Sunday 14 December 2014

ఇన్నిచదువనేల ఇంత వెదకనేల కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి



సంగీత ప్రపంచంలో ఒక ధ్రువతార వేంకటేశ్వరుని పాదాల చెంతకు చేరింది. అన్నమయ్య కీర్తనలను రచించిన వాడయితే నేదునూరి కృష్ణమూర్తి గారు ఆ కీర్తనలకు స్వరకర్తయై అజరామరమయినాడు. ఆ తిరుమలేశుని భక్తులు ఉన్నంతవరకూ అన్నమయ్య పదాలు, నేదునూరి స్వరాలూ, అవి ఆలపించినవారి గళాలు తెలుగువారిని పులకరిమ్పజేస్తుంటాయి. ఆయనకు దక్కని పద్మాలు తమకు లభించని గౌరవానికి చిన్నబుచ్చుకున్నాయి. ఆ నాదబ్రహ్మ కి  ఇదే నా అశ్రునివాళి. 

ఇన్నిచదువనేల ఇంత వెదకనేల
కన్ను తెరచుటొకటి కనుమూయుటొకటి ||

వలెననేదొకమాట వలదనేదొక మాట
సిలుగులీ రెంటికిని చిత్తమే గురియౌను
వలెనంటె బంధము వలదంటె మోక్షము
తెలిసి విజ్ఞానులకు తెరువిది యొకటే ||

పుట్టెడిదొకటే పోయెడిదొకటే
తిట్టమై రెంటికిని దేహమే గురియౌను
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము
వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||

పరమనేదొకటే ప్రపంచమొకటే
సిరుల నీరెంటికిని జీవుడే గురియౌను
ఇరవు వేంకటేశుడిహ పరములకర్త
శరణాగతులకెల్ల సతమీతడొకడే ||
భావం:
          ఇన్ని శాస్త్రాలు చదువుకోవడం ఎందుకు? ఇంతగా అన్వేషించడం ఎందుకు?ఒక జీవి కన్ను తెరిస్తే మరొక జీవి కన్ను మూస్తుంది.ఇది అందరికీ తెలిసిన నిజం.
          అవును అనేది ఒక మాట. కాదు అనేది ఒక మాట. ఈ రెంటి మాటలకి మనసే బాధకి గురి అవుతుంది. కావాలి అనుకుంటే బంధాలు ఏర్పడతాయి. ఏదీ వద్దనుకుని పరమాతుడు ఒక్కడే చాలు అనుకుంటే మోక్షం కలుగుతుంది. తెలిసిన విజ్ఞానులకు దారి ఇది ఒకటే.
          పుట్టేది ఒకరయితే పోయేది మరొకరు. రెంటికీ స్థూలాకారం ఒకటే! పుట్టుక సంశయం కాని మరణం నిశ్చయం. వొట్టి విజ్ఞానులకు ఇది ఉపాయం.
          పరమ అనేది ఒకటే. ప్రపంచమూ ఒకటే. ఈ రెండింటికీ జీవుడే గురి అవును. ఇహపరాలు అన్నింటికీ శ్రీ వేంకటేశ్వరుడు ఒక్కడే కర్త. శరణాగతులకు ఈతడే దిక్కు.

No comments:

Post a Comment