీరిన కెళంగు మిరియపు తాళింపు
గూరలు కమ్మని కురలను
సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే
కూరిమితో చేకొనవే స్వామీ
పిండివంటలును పెరుగులు పాలు
మెండైన పాకాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరిదివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వేంకటస్వామీ

శ్రీ వేంకటాచలపతికి ఆరగింపు సేవ సంకీర్తన ఇది. ఇందిరాదేవి ప్రేమతో కొసరి కొసరి విస్తరిలో వడ్డిసుందిట. ప్రక్కనే నిలబడి అన్నమయ్య ఇలా అంటున్నాడు.
చూడముచ్చటగా మా ఇందిరా దేవి వడ్డిస్తుండగా చక్కగా ఆరగించవయ్యా స్వామీ!
అక్కళ అనే ధాన్యంతో చేసిన పాయసాలు, అప్పాలు, రుచికరపైన పేణులు, వడలు, చక్కెరతో చేసిన తీపి పదార్ధాలు, కరువుతీరా ఆరగించవయ్య!
మిరియాల తాళింపు వేసిన్ కమ్మని కూరలు, రుచికరమైన పచ్చళ్ళు, ఇష్టంతో ఆరగించవయ్యా!
పిండివంటలు, కమ్మటి పెరుగు, పాలు, రుచికరమైన పాకాలు, రకరకాల దివ్యాన్నాలు ఎంతైన మెచ్చుకుంటూ ఓ వేంకటేశ్వరా! కడుపునిండా ఆరగించవయ్యా!..
మూడు చరణాలలో స్వామి వారికి నివేదించిన వంటకాల పట్టికను అందించాడు అన్నమయ్య!
చారిత్రక దృష్టితో పరిశీలిస్తే 15వ శతాబ్ధంలో ఈ వంటకాలు స్వామికి నిత్యం నివేదించేవారేమో!

Friday 28 February 2020

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి భారత రామయణాలై పరగె నీ కధలు ॥ - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన.

వారిదే పో జన్మము వడి నిన్ను దెచ్చిరి
భారత రామయణాలై పరగె నీ కధలు ॥

భువిమీద రావణుడు పుట్టగాగా రాముడవై
తవిలి ఇందరికి బ్రత్యక్షమైతివి,’
వివరింప నంతవాడు వెలసితేగా నీవు
అవతార మందితే నిన్నందరును జూతురు ॥

రమణ గంసాది యసురలు లూటి సేయగాగా
తమి గృష్ణావతార మిందరి కైతివి,
గములై ఇంతటి వారు గలిగితేగా నీవు నేడు
అమర జనించి మాటలాడుదు విందరితో. ॥

ఎంత ఉపకారియో హిరణ్య కశిపుడు
చెంత నరసింహుడని సేవ ఇచ్చెను,
ఇంతట శ్రీ వేంకటేశ ఇన్ని రూపులును నీవే
పంతాన నీ శరణని బ్రతికితి మిదివో ॥

భావ మాథుర్యం..

ఈ కీర్తనలో అన్నమయ్య పాపాత్ములను, రాక్షసులను కూడా మెచ్చుకుంటాడు. వాళ్ళు భూమి మీదకు రాబట్టేగా పరమాత్ముడు వాళ్ళను సంహరించడం కోసం వివిద రూపాలలొ అవతరించి, జనులనందరినీ కటాక్షించాడు. ఇదీ అన్నమయ్య అంటే..

ఓ పరమాత్మా! నిన్ను భూమి మీద అవతరింపజేసేలా చేసిన వారిదే పుణ్యము. అందుమూలముగా నీ కథలు బారత రామాయణాలుగా ప్రసిధ్ధి చెందాయి.

ఈ భూమి మీద రావణుడు పుట్టబట్టి ఆనిని సంహరించుటకు నీవు శ్రీరాముడిగా అవతరించితివి. వివరంగా చెప్పాలంటే అంతటివాడు జన్మించబట్టే నీవు అవతరమెత్తితివి. నిన్ను అందరూ దర్శించుకొనే భాగ్యం కలిగింది.

శ్రీ రమణా! కంసాది అసురులు మానవులను దోపిడీచేయబూనగా, నీవు కృష్ణావతారమెత్తితివి. పాపాత్ములైన వారు జనించబట్టేగా నీవు భూమీద జన్మించి అందరితో మాటలాడేవు. మంతనాలాడేవు.

ఇంక హిరణ్యకశిపుడు ఎంత ఉపకారము చేసినాడొ.. అతను కోరిన వింత వరము వల్ల అద్భుతమైన నరసింహావతార మెత్తితివి. నీ సేవ చేసుకొనే భాగ్యం మాకు కల్పించితివి. శ్రీ వేంకటేశా ఇన్ని రూపులూ నీవే. నిన్నే శరణని మేమందరమూ బ్రతుకుతున్నాము.

Friday 7 February 2020

నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. - అన్నమయ్య కీర్తన

 అన్నమయ్య కీర్తన
నదులొల్లవు నా స్నానము కడు
సదరము నాకీ స్నానము.
ఇరువంకల నీ యేచిన ముద్రలు
ధరించుటే నా స్నానము,
ధరపై నీ నిజదాసుల
చరణధూళి నా స్నానము.
తలపులోన నినుదలచినవారల
తలచుటే నా స్నానము
వలనుగ నిను గనువారల శ్రీపాద
జలములే నా స్నానము..
పరమభాగవత పదాంబుజముల
దరిసనమే నా స్నానము.
తిరువెంకటగిరి దేవా..
కథాస్మరణమే నా స్నానము...
భావవ్యక్తీకరణ..
నదులలో చేసే స్నానమొక్కటే కాదని, అంతకుమించిన స్నానమే తాను ఆచరిస్తున్నానని ఈ కీర్తనలో అన్నమయ్య స్పష్టం చేస్తున్నాడు.
భుజాలపై రెండువైపులా చక్రాoకితాల ముద్రలను ధరించడమే తనకు నిజమైన స్నానం అంటున్నాడు. పరమాత్మకు దాసులైన వారికి దాస్యం చేయడం అసలైన జలకస్నానం అని అన్నమయ్య విసదీకరిస్తున్నాడు.
మనసులో నిన్ను తలుచుకున్నవారిని తరుచూ మననం చేసుకోవడం, నిన్ను కనులారా చూసిన వారి పవిత్రజలాలను తలపై చల్లుకోవడం నాకు మహత్తరమైన స్నానం అంటున్నాడు అన్నమయ్య.
పరమాత్మే పరమావిధిగా జీవించే పారమార్థిక మూర్తుల పాదపద్మాలను దర్శించుకోవడం, తనకు గురియైన శ్రీనివాసుని దివ్యగాథను స్మరించుకోవడం నిత్యం నదీస్నానం చేయడంతో సమానమని పాడుకుంటూ పులకించిపోతున్నాడు అన్నమయ్య.

Saturday 1 February 2020

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య.. కదిసితేనే ఇనుము కనకమై మించెను. !! - అన్నమయ్య కీర్తన

అన్నమయ్య కీర్తన

ఇదివో నీ మహిమలు ఏమని పొగడేమయ్య..
కదిసితేనే ఇనుము కనకమై మించెను. !!
సెలవి నీవు నవ్వితే చిత్తము చీకటివాసె
వెలసెను నాలోని వేడుకలెల్లా
చెలిమిచేసి నాపైఁ జేయి నీవు వేసితేను
బలిమితో వలపుల పంటలెల్లాఁ బండెను !!
తప్పక నీవు చూచితే తనువుపై కాఁక మాని
వుప్పతిల్లెజవ్వనము వుదుటునను
కొప్పుదువ్వి నీవు నన్నుఁ గొనగోరు సోఁకించితే
కుప్పళించు తమకపుకొటారులు నిండెను. !!
చేరి నీవు పలికితే సిగ్గులు మూల కొదిగి
కారుకమ్మె నెమ్మోమునఁ గళలన్నియు
ఈరీతి శ్రీ వేంకటేశ ఇన్నిటా నన్నేలితివి
సారె నా కిట్టె మదనసామ్రాజ్యము హెచ్చెను. !!
భావమాథుర్యం.
ఓ శృంగారరాయా! నీ మహిమలను ఏమని పొగడెదమయ్యా! పరిశీలించి చూస్తే ఇనుములాంటి అల్పులైన నాబోంట్లు కనకములాగ ప్రకాశిస్తారు.
నీవు మథురమైన చిరునవ్వులు చిందిస్తే మనసులోని పెనుచీకట్లు తొలగిపోతాయి. నాలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చెలిమితో నీవు నాపై చేయి వేస్తే నా వలపుల పంట పండుతుంది.
నీవు నన్ను నఖశిఖపర్యంతం చూస్తే నా శరీరమంతా పులకరించి నా యౌవ్వనం ఒక్కసారిగా అతిశయిస్తుంది. నీవు అనురాగంతో నా శిరోజాలను నిమురుతూ నాకు చిన్న నఖక్షతము చేస్తే తమకంతో తబ్బిబ్బవుతాను.
నీవు నన్ను ప్రేమతో పలుకరిస్తే సిగ్గులమొగ్గనై ఒక మూల ఒదిగిపోతాను. నా మోములో కళలు తాండవిస్తాయి. ఓ వేంకటేశ్వరా! నీవు అన్నివిధాలుగా నన్నేలితివి. నన్ను వెలకట్టలేని రత్నముగా మలచేవు. నా మదన సామ్రాజ్యము నీ కృప వల్ల అతిశయించినది.

అణుమాత్రపుదేహి నంతే నేను మొణిగెద లేచెద ముందర గానను - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన
పల్లవి: అణుమాత్రపుదేహి నంతే నేను
మొణిగెద లేచెద ముందర గానను
చ.1. తగు సంసారపు తరగలు నీ మాయ
నిగమముల యడవి నీ మాయ
పగలునిద్రలువుచ్చే భవములు నీ మాయ
గగనపు నీమాయ గడపగ వశమా! ॥అణుమాత్రపు॥
చ.2. బయలు వందిలి కర్మ బంధములు నీ మాయ
నియమపు పెనుగాలి నీ మాయ
క్రియనిసుకపాతర కెల్లొత్తు నీ మాయ
జయమంది వెడలగ జనులకు వశమా?॥ అణుమాత్రపు॥
చ.3. కులధనములతో జిగురుగండె నీ మాయ
నిలువు నివురగాయ నీ మాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుట గాక యిది గెలువగ వశమా? ॥ అణుమాత్రపు॥
విశ్లేషణ:
మొణిగెద శ్రీనివాసా! అణుమాత్రపు కణంతో జన్మించాను నేను. అణువుతో సమానమైనవాడను. ఈ సంసార చక్రంలో పడి ముణుగుతున్నాను లేస్తున్నాను. అనగా పుడుతూ ఉన్నాను. మరలా జన్మిస్తూ ఉన్నాను. ఏది కొస ఏది మొదలు అనే అంతరం తెలియక కొట్టుమిట్టాడుతున్న వాడను. ముందు ఏమి జరుగుతుందో తెలీదు. తర్వాత ఏమి అవుతుందో తెలీదు. ఇదీ నా పరిస్థితి స్వామీ!
ఈ సంసారమనే మహాసముద్రంలో వువ్వెత్తున లేచే తరంగాలు నీ మాయ. ఈ మహారణ్యంలో పెనువృక్షాలలాగా వేదవేదాంగాలు అర్ధంకాని పరిస్థ్తిలో ఉన్నవి ఇదీ నీ మాయే! రాత్రి పగళ్ళు, నశించేటువంటి ఈ పుట్టుక నీ మాయ. ఆకాశం ఎంత అగమ్యగోచరమో నీ మాయ అంతే ! ఏమీ అర్ధం కాదు. దీన్ని దాటడం సామాన్యులమైన మా వశమా?
స్వామీ! మేము చేతగాని అనేక అవక తవక పనులు చేస్తూ మళ్ళీ మళ్ళీ ఈ కర్మ బంధాలలో తగులుకుంటూనే ఉన్నాము. నీ నియమానుసారం సంచరించే గాలి ఒక్కోసారి ప్రళయకాల సదృశమై పెనుగాలిగా మారడం నీ మాయ కాదా? సర్వస్వం పెళ్లగించి ఇసుక పాతరలో పూడ్చి పెట్టేయడం నీ మాయ కాదా? నిన్ను ఎదిరించి జయించడం ఎవరికి తరము? మాలాంటి వారికి ఈ ఆటుపోట్లను తట్టుకొని నిలబడే శక్తి ఉంటుందా చెప్పండి అని ప్రార్ధిస్తున్నాడు.
స్వామీ మేము గొప్ప కులంలో జన్మించామని కొందరు, గొప్ప కోటీశ్వరులుగా జన్మించామని కొందరు విర్రవీగుతుంటారు. కానీ ఇదంతా నీవు పన్నిన వుచ్చని తెలుసుకోలేని విధంగా మాయలో చిక్కిపోయాము. తెలుసుకోలేకపోతున్నాము. ఇలాంటి మాయా ప్రపంచంలో నివురుగప్పిన మాయతో జీవిస్తున్నాము. శ్రీ వేంకటేశ్వరా! నీవు మమ్మలను ప్రేమతో చేరదీస్తే ఈ మాయను గెలువగలము కానీ మామూలుగా జయింపవశముగాని మాయ ఇది. కనుక మమ్మలను ఈ మాయలో పడకుండా కాపాడి ముక్తిని ప్రసాదించండి అని అన్నమయ్య ప్రార్ధిస్తున్నాడు.
(భావార్ధం శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి సౌజన్యంతో)