Monday 28 August 2023

అసమాన నటి సూర్యకాంతం

 


   అసమాన నటి  సూర్యకాంతం. 

 

సూర్యకాంతం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాలని ఉంది. జగమెరిగిన  బ్రాహ్మణునకు జంధ్యమేల అని అంటారు అలాగ సూర్యకాంంతం గారి గురించి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.  


నా చిన్నప్పటి నుంచి ఆమె పోషించిన పాత్రలను అనేక చిత్రాలలో చూసాను. కేవలం గయ్యాళి అత్తగా మాత్రమే కాక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆమె పోషించారు.  కన్యాశుల్కం లో బాలవితంతువుగా ఎంతో బాగా నటించారు. చక్రపాణి లో మనోరమ అక్కయ్యగా హాస్యం పండిస్తూ దేనికైన “అంతొద్దు సగం చాలు” అంటూ, భానుమతికి మంచి సలహాలిస్తూ చాలా సహజంగా ఆ పాత్రను పోషించారు.  తోడికోడళ్ళు చిత్రంలో అనసూయగా అసూయను అద్భుతంగా నటించారు. అలాగే వాగ్దానం చిత్రంలో బాలామణి పాత్రలో తంపులమారిగా ఉన్నా తన భర్త రేలంగి గారు హరికథ చెప్తున్నపుడు పక్కవాయిద్యం వయొలిన్ వాయిస్తూ నిజంగా వైయొలిన్ కళాకారిణిలాగే హావభావాలు అద్భుతంగా ప్రదర్శించారు.

 

ఇంక చదువుకున్న అమ్మాయిలు చిత్రంలో వర్ధనం పాత్రలో తనభర్తకి ఎవరో అమ్మాయిపై మనసున్నదని అనుమానం పడుతూ భర్తని(రేలంగి) అలరించడానికి వయసులో ఉన్న పిల్లలా తయరయ్యి దగ్గరకు వస్తుంది. అక్కడ ఆమె ప్రదర్శించిన సిగ్గు, బిడియం, వయ్యారం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము. ఎప్పుడూ నోరు పెట్టి రాక్షసిలా పడిపొయే సూర్యకాంతం గారు ఇద్దరుమిత్రుల చిత్రంలో అతి కోపిష్టి   భర్త(రేలంగి) కి అడుగులకి మడుగు లొత్తుతూ నోరు మెదపకుండా అతని ధాటికి హడిలిపోతూ అణిగిమణిగి ఉండే ఇల్లాలిలా అతి సహజంగా నటించారు. బాటసారి చిత్రంలో నాగేశ్వరరావు గారికి సవతి తల్లి పాత్ర పోషించారు. సవతి తల్లి అయినా వల్లమాలిన ప్రేమ, అనురాగం కొడుకుపై కలిగి చదువుకుందుకి విదేశాలు వెళ్తానంటే అమాయకుడైన తనకొడుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని తను కూడా వెళ్తానంటుంది."అక్కడ ఏమైనా అవాంచనీయ సంఘటను జరిగితే సవితి తల్లిని నిన్ను సరిగా చూడలేదు అంటారు నాయనా"అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుని మధన పడుతుంది. అద్భుతమైన నటన అక్కడ చూపించారు. 


అలాగే మూగమనసులలో కూడా సావిత్రి గారికి సవతితల్లి పాత్ర పోషించినా మాట కరుకుగా ఉన్నా  కూతురి మీద అభిమానం, ఆమె భవిష్యత్తు  గురించి ఆరాటం  చాలా చక్కగా అభినయించారు.  'అంతా మనమంచికే'  చిత్రంలో  సంఘసంస్కర్త లీలారావు పాత్రలో తనకేమీ తెలియకపోయినా తెలిసినట్లు ఆర్భాటం చేస్తూ రామయణంలో ద్రౌపది గురించి సభలో మాట్లాడి అపహాస్యం పాలయి మనందరినీ నవ్విస్తుంది. ఆమె గయ్యాళి పాత్రలో నటిస్తున్నా ఎడం చెయ్యి తిప్పుతూ   తన సహజ శైలిలో ఆంగిక ప్రదర్శన చేస్తూ సునుశితమైన హావభావాలను ప్రకటిస్తారు. అది ఆమె గొప్పదనం.  

ఆమె నటన అతి సహజం. ఆమె వాచికం అత్యద్భుతం. ఆమె మన తెలుగువారికి భగవంతుడు ప్రసాదించిన వరం. 

ఆమెకు ఆమే సాటి. అటువంటి సహజనటిని ఇంతకుముందు చూడలేదు. ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తారని ఆశలేదు.

-- పొన్నాడ లక్ష్మి

Thursday 23 March 2023

సంకీర్తనాచర్యులు అన్నమయ్య.


 


సంకీర్తనాచార్యులు అన్నమయ్య


ఫాల్గుణ బహుళ ద్వాదశి - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వర్ధంతి


కారణజన్ముడైన అన్నమయ్య బాలప్రాయంలోనే తిరుమలేశుని మీద వచ్చీ రాని పదాలు

పాడుకుంటూ తిరుపతి కొండ ఎక్కుతూ మూర్ఛ పోయాడు .అప్పుడు అలమేలుమంగమ్మ ఆ

బాలుణ్ణి సేదతీర్చి స్వామివారి ప్రసాదం పరమానాన్ని ప్రేమతో తినిపించింది

అమ్మచేతి ప్రసాదాన్ని గోరుముద్దలుగా తిన్న మహత్మ్యంతో ఆ బాలుడు

అప్పటికప్పుడు అశువుగా ‘వేంకటేశ్వరా’ అన్న మకుటంతో అమ్మపై ఒక శతకాన్ని

చెప్పాడు. ఇది అన్నమయ్య మొదటి రచనని చెప్పవచ్చు. ఆ తల్లి కృప వల్లనే

అన్నమయ్య “ఆడిన మాటలెల్లా అమృత కావ్యమై పాడిన పాటెల్ల పరమ పావనమై”

అలరారింది.


శృంగార భావాలతో కొన్ని, యోగమార్గంలో కొన్ని, భక్తి, వైరాగ్య వాసనలతో కొన్ని

పరమమంత్రములుగా 32,000 కీర్తనలను, సంస్కృతంలో వేంకటేశ్వర మహత్మ్యం,

తెలుగులో శృంగారమంజరి అనే లఘుకావ్యం, పన్నెండు శతకాలు ఆనాటి

వాడుకభాషలన్నింటిలో సాటిలేని ప్రబంధాలు రాసాడట. అయితే 32,000 సంకీర్తనల్లో

14,000 కీర్తనలు, శృంగారమంజరి, అలమేలు మంగమ్మపై శతకం మాత్రమే లభ్యమయినాయి.

వారు రచించిన రామాయణం దొరకకపోవడం మన తెలుగువారి దురదృష్టం.


అన్నమయ్య కీర్తనలలో ప్రత్యేకంగా చెప్పుకో దగినవి’సంవాద గీతాలు అంటే

యుగళగీతాలు. వీటిని వాకోవాక్య గీతాలు అంటారుట. గోపికాకృష్ణుల సంవాదం,

యశోదాకృష్ణుల సంవాదం, భావామరదళ్ళ సరస సంవాదం, అత్తాకోడళ్ళ ఎత్తిపొడుపు

సంవాదం, స్వామివారితో అమ్మవారు అలకతో వాదీంచే సంవాదం ఇలా ఎన్నో ఆయన

రచనల్లో గోచరిస్తాయి.


అన్నమయ్య అభ్యుదయవాది. అసలు స్త్రీవిద్యని ప్రోత్సహించి , స్త్రీల చేత

కూడా కవితలల్లించిన ఉత్తమ సంస్కారి అన్నమాచార్యులు. ఈతని భార్య తిమ్మక్క

“సుభద్రా కల్యాణం” అనే కావ్యాన్ని రచించి తొలి తెలుగు కవియిత్రి అయింది. ఆంధ్ర

లోకానికి తొలి కవయిత్రిని పరిచయం చేసిన్ ఘనత కూడా అన్నమయ్యకే దక్కింది..

స్త్రీల యెడల, వారి ప్రతిభాపాటవాల పట్ల ప్రత్యేక దృష్టి కలిగి, వారు

పాడుకోవడానికి ప్రత్యేకంగా ఎన్నో రకాల పాటలను కూర్చిపెట్టాడు.


పెండ్లి పాటలు, శోభనపు పాటలు, మంగళహారతులు, దంపుళ్ళ పాటలు,, కోలాటపు పాటలు,

సువ్వి పాటలు, గొబ్బి పాటలు, జోల ఆటలు, జాజరలు, చల్లలమ్మే పాటలు ఇలా ఎన్నో

స్త్రీలు పాడుకొనే పాటలు రచించాడు. ఇంతే కాక తొలి పలుకులు నేర్చిన తన బిడ్డడికి

ఆ తరం ప్రతి తెలుగుతల్లి నేర్పే తొలి పద్యాల్లో ఒకటయిన చేత వెన్న ముద్ద అనే

పద్యం కూడా అన్నమయ్య చిన్నికృష్ణ శతకం లోనిది. ఆ శతకం సీసపద్య శతకం.

చేతిలో వెన్నముద్ద – చెంగల్వ పూదండ

బంగారు మొలత్రాడు – పట్టుదట్టి

కొండెపు సిగముడి – కొలికి నెమలిపురి

ముంగురుల్ మూగిన – ముత్తియాలు

కస్తూరికింబట్టు (?) – కన్నులన్ కాటుక

చక్కట్ల దండలు ముక్కుపోగు

సందెతతాయ్వ్తులన్ – సి(స)రి మువ్వ గజ్జెలు

అక్కునమెచ్చుల – పచ్చకుచ్చు

డాబు డంబరమీర –డాచేతిపై నిల్చి

కాళ్ళ సందె ఘల్లు ఘల్లుమనగ

దోగి దోగి యాడ తాళ్ళపాకన్నన్న

చిన్నికృష్ణ! నిన్ను చేరి కొల్తు .

కాలక్రమమున రూపాంతరము చెంది


చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ

బంగారు మొలత్రాడు పట్టుదట్టి

సందె తాయెతులు సరిమువ్వ గజ్జెలు

చిన్నికృష్ణ నిన్ను చేరి కొలుతు.

అనే రూపంగా ఈ పద్యం తెలుగు తల్లుల నోళ్ళలొ నాట్యం చేస్తూ ఉంది.


స్త్రీలు ఆయా సందర్భాలలో, వేడుకల్లో పాడుకొనే పెక్కు విధాలయిన

పాటలపద్ధతిని తాను స్వీకరించి, కీర్తనలు గా రచించి, ఆ పాటలకు ఉన్నతస్థితినీ,

ఉత్తమగతినీ కల్పించాడు అన్నమయ్య.

స్త్రీ జాతిని ఇంతగా గౌరవించి, వారికోసం ఇంత సాహిత్యం సమకూర్చిన

వాగ్గేయకారుడు కూడా అన్నమయ్యే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఇంకా ఎన్నో అపురూప భావాలతో అనన్య సామాన్యంగా పదరచన చేసి “న భూతో న

భవిష్యతి “ అన్నట్లుగా తన పదకవితా సంపదను అత్యంత మనోజ్ణంగా మనముందుంచాడు.

అన్నమయ్య భావనా బలానికి, ప్రతిభా సంపన్నతకు ఆయన పదాలన్నీ ఉదాహరణలే.

అన్నమయ్యకు పదకవితా పితామహుడనీ, సంకీర్తనాచార్యుడనీ బిరుదులున్నాయి. ఇతడు

1408 లో వైశాఖ పౌర్ణమి నాడుజన్మించి, 1503 ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు

దివ్యధామం చేరినట్లు తెలుస్తూంది.


- పొన్నాడ లక్ష్మి

Tuesday 28 February 2023

ఎంతవరకు ఈమనసు

 వచన కవిత్వం - ఓ చిన్ని ప్రయత్నం.

ఎంతవరకు ఈ మనసు అంధకారాన్ని ఎదుర్కొంటుంది?
సమసిపోతుంది ఉదాసీనత ఎప్పుడో ఒకప్పుడు.
సుఖదుఃఖాలు వస్తూ పోతూంటాయి జీవిత సత్యాన్ని తెలుపుతూ.
ఆకురాలుకాలం కొద్దిరోజులు మాత్రమే
పూలవనం మళ్ళీ కళకళలాడుతుంది కొత్త చిగురులతో
ప్రచండ మారుతం వీచినా, అంతరంగంలో అగ్నిశిఖలు రగులుతున్నా
ఆత్మవిశ్వాసాన్ని నిలుపుకొని అడుగు ముందుకు వెయ్యి
పడిలేచే కడలి తరంగాలు తీరాన్ని చేరుతూనే ఉంటాయి
.. పొన్నాడ లక్ష్మి
All reactions:
Vemuri Murty, Vani Venkat and 14 others
2 comments
Like
Comment
Share

ఆవేదన - కవిత

 


ఆవేదన.

గుండె పగిలిపోతూంది మనసు మండిపోతూంది.

అమ్మ మనసులో రగులుతున్న అగ్నిపర్వతం.

ఆడపిల్లకు జన్మనివ్వాలంటే భయం భయం

తనంత తాను వలచి, వలపించుకుని వివాహమనే బంధంలో ఇరికించి

నిత్యం నరకం చవి చూపించే మగాడూ మృగమే..

కులం గోత్రం చూసి పెద్దలు కట్టబెట్టిన మొగుడూ మృగమే..

కట్నకానుకలు అందుకుని, భార్యను నమ్మించి

విదేశాలకు ఉడాయించినవాడు ఒకడైతే,

రాక్షస ప్రవృత్తితో మానసిక హింస పెట్టి కట్టుగుడ్డలతో

ఇంటి నుంచి పారిపోయేలా చేసేది ఒకడు.

ఏ రాయి అయినా ఒకటే కదా! అనిపించే పరిస్థితి.

కళకళలాడుతూ పచ్చని గృహిణిగా తిరుగాడవలసిన అమ్మాయి,

ఏ ముద్దుముచ్చట లేక మోడులా మిగిలితే బాధేగా మిగిలేది.

నేర్చుకున్న విద్య జీవనోపాధి కలిగిస్తుందేమో గానీ,

అతరంగంలో సుళ్ళు తిరిగే బాధను తీర్చగలదా?


ఆత్మస్థైర్యంతో చిరునవ్వు మొహాన పులుముకుని

తల్లితండ్రులను మభ్యపెట్టగలవు కానీ, నీ ఆవేదన తీరేదెలా తల్లీ?

ఎవరతను?

 ఎవరతను?

సాయంత్రం హైదరాబాద్ కొడుకు దగ్గరికి ప్రయాణం. కరోనా కారణంగా చాలారోజులుగా ఎక్కడికీ వెళ్ళలేదు.
విశాఖపట్నం స్టేషన్ దగ్గర ఆటో దిగగానే ఓ పోర్టరు పరుగున వచ్చాడు. ఏ బండి ఎక్కాలో చెప్పగానే తన కూలీ డబ్బులు కాస్త న్యాయంగానే అడిగాడు. అయినా నేను బేరమాడబోయాను. “అమ్మా కరువురోజులు మీకు తెలుసుకదా! బ్రిడ్జ్ మీదనుంచి వెళ్ళాలి.” అన్నాడు. మావారు సరే పద అనగానే “అబ్బాయి దగ్గరకా అమ్మా ప్రయాణం. మీ బండి ఇక్కడనుండే బయల్దేరుతుంది. ఏడవ నంబరు ప్లాట్ఫారం మీదకు వస్తుంది. కంగారు లేదు కోచ్ నంబర్ ఎంతమ్మా” అని అడుగుతూనే సామాన్లు నెత్తికెత్తుకున్నాడు. పరుగులాంటి నడకతో ఓవర్ బ్రిడ్జ్ వేపు దారితీసాడు. మావారు అతని వెన్నంటే ఉన్నారు. గబగబా సామానులు ప్లాట్ఫారం మీద దించేసి వెనక్కివచ్చి. ఇంకా నత్తనడక నడుస్తున్న నన్ను చేయిపట్టుకుని జాగ్రత్త్గగా మెట్లన్నీ నిదానంగా దింపాడు.
మా బండి రావడానికి ఇంకా టైం ఉంది. బాగా పరిచయమున్న వ్యక్తిలా రైళ్ళ గురించి, తన వృత్తిలో అనుభవాల గురించి నవ్వుమొహంతో బోలెడు కబుర్లు చెప్పాడు. మాటల్లోనే ట్రయిన్ రానేవచ్చింది. గబగబా కోచ్ లోకి వెళ్ళి, మా బెర్తుల క్రింద సామానులు నీటుగా సర్దేశాడు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులుకి మరికాస్త జోడించి చేతిలో పెట్టారు మా వారు. “వద్దు బాబూ~! మీరెంత అన్నారో అంతే చాలు అని నా వేపు తిరిగి “అమ్మా భోజనం తెచ్చుకున్నారా? మంచినీళ్ళు తెచ్చుకున్నారా? లేకపోతే కాంటీన్ కి వెళ్ళి ఏమైనా తీసుకురానా?” అని అడిగాడు అతని ప్రవర్తన నాకు కొంచెం ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించాయి. ఈలోగా బండి కదిలింది. అతను గబగబా క్రిందికి దిగి నడుస్తున్న బండితొనే నడుస్తూ ‘ఉంటానమ్మా..’ అంటూ చేతులు జోడించాడు..
ఎవరతను?. మేమంటే ఎందుకంత అభిమానం..? గత జన్మలో కొడుకా, అన్నదమ్ముడా, తండ్రా… ఎవరు? ఎందుకో అతను అందరితోనూ ఇలాగే ఉంటాడా? లేక మా తోనే అలా ఉన్నాడా? అతని స్వభావమే అంతేనేమో? అని ఆలోచనలో పడ్డాను. కళ్ళు మూసుకున్నా అతని నవ్వు మొహం, అతను చూపించిన అభిమానం నా కళ్ళముందు మెదులుతూనే ఉన్నాయి. ఆలోచనల అలజడిలో బండి స్పీడందుకున్న సంగతే తెలియలేదు.
(ఇది మాకు జరిగిన అనుభవం ఆధారంగా)
చిత్రం : శ్రీ Pvr Murty)
No photo description available.
All reactions:
Avadhanula Rama Rao, Jaya Kolluru and 127 others

Monday 1 August 2022

ఇల్లాలే ఆధారం - కధ


'ఇల్లాలే ఆధారం' నా గళంలో నేను చదివిన కధ.ఈ క్రింది facebook లింక్ క్లిక్ చేసి చదవండి.

https://www.facebook.com/memories/?source=bookmark


ధన్యవాదాలు

Monday 11 July 2022

ఆశాజ్యోతి కవిత.

 

ఆశాజ్యోతి - కవిత..

 

గూడు చెదిరిపోయింది, గువ్వ మిగిలిపోయింది

ఆశతోకట్టుకున్న ఆశాసౌధం కూలిపోయింది.

ముక్కలయిన హృదయంతో గువ్వ మిగిలిపోయింది.

కోరి వలచిన వాని వికృత హృదయం చూసి ఆవేదనతో

గువ్వ ఒంటరిగా నలిగిపోయింది.

తన ప్రేమను చూసి లోకం పరిహసిస్తుంటే మౌనంగా తలవంచింది.

తన తెలివి, తన ఓర్మి, తన కష్టం అన్నీ దోచుకోబడి

మానసిక హింసకు గురైన గువ్వ మనసు ఘోషించింది.

అన్యాయం, అక్రమం అని ఎలుగెత్తి చాటాలనుకుంది.

అంతలోనే అంతరంగం మేలుకొంది.

తలవంచకు, తలెత్తి నిలబడు. ఆత్మస్థైర్యంతో

అడుగు ముందుకేయమని ప్రభోదించింది.

నిరాశను పారద్రొలి, నిస్పృహను అణగద్రొక్కి ఆత్మవిశ్వాసంతో

అశాజ్యోతిని చేపట్టి గువ్వ అడుగు ముందుకేసింది.

-- పొన్నాడ లక్ష్మి