Saturday 11 November 2017

అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా - అన్నమయ్య కీర్తన

ఈ వారం అన్నమయ్య కీర్తన :

అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా
వలపుల ఈది ఈది వాసులకే లోగి లోగి
అలుకలే తవ్వి తవ్వి యట్టె నవ్వి
చెలగేటి విరహివి చింత మాన్ప నెరగనా
చెలి నింతే నీకు నేను చెప్పి చూపవలెనా
బలిమై చేయి చాచి చాచి పంతాన మెయి దోచిదోచి
పలుకాక గందికంది భామల బొంది
కులుకుజాణడవు నా కోర్కె తీర్పనెరుగవా
ఇలా నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా
పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్ళీ మళ్ళీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్ళి
తలచి శ్రీవేంకటేశ తగ నన్ను గూడితివీ
వెలయు నీదేవి నింతే వేదుకొనవలెనా

భావం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో, ఆడువారైనా, మగవారైనా అందరికీ ఒక్కటే మాట చాలును అంటారు. ముందటనే ఎత్తుగడగా నిన్ను నొప్పించేటట్లు నాకు మాటాడవలఇన పనియేమి.
ఆడువారికైనా మగవారికైనా ఒక్కటే నీతి కదా స్వామీ ! నీవు వనితల వలపులలో ఈది ఈది, వారి చూపే వాసులకు (ఆధిక్యమునకు) లొంగి లొంగి వారి అలకలు తీర్చి తీర్చి మళ్ళీ మధురంగా వాళ్ల విరహతాపమును నీవే అనుభవిస్తూ వారి చింత బాపుట ఎరుగుదవు. నీకు నేను నెచ్చిలినే కదా స్వామీ ! వేరే నీకు చెప్పవలనా ?
స్వామీ ! బలిష్టమయిన నీ చేయి చాచి చాచి, నా శరీరమును పంతముతో దోచి దోచి, అనేకమైన తాపములతో కంది కంది, అనేకమంది భామలను పొంది పొంది, వారితో కులికే నేర్పరివి. మరి నా కోర్కెలనుకూడా తీర్చనెరుగవా? నేనూ జవ్వనినే. నన్నింత రట్టుచేయవలెనా ?
స్వామీ ! నాపై మాటలు గుప్పించి గుప్పించి, మళ్ళీ మళ్ళీ నన్ను పారి పారి (తడివీ తడివీ) మన్మధుని పనులకు వాహ్యాళికి వెళ్ళి పనిలోపనిగా వేంకటేశా నన్ను కూడితివి. ఇంతాచేసి నేను నీ దేవేరినే కదా స్వామీ. నన్నింత వేడుకోవలెనా?


No comments:

Post a Comment