Monday, 27 July 2020

అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.


అన్నమయ్య కీర్తనలలో స్త్రీ పురుష సమానత్వం.
పురుషాధిక్య సమాజంలో సాధారణంగా లోకులు పురుషునిలో ఎన్ని లోపాలున్నా పట్టించుకోరు. నీతిబోధలు చెయ్యరు. ఏ దోషాలు లేకపోయినా స్త్రీలకి అందరూ నీతులు చెప్పేవారే. సద్దుకుపోవాలని, సహించాలని ఉచిత సలహాలు ఇస్తుంటారు. కానీ న్యాయవేత్త, సత్యవాది, మానవతావాది అయిన అన్నమయ్య 15వ శతాబ్ధం లోనే స్త్రీకి పురుషునితో పాటు సమానత్వం, స్వేచ్చాస్వాతంత్ర్యాలు కాంక్షించాడు. ఉదాహరణ
పొలుతులు జీవులే  పురుషులు జీవులే  -  తలప భావభేదమే కాని,
బలిమి స్వతంత్రము  పరతంతంత్ర మొకరికి  -  ఎలిమి చెల్లే నిందులో హినాధికములే..
అనే కీర్తనలో స్రీలు కూడా జీవులేనని, పురుషులకు స్వాతంత్ర్యమిచ్చి, స్త్రీలను పరతంత్రులుగా చేయడం హీనాతిహీనమని, స్త్రీలకూ వ్యక్తిత్వం, అభిరుచులు ఉంటాయని ఎలుగెత్తి చాటాడు. అన్నమయ్య వనితాభ్యుదయాభిలాషి. వనితలకూ విద్య, వేదాధ్యయనం అవసరమని, జ్ఞానదేవతలయిన గాయిత్రి, సరస్వతి స్త్రీమూర్తులేనని నొక్కి వక్కాణించాడు. అతని భార్య తాళ్ళపాక  తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి. ఆ విదుషీమణి  చేసిన ఈ కావ్యరచనలో అన్నమయ్య సహకార ప్రోత్సాహాలు ఎంతున్నాయో మనకి అర్ధమౌతుంది.
అభిమానవతి అయిన ఏ స్త్రీ అయినా తన భర్త పరస్త్రీ సాంగత్యం చేస్తే ఓర్చుకోలేదు. అతనిలోని అవగుణాలని నిలదీసి ఖండిస్తుంది. ఈ అంశాన్ని  అన్నమయ్య అనేక కీర్తనలలో వ్యక్తపరిచాడు. ఒక నాయిక తన నాయకునకు ఎన్నోసార్లు నీతి బోధించి  ఫలితం లేకపోయేసరికి విసుగు చెంది జాజిపువ్వు జాజిపువ్వే అవుతుంది కానె దిరిశన పువ్వు అవుతుందా? నీ తత్వాని నీవు ఎంతైనా మానుతావా? కొంతమందికి అనురాగాలు, కొంతమందికి ద్వేషాలు చూపుతున్నావు. పొగడపుష్పాలని ఎంత ఇష్టంగా వాసన చూసినా అందులోని వాసనే ఉంటుంది కానీ దాని మదం పోతుందా? ఆ విధంగానే మితిమీరిన నీ చేష్టలు నీలాంటివారికి గాక తిరిగి నీ బుడ్ఢులు మంచివి అవుతాయా? ధీరుడవైన  శ్రీ  వేంకటేశా! వీడనిబంధాల వసంతంలో మా కోరికల ఆశ మానుతుందా! అని కొన్ని సామెతల ద్వారా అతనికి నీతి గరపడం తన ప్రేమను వ్యక్తం చెయ్యడం కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో నాయికా నాయకుల విరహం, అలుక మొదలైనవి వర్ణించబడిన చివరలో వారి సమైక్యత గోచరిస్తుంది. అందులో వివాహబంధం పటిష్టత, దాంపత్య జీవితంలో సద్దుబాటు కనిపిస్తాయి. దీనివలన జీవాత్మ పరమాత్మతో కలసి ఉన్నప్పుడే చిత్తశాంతి కలుగుతుందని అన్నమయ్య అంతర్గత భావన.
తన ఇష్టసఖునిపై అనేక కారణాలవల్ల కోపోద్రిక్త అయిన ఒక అభిమానవతి విజృంభించి అతనితో ‘నీ పొందు నాకు వద్దు పోరా!” ఓరి నీ పంతాలన్నీ వెలికి తీస్తాను, ఓరి బెదిరింపు చూపులతో వైరాన్ని దాటవద్దురా!, ఓరి ఎంతైనా ఇంక నిన్ను పోనివ్వను, ఇతరుల సంబంధాలు తలచవద్దురా!” ఇటువంటి ప్రయోగాలు అన్నమయ్య కీర్తనల్లో గమనిస్తే దారితప్పిన పురుషుని  నిలదీసి అడగడానికి, నీతిబోధ చెయ్యడానికి అన్నమయ్య స్త్రీకి ఒసగిన అధికారం, చనువు, స్వాతంత్ర్యం వ్యక్తమవుతున్నాయి. అంత పాతకాలంలో, స్త్రీని బానిసగా చూసే రోజుల్లో అన్నమయ్య స్త్రీల పట్ల చూపిన ఔదార్యం, విశాల భావం, సంస్కారం అన్నీ కనిపిస్తాయి.
కొన్ని కీర్తనల్లో అన్నమయ్య తానె చెలికత్తె రూపం ధరించి, నాయిక చేసిన ఆక్షేపణలకు అలిగిన నాయకునికి సద్బుద్ధులు చెప్పి, ఆనక స్వామిని పొగిడి, నాయికపై అనురక్తి కలిగించడం గోచరిస్తుంది. “నీ పై విరహంతో ఆమె నిద్రపోదు, భుజించదు అన్నిటా నీకు అనువైన సఖిపై నీకు అలుకెందుకయ్యా. ఇప్పుడే వెళ్ళి ఆమెని ఆదరించకపోతే నీ పాదాలపై ఒట్టు. ఆపైన నీచిత్తం ఆమె భాగ్యం” అంటూ అధికారంతో మందలించిన వైనం కనిపిస్తుంది. స్వల్పకారణాలకే ఆమెపై కోపించి అలిగి ఉన్న స్వామికి ధర్మబోధ చేస్తుంది.
నేటి ఆధునిక కాలంలో సంఘసంస్కర్తలు గావించిన సాంఘిక విప్లవాలవల్ల , పరిణితి చెందిన స్త్రీల మనోభావాల వల్ల స్త్రీలు పురుషులతో సమానంగా చదువుకొని, అన్ని రంగాలలోనూ ఉద్యోగాలు చేస్తూ అభ్యుదయాన్ని  సాధిస్తున్నారు. ఈ చైతన్యం అందరు స్త్రీలలోనూ రావలసి ఉంది. నేటికీ తమకు జరుగుతున్న అన్యాయాన్ని, నయవంచనలని మనసు విప్పి చెప్పుకోలేని వనితలెందరో ఉన్నారు. ‘స్త్రీకి ఇంటా బయటా అధికారం మాట అలా ఉంచి, తన మీద తన శరీరం మీద, తన జీవితం మీద, తన మనసు మీద  ముందుగా సంపూర్ణ అధికారం రావాలి’ అని ఎవరో రచయిత చెప్పినట్లు అన్నమయ్య కీర్తనల్లో ఇటువంటి దృక్పధం కూడా కనిపిస్తుంది.
అన్నమయ్య శృంగార కీర్తనలలో ఈనాటి ఆధునిక స్త్రీకి లోకం మెచ్చే చైతన్యం, తెలివితేటలు, ప్రత్యేక వ్యక్తిత్వం ఆనాడే స్త్రీ పాత్రలకు అన్వయించడం, పురుషునికి ధర్మ ప్రబోధం చేయించడం గమనిస్తే, ఈనాటి పరిస్థితులను అన్నమయ్య ఆనాడే ఊహించిన కాలజ్ఞానిగా తోస్తుంది. అన్నమయ్య సంకీర్తనలను మనసు పెట్టి చదివితే స్త్రీవాదులే కాక మానవతావాదులందరూ కూడా ఆశ్చర్యానందాలు పొంది అన్నమయ్యకు చెయ్యెత్తి జే కొట్టకుండా ఉండలేరు. శిరస్సువంచి నమస్కరించకుండా ఉండలేరు.
--- పొన్నాడ లక్ష్మి

Sunday, 5 July 2020

తానే తానే ఇందరి గురుడు - అన్నమయ్య కీర్తన



ఈ వారం అన్నమయ్య కీర్తన (గురుపూర్ణిమ సందర్భంగా ఈ కీర్తన)

వ్యాఖ్యానం శ్రీ మేడసాని మోహన్ గారి సౌజన్యంతో :

గురు శిష్య సంబంధం:

భారతదేశంలో అనాదిగా వేద వాఙ్మయం, ఉపనిషత్తులు, వివిధ సంప్రదాయాలకు చెందిన ఆగమ శాస్త్రాలు ‘ముఖే ముఖే సరస్వతి’ సంప్రదాయంలోనే అధ్యయనం చేయబడుతున్నాయి. గురువుగారు వల్లె వేస్తూ ఉండగా శిష్యులు యథాతథంగా ఉచ్ఛరిస్తూ, ధారణ చేస్తూ సమస్త విద్యలను అభ్యసించేవారు. అంటే గురు శిష్యుల మధ్య పవిత్రమైన అనుబంధం, సత్సంబంధాలు భారతీయ సంతతికి పునాదులు. ఈ పరమ సత్యాన్ని గుర్తించిన అన్నమయ్య దేవదేవుడైన శ్రీనివాసుడే సమస్త జీవులకు గురుదేవుడని, ఆ స్వామికి గురుస్థానాన్ని ఆపాదిస్తూ ఈ క్రింది సంకీర్తన రచించినాడు.

"తానె తానె ఇందరి గురుడు
సాన బట్టిన భోగి జ్ఞాన యోగి

అపరిమితములైన యజ్ఞాలు వడిజేయు
ప్రసన్నులకు బుద్ధి పరగించి
తపముగా ఫలపరిత్యాగము గావించు
కపురుల గరిమల కర్మయోగి || తానె ||

అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ
మన్నించు బుద్ధులకు మరుగజెప్పి
ఉన్నత పదముల కానరగ కరుణించు
పన్నగ శయనుడే బ్రహ్మయోగి || తానె||

తనరగ కపిలుడై దత్తాత్రేయుడై
ఘనమైన మహిమ శ్రీ వేంకట రాయుడై
ఒనరగ సంసార యోగము కృపసేయు
అనిమిషగతులకు అభ్యాసయోగి || తానె||"

సారాంశం :
దేవదేవుడైన శ్రీ వేంకటేశుడే ఈ సమస్త సృష్టిలోని జీవరాశులకు గురుడు. జీవులందరూ అనుసరింపవలసిన జ్ఞానయోగాన్ని ప్రసాదించే గురుదేవుడే ఆ స్వామి. పూర్వావతారాలలో కపిలాచార్యుడిగా, దత్తాత్రేయుడుగా జీవులకు జ్ఞానప్రబోధం చేసిన భగవంతుడే ఈ వేంకటరాయుడు. సమస్త యోగబలానికి అవసరమైన సాధనా సామాగ్రిని సమకూర్చే అభ్యాస యోగాన్ని అనుగ్రహించి జీవులను దైవీ సంసారం వైపు పయనింపచేసే యోగీశ్వరేశ్వరుడే ఈ వేంకటేశ్వరుడు.