Monday 24 November 2014

అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు. - అన్నమయ్య కీర్తన



ప.         అందరి వశమా హరి నెరుగ – కందువగ నొకడు గాని యెరుగడు.
౧.         లలితపు పది గొట్ల నొకడు గాని – కలుగడు శ్రీహరి గని మనగ.
            ఒలిసి తెలియు పుణ్యుల కొట్లలో ఇల నొకడు గాని యెరుగడు హరిని.
౨.         శృతి చదివిన భూసురకోట్లలో – గతియను  హరినే యోకానొకడు,
            అతిఘను లట్టిమహాత్మ కోటిలో – తతి నొకడు గాని తలచడు హరిని.
౩.          తుద కెక్కిన నిత్యుల కొట్లలో – పొదుగు నొకడు తలపున హరిని,
            గుదిగొను హరి భక్తుల కొట్లలో – వెదకు నొకడు శ్రీ వేంకటపతిని.
భావము:
            శ్రీహరిని తెలిసికొనుట అందరికీ వశమా? ఒకానొక విజ్ఞానికి తప్ప పరమాత్ముని తెలుసుకోవడం సాధ్యం కాదు.
            పదికోట్ల మందిలో ఏ ఒక్కడో తప్ప మరెవ్వడూ శ్రీహరిని గుర్తించలేడు. అట్లు గుర్తించిన పుణ్యాత్ములలో ఒక్కడు మాత్రమే హరితత్వమును పూర్తిగా తెలిసినవాడగును.
            వేదములు చదివిన కోట్లకొలది విప్రులలో ‘హరియే గతి’  అని చెప్పువాడు ఒకానొకడు మాత్రమే. అట్లు చెప్పు మహా ఘనులలో ఏ ఒక్కడో తప్ప హరిని  నిక్కముగా మదిలో భావింపడు.
            విద్యావివేకాదులచే ప్రతిష్ఠ గాంచిన నిత్యస్వరూపులైన అనేక జీవులలో తలపున శ్రీ హరిని నిలుపు వాడొక్కడే. అన్నివిధముల అతిశయించిన హరిభక్తుల సమూహములలో శ్రీ వేంకటేశ్వరుని నిజముగా అన్వేషించి కనుగొను వాడెవడో ఒకడే అగును.




1 comment:

  1. భావం చక్కగా చెప్పారండీ.

    ReplyDelete