Friday 15 March 2019

ఆది దైవుఁడై అందరిపాలిటి – కీ దేవుఁడై వచ్చె నితడు - అన్నమయ్య కీర్తన





ఈవారం అన్నమయ్య కీర్తన

ఆది దైవుఁడై అందరిపాలిటి –
కీ దేవుఁడై వచ్చె నితడు ||పల్లవి||

కోరినపరమయోగుల చిత్తములలోన
యేరీతినుండెనో యీతఁడు
చేరవచ్చినయాశ్రితులనెల్లఁ బ్రోవ
యీరీతి నున్నవాఁ డీతడు ||ఆది||

కుటిలదానవుల కోటానఁగోట్ల
యెటువలెఁ ద్రుంచెనో యీతఁడు
ఘటియించి యిటువంటికారుణ్యరూపుఁడై
యిటువలె నున్నవాఁడీతడు ||ఆది||

తక్కక బ్రహ్మాండతతులెల్ల మోచి తా-
నెక్కడ నుండెనో యీతఁడు
దిక్కుల వెలసినతిరువేంకటేశుఁడై
యిక్కడ నున్నవాఁడీతఁడు ||ఆది||

ప్రకృతిమాత ఒడిలో జనావాసానికి దూరంగా ఎక్కడో ఒక మూల ఎవరికీ తెలియకుండా వుండి, తనకు తానుగా ఏ హడావుడీ అట్టహాసమూ లేకుండా, సవ్వడిలేకుండా పారుతూ, అందులోనే ఆనందాన్నంతా పొందుతున్న సెలయేరులాగా వుంటుంది ఈ సంకీర్తన పదం. దానికదే ఏ గొడవతోనూ సంబంధం లేకుండా పాట సాగిపోతున్నట్లు, మాటతో మాట చాలా సహజంగా ఒకదానితో ఒకటి ముడిపడిపోయినట్లు ఒకదానితో ఒకటి చాలా ఇష్టంగా అల్లుకుపోయి ఆవంతున అంతలోనే పాట పూర్తయిపోయినట్లుగానూ వుంటుంది చదవడం పూర్తయేటప్పటికి.

ఏమీ కష్టమయిన మాటలు లేవు ఇందులో. తెలీని, అర్ధంగాని సంగతులు కూడా లేవు. అందుకే అంత అత్మీయంగా వుంటుందనుకుంటాను. ఎంత ఆత్మీయత అనుభవించకపోతే, వెంకటేశ్వరుని ‘ఇతడూ… ఇతడూ’ అని ఏదో స్నేహితుని గురించి చెబుతున్నది అన్నట్లు – సంబోధిస్తాడు అన్నమయ్య! అంతరంగంలో చాల తాదాత్మ్యము, స్వచ్చత ఉండాలిగదా ఆ చొరవ, ధైర్యం రావడానికి!

రాగం ‘సామంతం’ లో పాడబడుతుందట ఈ సంకీర్తన!

ఈ సంకీర్తనలో, విశేషమైన తెలివితేటలూ, యోచనా అనేవి ఏమీ లేకుండా నిర్దేశిత మార్గంలో జీవితాన్ని గడుపుతూ, రోజువారి బ్రతుకులో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆటుపోట్లనూ ఏలాగో తట్టుకుంటూ బ్రతుకులను ఈడుస్తూ, కష్టం వచ్చినప్పుడల్లా బ్రోవవయ్యా స్వామీ అని మనసులో కోటి దండాలు పెట్టుకుంటూ దరి చేరే సామాన్య భక్తుడి పట్ల వేంకటేశ్వరుని కరుణామయ ద్రృష్టి ఆవిష్కృమైంది అని నేను అర్ధంచేసుకున్నది.సాంసారిక జీవితాన్ని త్యజించి కఠినమైన నియామలతో, జ్ఞానవంతమైన బుధ్ధితో సేవించే పరమ యోగులైన వారికి ఏ రూపంలో దర్శనమిస్తాడో గాని, ఇవేవీ లేకుండా మామూలు జీవితం గడిపే సామాన్య సంసారికి మాత్రం కష్టాలనుంచి గట్టెక్కించడానికి వున్నాడు గదా ఇతడు అని అన్నా, బలవంతులయిన కోటానుకోట్ల దానవులను నిర్జించగలిగేంత విశేష శౌర్యవంతుడవైనా ఇక్కడ అలాంటి బలమేమీ లేని దుర్బలుడైన మామూలు సంసారికి ఇతడిది ప్రసన్నమైన కరుణామయ రూపం అని అన్నా, సకల భువనాలను తానుగా మోసి అప్పుడు తానెక్కడ వున్నాడో తెలియదు గాని, ఇప్పుడు మాత్రం బ్రహ్మాండ నాయకుడై కరుణతో ఇక్కడ వెలిశాడు అని అన్నా…. ఇవన్నీ సామాన్య భక్తుని మీద శ్రీ వేంకటేశ్వరునికి వున్న కరుణామయ దృష్టిని విశదం చెయ్యడానికే!

(అంతర్జాలం నుండి సేకరణ )

No comments:

Post a Comment