ఈ వారం అన్నమయ్య కీర్తన (గురుపూర్ణిమ సందర్భంగా ఈ కీర్తన)
వ్యాఖ్యానం శ్రీ మేడసాని మోహన్ గారి సౌజన్యంతో :
గురు శిష్య సంబంధం:
భారతదేశంలో అనాదిగా వేద వాఙ్మయం, ఉపనిషత్తులు, వివిధ సంప్రదాయాలకు చెందిన ఆగమ శాస్త్రాలు ‘ముఖే ముఖే సరస్వతి’ సంప్రదాయంలోనే అధ్యయనం చేయబడుతున్నాయి. గురువుగారు వల్లె వేస్తూ ఉండగా శిష్యులు యథాతథంగా ఉచ్ఛరిస్తూ, ధారణ చేస్తూ సమస్త విద్యలను అభ్యసించేవారు. అంటే గురు శిష్యుల మధ్య పవిత్రమైన అనుబంధం, సత్సంబంధాలు భారతీయ సంతతికి పునాదులు. ఈ పరమ సత్యాన్ని గుర్తించిన అన్నమయ్య దేవదేవుడైన శ్రీనివాసుడే సమస్త జీవులకు గురుదేవుడని, ఆ స్వామికి గురుస్థానాన్ని ఆపాదిస్తూ ఈ క్రింది సంకీర్తన రచించినాడు.
"తానె తానె ఇందరి గురుడు
సాన బట్టిన భోగి జ్ఞాన యోగి
అపరిమితములైన యజ్ఞాలు వడిజేయు
ప్రసన్నులకు బుద్ధి పరగించి
తపముగా ఫలపరిత్యాగము గావించు
కపురుల గరిమల కర్మయోగి || తానె ||
అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ
మన్నించు బుద్ధులకు మరుగజెప్పి
ఉన్నత పదముల కానరగ కరుణించు
పన్నగ శయనుడే బ్రహ్మయోగి || తానె||
తనరగ కపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకట రాయుడై
ఒనరగ సంసార యోగము కృపసేయు
అనిమిషగతులకు అభ్యాసయోగి || తానె||"
సారాంశం :
దేవదేవుడైన శ్రీ వేంకటేశుడే ఈ సమస్త సృష్టిలోని జీవరాశులకు గురుడు. జీవులందరూ అనుసరింపవలసిన జ్ఞానయోగాన్ని ప్రసాదించే గురుదేవుడే ఆ స్వామి. పూర్వావతారాలలో కపిలాచార్యుడిగా, దత్తాత్రేయుడుగా జీవులకు జ్ఞానప్రబోధం చేసిన భగవంతుడే ఈ వేంకటరాయుడు. సమస్త యోగబలానికి అవసరమైన సాధనా సామాగ్రిని సమకూర్చే అభ్యాస యోగాన్ని అనుగ్రహించి జీవులను దైవీ సంసారం వైపు పయనింపచేసే యోగీశ్వరేశ్వరుడే ఈ వేంకటేశ్వరుడు.
No comments:
Post a Comment