Saturday 15 November 2014

పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు మరుగురుని మీదట మనసుండవలదా - అన్నమయ్య కీర్తన



పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు
మరుగురుని మీదట మనసుండవలదా

ఆకలిగొన్నవానికి అన్నముపై నుండినట్టు
యేకట వుండవలదా యీశ్వరునిపై
కాకల విటులచూపు కాంతలపై నుండినట్టు
తేకువ నుండవలదా దేవునిమీదటను

పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు
కొసరే భక్తివలదా గోవిందునిపై
వెసదెరువరి తమి విడిదలపై నునట్టు
వసియించ వలదా శ్రీవల్లభుమీదను

వెప్పున ధనవంతుడు నిధి కాచియుందినట్టు
తప్పక శ్రీవేంకటేశు తగులవద్దా
అప్పసమైన భ్రమ ఆలజాలాలకున్నట్టు
యిప్పుడే వుండవలదా యీతని మీదను

భావం:                                  
            పరమ సుజ్ఞానులకు ప్రపత్తి మార్గమును అనుసరించువారికి మాధవునిపై సదా మనస్సు లగ్నమై ఉండవలెను.
            ఆకలిగొన్నవానికి అన్నముపై నుండునట్లు భక్తునికి పరమేస్వరునిపై తీవ్రమైన ఆపేక్ష ఉండవలెను. కామార్తులైన విటుల చూపు కాంతల పైననే ఉండినట్లు జిజ్ఞాసువులకు దేవుని మీదనే ధృడమైన దృష్టి ఉండవలెను.
            పసిబిడ్డలకు పాలచన్ను పైననే ఆశ ఉన్నట్లు భక్తులకు గోవిందుని పైననే భక్తి స్థిరమై ఉండవలెను. బాటసారి ఆపేక్ష అంతయు తాను  విడినచోటనే ఉన్నట్లు ప్రపన్నునకు శ్రీనాధుని మీదనే లక్ష్యముండవలెను.
            ధనికుడు ఏమరుపాటులేక నేర్పుతో తన ధనపేటికను కాచుకొని యుండునట్లు శరణాగతుడు శ్రీవేంకటేశ్వరునే అనుసరించి యుండవలెను. ఆలజాలములకు(నీటిలోనే తిరుగాడే పురుగులు)నీటిపై ఎడతెగని భ్రమణ మున్నట్లు ఈ దేవునిపై సంతత ప్రేమ, భక్తి యుండవలెను.

No comments:

Post a Comment